విశాఖపట్నం: మాజీ సీఎం వైయస్ జగన్కు నిబంధనల మేరకు భద్రతను కల్పించడంతో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. విశాఖపట్నం క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సత్తెనపల్లిలో జరిగిన ప్రమాదంను దురుద్దేశంతోనే వైయస్ జగన్కు ఆపాదించేందుకు ఈ ప్రభుత్వం తెగబడిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంటే వైయస్ జగన్ కాన్వాయికి ముందు పోలీస్ ఎస్కార్ట్, రోప్ పార్టీని ఏర్పాటు చేయలేదని అంగీకరిస్తారా? భద్రత విషయంలో పూర్తి నిర్లక్ష్యంతో వ్యవహరించామని ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. ఇంకా ఆయనేమన్నారంటే... సత్తెనపల్లి ప్రాంతంలో వైయస్ జగన్ పర్యటించిన నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున ఆయన వెంట నడిచారు. ఈ పర్యటన అయిన మూడు రోజుల తరువాత ఎల్లో మీడియా ఈటీవీ, ఏబీఎన్, టీవీ5లో ఒక విచిత్రమైన ప్రచారం ప్రారంభించారు. ఈ ప్రచారం చూస్తూంటే ఈ రాష్ట్రంలో రాజకీయాలు ఎంతగా దిగజారిపోయాయో అర్థమవుతోంది. ఒక మాజీ సీఎం పర్యటనకు వెడితే ఆయనకు చట్టబద్దంగా ఇవ్వాల్సిన భద్రతను కల్పించకుండా, అడుగడుగునా ఆటంకాలు కల్పించి, తిరిగి అక్కడ జరిగిన దురదృష్టకరమైన సంఘటనను ఆయనకు ఆపాదించడం దారుణం. ఈ ప్రమాదంపై జిల్లా ఎస్పీ వెంటనే వాస్తవాలను వెల్లడించారు. తరువాత ప్రభుత్వ ఒత్తిడితో మూడురోజుల్లో తన మాట మార్చడం చూస్తున్నాం. ప్రభుత్వ కుట్రకు బలం చేకూర్చేలా ఎల్లో మీడియా చానెళ్ళు విష ప్రచారం చేయడం దిక్కుమాలిన రాజకీయం కాదా? మాట మార్చాలంటూ జిల్లా ఎస్పీపై ఎవరు ఒత్తిడి చేశారు? సత్తెనపల్లిలో సింగయ్య అనే వ్యక్తి దురదృష్టవశాత్తు మృతి చెందాడు. మాజీ సీఎం వైయస జగన్ కాన్వాయితో సంబంధం లేకుండా ముందుగా వెడుతున్న ఒక ప్రైవేటు వాహనం ఢీ కొట్టడం వల్లే సింగయ్య మరణించాడని సాక్షాత్తు జిల్లా ఎస్పీ ప్రకటించారు. మూడు రోజుల తరువాత ఆయన మాటలు ఎందుకు మారాయి? ఎవరి ఒత్తిడితో ఆయన మాటలు మార్చారు? ఈ రెండు సందర్భాల్లో ఎస్పీ మాట్లాడిన మాటలను కూడా ఈ పత్రికా సమావేశంలో అందరికీ వినిపిస్తున్నాం. ఆ దుర్ఘటన జరిగినప్పుడు బాధ్యతతో వైయస్ఆర్సీపీ నేతలు ఆయనను తమ వాహనంలో ఆసుపత్రికి తరలించేందుకు ముందుకు వచ్చినా, ఆ సమయంలో అక్కడే వున్న ఎస్ఐ రాజశేఖర్ వారిని వారించారు. 108 వాహనంలోనే సింగయ్యను ఆసుపత్రికి తరలిస్తామని చెప్పి, అంబులెన్స్లో ఆసుపత్రికి పంపారు. తరువాత ఆయన మృతి చెందడంతో అందుకు కారణమంటూ సదరు ప్రైవేటు వాహనం డ్రైవర్, యజమానులను పిలిచి వారిపై కేసు నమోదు చేయడంతో పాటు స్టేషన్ బెయిల్ ఇచ్చి వారిని పంపించారు. మూడు రోజుల తరువాత జిల్లా ఎస్పీ మాట మారుస్తూ వైయస్ జగన్కు ఈ ఘటనను ఆపాదిస్తూ మాట్లాడటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒక దుర్మార్గమైన ఆలోచనతో, చంద్రబాబు తనకు అలవాటైన గజకర్ణ, గోకర్ణ, ఠక్కుటమార విద్యలను ప్రయోగించి, దీనిని వివాదంగా