తాడేపల్లి: రాజకీయ లబ్ధిపొందాలని కొన్ని శక్తులు ఏకమై దేవాలయాలపై దాడులు చేయిస్తున్నట్లుగా అనిపిస్తోందని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రోజు ఎక్కడోచోట దేవాలయాల్లో ఏదో ఒకటి ఎందుకు జరుగుతుంది.. కావాలనే ఇలాంటి సంఘటనలు సృష్టిస్తున్నట్లుగా ఉన్నాయన్నారు. ప్రభుత్వం అమలు చేసే పథకాలను చూసి ఓర్వలేక, ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రతిపక్షాలు ప్రయత్నిస్తున్నాయన్నారు. అంతర్వేదిలో ఆలయ రథం ఘటనలో ప్రభుత్వం వేగంగా స్పందించిందని, అధికారులపై చర్యలు తీసుకోవడంతో పాటు, నూతన రథం నిర్మాణానికి ప్రభుత్వం ఆదేశించిందన్నారు. ఘటనలో వాస్తవాలను వెలికితీసేందుకు సీబీఐ విచారణకు కూడా సీఎం వైయస్ జగన్ ఆదేశించారని గుర్తుచేశారు. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పశ్చిమ గోదావరిలో వేణుగోపాల స్వామి రథం తగలబడిందని సజ్జల రామకృష్ణారెడ్డి గుర్తుచేశారు. అప్పటి ప్రభుత్వం రథం విషయాన్ని అసలు పట్టించుకోలేదని, ప్రజలే చందాలు వేసుకుని రథాన్ని ఏర్పాటు చేసుకున్నారన్నారు. కూల్చడం, కాల్చడం వంటి ఘటనల ద్వారా అడ్డదారుల్లో ఓట్లు తెచ్చుకోవాలన్న ఆలోచన ప్రతిపక్షాల్లో కనిపిస్తుందన్నారు. ప్రతిపక్షాలు చేసే దుష్ట రాజకీయాలను ప్రజలు అర్థం చేసుకున్నారన్నారు.