అమరావతి: మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మరణం బాధాకరమని మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ.. కోడెల మృతిపై క్షణక్షణం వార్తలు మారుతూ వస్తున్నాయని, మృతిపై అనేక అనుమానాలున్నాయన్నారు. ఈటీవీలో గుండెపోటు అని వార్తలు వచ్చాయని, తర్వాత అదే ఈటీవీలో ప్రమాదకరమైన ఇంజెక్షన్ కోడెల తీసుకున్నట్లుగా మరో వార్త వచ్చింది చెప్పారు. ఎల్లో మీడియాలో గుండెపోటుతో చనిపోయాడని వార్తలు వచ్చాయన్నారు. మాజీ మంత్రి, మాజీ స్పీకర్, సీనియర్ రాజకీయ నాయకుడు మరణించినప్పుడు సమగ్ర విచారణ జరగాలన్నారు. సాక్ష్యాలు తారుమారు కాకుండా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ జరిపించాలని కోరారు. కోడెల శివప్రసాద్కు గుండెపోటు అయితే ఎవరైనా అపోలో, కేర్ ఆస్పత్రికి తీసుకెళ్తారని, ఎవరైనా బసవతారకం కేన్సర్ ఆస్పత్రికి తీసుకువస్తారా అని ప్రశ్నించారు. ప్రభుత్వ ఒత్తిడితోనే కోడెల ఉరి వేసుకున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులు దిగజారుడు, నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కోడెలపై ప్రభుత్వం కేసులు పెట్టలేదని, ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో కోడెల వల్ల ఇబ్బందులు పడినవారే ఆయనపై కేసులు పెట్టారన్నారు. విచారణలో అన్ని విషయాలు తేలుతాయన్నారు.
వాస్తవాలు నిగ్గుతేల్చాలి: ఎమ్మెల్యే అంబటి రాంబాబు
మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతిపై అనేక సందేహాలు ఉన్నాయని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అన్నారు. తెలంగాణ పోలీసులు పూర్తిస్థాయిలో విచారణ జరిపించాలని కోరారు. సమగ్ర విచారణ జరిపించి వాస్తవాలను నిగ్గుతేల్చాలన్నారు.