శ్రీ సత్యసాయి జిల్లా: ప్రజా వైద్యాన్ని కాపాడే యుద్ధంలో వైయస్ఆర్సీపీ ముందంజలో ఉంటుందని మాజీ మంత్రి, శ్రీ సత్యసాయి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించాలనే కూటమి కుట్రలకు చెక్ పెట్టేందుకు వైయస్ఆర్సీపీ చేపట్టిన రచ్చబండ – కోటి సంతకాల ప్రజా ఉద్యమంను ఘనవిజయం చేసేందుకు అందరూ కలసికట్టుగా కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు. పరిగి మండల కేంద్రం, నరసాపురం గ్రామంలో వైయస్ఆర్సీపీ నేతలు, కార్యకర్తలతో కలిసి సంతకాల సేకరణ కార్యక్రమాల్లో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉషాశ్రీ చరణ్ మాట్లాడుతూ..“ప్రజా వైద్య వ్యవస్థను ప్రైవేట్ చేతుల్లోకి వెళ్లనివ్వకూడదు. రచ్చబండ కార్యక్రమం ద్వారా కోటి సంతకాల సేకరణను మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ ప్రారంభించారు. ప్రజా వైద్యాన్ని బలహీనపరచడం, ప్రైవేట్ కాపిటలిస్టుల చేతుల్లోకి నెట్టడం చంద్రబాబు లక్ష్యమని” వ్యాఖ్యానించారు.. చంద్రబాబు నాయుడు చేస్తున్న మోసాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండకట్టాలన్నారు. అధికారం కోసం అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటినా ఇచ్చిన హామీలను అరకొరగా నెరవేర్చుతూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. “గ్రామ స్థాయిలో పార్టీ కమిటీల ద్వారా వైయస్ఆర్సీపీ క్రమబద్ధంగా ముందుకు సాగుతుంది. ప్రతి నాయకుడు, కార్యకర్త తమ గ్రామాన్ని బాధ్యతగా తీసుకుని ప్రజలతో కలసి ఉద్యమాన్ని విజయవంతం చేయాలి,” అని పిలుపునిచ్చారు.. కలిసికట్టుగా పని చేసి రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడం మన అందరి బాధ్యతన్నారు.