మార్చారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుని, వ్యవస్థలను భ్రష్టుపట్టించి రెండు రోజులుగా మంత్రులతో విషపు ప్రచారం చేయిస్తున్నారు. దీనివెనుక దురుద్దేశాలు ఉన్నాయి. వైయస్ జగన్ బయటకు వస్తుంటే పెద్ద ఎత్తున ప్రజలు ఆయన వెంట నడుస్తున్నారు. ఆయనను బయటకే రానివ్వకుండా చూడాలనే కుట్రల్లో భాగంగానే ఈ తప్పుడు కేసులు. మా హయాంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్లకు పూర్తి భద్రత కల్పించాం మాజీ సీఎంకు భద్రత ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? గతంలో మాజీ సీఎంగా ఉన్న చంద్రబాబుకు, జనసేన అధ్యక్షుడుగా ఉన్న పవన్ కళ్యాణ్కు భద్రత ఇవ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించామా? వారు ఎక్కడికీ వెళ్ళవద్దని ఆంక్షలు విధించామా? ప్రజాస్వామిక స్పూర్తితోనే వైయస్ఆర్సీపీ ప్రభుత్వం పనిచేసింది. నేడు మాజీ సీఎం వైయస్ జగన్కు ఎక్కడా భద్రత ఇవ్వడం లేదు. ప్రభుత్వ వాహనం, దానికి ముందు ఎస్కార్ట్ వాహనం, రోడ్పార్టీలను పెట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి లేదా? సత్తెనపల్లి పర్యటనలో ఇలాంటి ఏ నిబంధననూ ప్రభుత్వం పాటించలేదు. సత్తెనపల్లిలో ప్రమాదం మా వల్లే అంటున్నప్పడు ఆ సమయంలో ఈ పోలీస్ ఎస్కార్ట్, రోప్ పార్టీలు ఎందుకు కనిపించలేదు? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఎంత బాధ్యతారహితంగా వైయస్ జగన్ పర్యటన విషయంలో పోలీసులు వ్యవహరించారో అర్థం చేసుకునేందుకు అక్కడి ఫోటోలను కూడా మీడియా ముఖంగా ప్రదర్శిస్తున్నాం. సింగయ్య మరణం గురించి తెలియగానే వైయస్ జగన్ మానవతాదృక్పథంతో స్పందించారు. ఆ కుటుంబానికి వైయస్ఆర్సీపీ నేతలు అండగా నిలిచారు. రూ.10 లక్షలు ఆర్థిక సాయంను కూడా అందించారు. బాధ్యతతో వైయస్ఆర్సీపీ వ్యవహరించింది. సింగయ్య మా పార్టీ అభిమాని. ఆయన మరణం పార్టీలోని అందరినీ బాధించింది. యువతకు న్యాయం జరిగే వరకు పోరాడతాం ఈరోజు యువతకు కూటమి ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రశ్నిస్తూ యువత పోరు పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించాం. యువకులు ఈ ప్రభుత్వంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సూపర్ సిక్స్ అమలు చేసేశామంటూ ఇటీవలే ముఖ్యమంత్రి అతి పెద్ద అబద్దం చెప్పి, దానిపై మాట్లాడితే సహించనంటూ బెదిరించారు. ప్రతిదానిని ఒక ఈవెంట్గా మార్చి, పబ్లిసిటీ చేసుకోవడమే చంద్రబాబుకు తెలిసిన పాలన. యువత పోరు సందర్బంగా పల్నాడులో యువకులపై దుర్మార్గంగా లాఠీచార్జీ చేశారు. కేవలం హామీలను అమలు చేయాలని, ఉద్యోగాలు కల్పించాలని కోరడమే వారు చేసిన నేరమా? చంద్రబాబు నిరంకుశంగా పాలన చేస్తున్నారు. ప్రతిపక్షంను భూస్థాపితం చేస్తామని అన్నారు. హామీలపై ప్రశ్నిస్తే, మీరెవరూ అడగడానికి అంటూ బెదిరింపులకు దిగారు. ప్రజల తరుఫున గొంతెత్తకపోతే ప్రజలకు అమ్మ ఒడి ఇచ్చేవారా? ఈ ప్రభుత్వ మెడలు వంచి తల్లులకు ఈ సొమ్ము ఇప్పించాం.