సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన క‌రాటే ఛాంపియన్‌ కార్తీక్‌

కార్తీక్‌కు రూ.10 ల‌క్ష‌ల న‌గ‌దు ప్రోత్సాహకం ప్ర‌క‌టించిన సీఎం

తాడేప‌ల్లి: సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌ను ఏపీకి చెందిన అంతర్జాతీయ కరాటే ఛాంపియన్‌ అరబండి కార్తీక్‌ రెడ్డి మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిశారు. అంతర్జాతీయ వేదికలపై తెలుగువారి ఖ్యాతిని నిలబెడుతున్న క్రీడాకారులను ఈ సంద‌ర్భంగా వైయ‌స్‌ జగన్ అభినందించారు. జాతీయ, అంతర్జాతీయ క్రీడలలో పతకాలు సాధించిన క్రీడాకారులను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తుంద‌ని, క్రీడలకు మరింతగా ప్రాధాన్యతనిస్తున్నామని సీఎం అన్నారు. కరాటేను శాప్‌ క్రీడగా గుర్తిస్తూ తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

ఇటీవల జరిగిన కామన్వెల్త్‌ కరాటే ఛాంపియన్‌షిప్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించి, అండర్‌ 16 బాలుర 70 కేజీల కుమిటే విభాగంలో తిరుప‌తికి చెందిన కార్తీక్‌ స్వర్ణపతక విజేతగా నిలిచారు. అంతకుముందు ఏప్రిల్‌లో లాస్‌వేగాస్‌లో జరిగిన యూఎస్‌ఏ ఓపెన్ ఛాంపియన్‌షిప్‌లోనూ స్వర్ణపతకాన్ని గెలుచుకున్నారు. దీంతో వరసగా రెండు స్వర్ణాలు నెగ్గిన తొలి ఇండియన్‌ ప్లేయర్‌గా కార్తీక్ రికార్డు సృష్టించారు. అక్టోబర్‌లో టర్కీలో వరల్డ్‌ కరాటే ఫెడరేషన్‌ ఆధ్వర్యంలో అఫిషియల్‌ వరల్డ్ ఛాంపియన్‌షిప్‌లో పాల్గొని పతకం సాధిస్తానని కార్తీక్ ధీమా వ్య‌క్తం చేశారు. 

తాను సాధించిన పతకాలను సీఎం వైయ‌స్‌ జగన్‌కు చూపి, తనకు ప్రభుత్వం నుంచి సహకారం ఇవ్వాలని కార్తీక్ కోరారు. సానుకూలంగా స్పందించిన ముఖ్యమంత్రి, రూ. 10 లక్షల నగదు ప్రోత్సాహకం, మున్ముందు కార్తీక్‌ అవసరమైన పూర్తి ప్రోత్సాహాన్ని ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో పర్యాటక, సాంస్కృతిక, క్రీడా శాఖ మంత్రి ఆర్‌.కే.రోజా, కార్తీక్‌ తల్లిదండ్రులు శిరీషా రెడ్డి, చంద్రశేఖర్‌ రెడ్డి, ఎస్‌కేడీఏఏపీ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ మిల్టన్‌ లూథర్‌ శాస్త్రి, ప్రవీణ్‌ రెడ్డి, కృష్ణారెడ్డి ఉన్నారు.

Back to Top