అసెంబ్లీ: ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ సభ్యులు శాసనసభలో లేవనెత్తే అంశాలపై చర్చించి వాటికి సమాధానం చెప్పేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ ప్రసాదరాజు అన్నారు. ఐదు రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీఏసీ సమావేశం నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. సమావేశం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద చీఫ్ విప్ ప్రసాదరాజు మాట్లాడారు.
‘‘శాసనసభలో టీడీపీ లేవనెత్తిన అంశాలను ప్రభుత్వం చర్చించి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉందని చెప్పాం. దురుద్దేశపూర్వకంగా సభ సజావుగా జరగకుండా అడ్డుకోవడం, ప్రభుత్వం చేస్తున్న మంచి కార్యక్రమాలపై చర్చ జరగనివ్వకుండా గొడవ చేయడం వద్దని ప్రతిపక్షాన్ని కోరాం. బీఏసీ సమావేశం మొదలవ్వకుండానే అసెంబ్లీ స్టార్ట్ అయిన వెంటనే టీడీపీ సభ్యులు సభను అడ్డుకోవాలని, సస్పెండ్ చేయించుకొని బయటకు వెళ్లాలని చూశారు.. దానిపై స్పీకర్ కూడా అభ్యంతరం తెలిపారు.
ప్రతిపక్షం అడిగిన ప్రశ్నలకు చర్చకు ప్రభుత్వం సిద్ధమని సీఎం వైయస్ జగన్ బీఏసీలో చెప్పారు. సభను తప్పుదోవపట్టించే విధంగా ప్రవర్తించవద్దని కోరారు. చంద్రబాబు, వారి సభ్యులను ఐదు రోజులు సభలో కొనసాగామని ప్రభుత్వం కూడా కోరుకుంటుంది. ధైర్యంగా చర్చలో పాల్గొనే పరిస్థితి వారికి లేదు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు విఫలమయ్యారు. మూడు సంవత్సరాల్లో సీఎం వైయస్ జగన్ చేస్తున్న కార్యక్రమాలపై అడిగేందుకు ప్రతిపక్షానికి ప్రశ్నలు లేవు. కానీ, సభను పక్కదారి పట్టించే విధంగా ప్రవర్తిస్తున్నారు. ఏదో రకంగా సస్పెండ్ కావాలి.. బయటకు వెళ్లాలనే ఉద్దేశంతోనే ప్రవర్తిస్తున్నారు. ధైర్యంగా చర్చకు వచ్చే పరిస్థితి ప్రతిపక్ష సభ్యుల్లో కనిపించడం లేదు. సభ సక్రమంగా జరిగేలా సహకరించండి అని ప్రతిపక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం’’ అని చీఫ్ విప్ ప్రసాదరాజు అన్నారు.