మ‌హానేత విగ్ర‌హాన్ని తాకే ద‌మ్ము టీడీపీకి ఉందా..?

టీడీపీ నేత‌ల‌కు మాజీ మంత్రి కురసాల కన్నబాబు సవాల్‌ 

కాకినాడ: టీడీపీ అధికారంలోకి వస్తే మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి విగ్రహాలన్నింటినీ బంగాళాఖాతంలో పడేస్తామంటున్న తెలుగుదేశం పార్టీ నేతలకు దమ్ముంటే వైయ‌స్ఆర్ విగ్రహాన్ని తాకి చూడాలని మాజీ మంత్రి కురసాల కన్నబాబు సవాల్ విసిరారు. చేశారు. తూర్పు గోదావరి జిల్లా టీడీపీ ఇన్‌చార్జి బండారు సత్యనారాయణమూర్తి, ఆ పార్టీ నాయకులు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, టీడీపీ నేత‌లు నోరు అదుపులో పెట్టుకోవాల‌ని క‌న్న‌బాబు హెచ్చ‌రించారు. 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లోనే టీడీపీని రాష్ట్ర ప్ర‌జ‌లు బంగాళాఖాతంలోకి విసిరేశారని గుర్తుచేశారు. టీడీపీ అధికారంలో ఉండగా కుట్రపూరితంగా విజయవాడ కంట్రోల్‌ రూమ్‌ సెంటర్‌లోని దివంగ‌త మ‌హానేత వైయ‌స్ఆర్ విగ్రహాన్ని క్రేన్లతో తొలగించింద‌ని, ఆ పాపానికి శాపంగా టీడీపీ బతుకు 23 సీట్లకే పరిమితమైంద‌న్నారు. వైయ‌స్ఆర్ సీపీ అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే అదే ప్రాంతంలో అద్భుతమైన విగ్రహాన్ని ఆవిష్కరించామ‌ని గుర్తుచేశారు. 

వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అంటే వ్యక్తి కాదు.. ఈ రాష్ట్రంలో ఒక శక్తి. ఆయ‌న పుణ్యమాని ఆరోగ్యశ్రీ ద్వారా ఉచిత వైద్యం పొందామని, పిల్లల్ని ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా ఉన్నత చదువులు చదివించగలిగామని ఈరోజుకీ ప్రజలు గడప గడపకూ కార్యక్రమంలో చెబుతున్నార‌న్నారు. చంద్రబాబు పాలనలో పేదలకు ఏం ఒరిగిందో ఒక్కటైనా చెప్పుకునే దమ్ము ఉందా? అని ప్ర‌శ్నించారు. పిల్ల‌నిచ్చిన మామ‌కే వెన్నుపోటు పొడిచిన ఘనత చంద్ర‌బాబుది అని మాజీ మంత్రి క‌న్న‌బాబు ధ్వ‌జ‌మెత్తారు. ఎన్టీఆర్‌పై చంద్ర‌బాబుకు అభిమానం ఉంటే 14 ఏళ్ల అధికారంలో ఒక్క జిల్లాకైనా ఆయన పేరు పెట్టారా? అని నిల‌దీశారు. వెన్నుపోటుకు ప్రాయశ్చిత్తంగా ఎన్టీఆర్‌కు కనీసం భారతరత్న ఇవ్వాలని అడిగారా?.. హెల్త్‌ యూనివర్శిటీ పేరు మార్చారని మొసలి కన్నీరు కారుస్తున్న చంద్రబాబు పోలవరం, ఆరోగ్యశ్రీ పేర్లను మార్చలేదా? అని క‌న్న‌బాబు ప్ర‌శ్నించారు.

Back to Top