తాడేపల్లి: మార్చి 15 నుంచి స్కూళ్లలో నాడు – నేడు రెండోవిడత మొదలుపెట్టాలని విద్యాశాఖ అధికారులను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. స్కూళ్లలో ప్లే గ్రౌండ్లను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. దీనికి సంబంధించి మ్యాపింగ్ చేసి.. ప్రణాళిక సిద్ధంచేయాలని సూచించారు. స్కూళ్లు తెరిచే నాటికి పిల్లలకు విద్యాకానుక అందించాలని సీఎం ఆదేశించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో విద్యాశాఖపై సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. నూతన విద్యావిధానం కింద తీసుకున్న నిర్ణయాలపై, గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఆరు కేటిగిరీల కింద స్కూళ్ల ఏర్పాటు – మ్యాపింగ్, సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు, ఇంగ్లిషు బోధన, డిజిటల్ లెర్నింగ్, మండలానికి రెండు జూనియర్ కళాశాలల ఏర్పాటు తదితర అంశాలపై అధికారులతో సీఎం వైయస్ జగన్ చర్చించారు. నిర్ణయాలు – అమలు విద్యాశాఖలో తీసుకున్న నిర్ణయాలు వాటి అమలు తీరును సీఎం వైయస్ జగన్కు అధికారులు వివరించారు. – నూతన విద్యావిధానానికి అనుగుణంగా ఇప్పటివరకు మ్యాపింగ్ కాకుండా మిగిలిన స్కూళ్లను కూడా మ్యాపింగ్ చేశామన్న అధికారులు. – ఫిబ్రవరి 14 నుంచి ప్రతిరోజూ ఒక ఇంగ్లిషు పదాన్ని నేర్పేలా విద్యార్థులకు బోధన. – వచ్చే ఏడాది 8వ తరగతి నుంచి డిజిటల్ లెర్నింగ్. – ఉపాధ్యాయుల బోధనా సామర్థ్యాన్ని పెంచేలా తగిన చర్యలు. – ప్రతి మండలానికి ఒక కో ఎడ్యుకేషన్ జూనియర్ కళాశాల, ఒక మహిళా జూనియర్కళాశాల ఉండేలా చర్యలు, జూనియర్ కళాశాలలు లేని మండలాల గుర్తింపు. – స్కూళ్లు, వసతులు తదితర అంశాలపై ఫిర్యాదుల స్వీకరణకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు – ఎస్సీఈఆర్టీ సిఫార్సుల అమలుకు చర్యలు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే.. ప్రభుత్వ స్కూళ్లలో ఉన్నత చదువులు చదువుకున్న టీచర్లు ఉన్నారు. వారి సేవలను సమర్థవంతంగా వాడుకోగలిగితే.. నాణ్యమైన విద్య అందుతుంది. అందుకనే విద్యా వ్యవస్థలో అనేక సంస్కరణలు తీసుకువచ్చాం. మంచి చదువులు చదువుకున్న టీచర్ల సేవలను వాడుకునేందుకు విధానాలు రూపొందించాం. సబ్జెక్టుల వారీగా టీచర్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాం. టీచర్ల సేవలను బోధనేతర కార్యక్రమాలకు ఎట్టిపరిస్థితుల్లోనూ వాడుకోకూడదు. దీనివల్ల విద్యార్థుల చదువులు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. టీచర్లు పూర్తిగా విద్యార్థుల చదువులకు అందుబాటులో ఉండేలా చూడాలి. దీంట్లో భాగంగానే బోధనేతర కార్యక్రమాల్లో వారిని వినియోగించకుండా చూడాలి. ప్రతిరోజూ ఒక పదం.. ప్రతిరోజూ ఒక పదాన్ని నేర్పేటప్పుడు డిక్షనరీలో దాన్ని చూసి అర్థం తెలుసుకోవడంతో పాటు, వాక్యంలో ఎలా ఉపయోగించాలో కూడా నేర్పాలి. మొదటిరోజు పదం చెప్పడం, అసైన్మెంట్ ఇచ్చి రెండో రోజు దాన్ని ఉపయోగించడం నేర్పించాలి. డిజిటల్ లెర్నింగ్పై సీఎం సమీక్ష.. లెర్నింగ్ టు లెర్న్ కాన్పెప్ట్లోకి తీసుకెళ్లాలి. కొత్తగా ఏర్పడనున్న 26 జిల్లాల్లో కూడా ఉపాధ్యాయశిక్షణ కేంద్రాలు ఉండాలి. ప్రస్తుతం ఉన్న శిక్షణా కేంద్రాలలో నాడు – నేడు కింద సౌకర్యాలను మెరుగుపరచాలి. స్కూళ్లలో హెడ్ మాస్టర్లు మరింత క్రియాశీలకంగా వ్యవహరించాలి. విద్యార్థులకు కెరీర్గైడెన్స్ ఇవ్వాలి. తల్లిదండ్రులతో మంచి సంబంధాలు నెరుపుతూ విద్యార్థుల భవిష్యత్తుకు మార్గనిర్దేశం చేసేలా హెడ్మాస్టర్లు ఉండాలి. ప్రతి విద్యార్థినీ, వారి తల్లిదండ్రులనూ విడివిడిగా కలుస్తూ.. వారి భవిష్యత్తుకు మంచి మార్గం వేసేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. సౌకర్యాలు బాగుండాలి.. స్కూళ్లలో నాడు – నేడు కింద ఏర్పాటుచేసుకున్న సౌకర్యాల నిర్వహణ బాగుండాలి. లేకపోతే నిరర్ధకమవుతాయి. టాయిలెట్లు, తాగునీటి ప్లాంట్ల నిర్వహణ బాగుండాలి. ఎప్పుడు సమస్య వచ్చినా వెంటనే దాన్ని పరిష్కరించి, సమర్థవంతంగా నిర్వహించాలి. ఫిర్యాదు వచ్చిన వారంరోజుల్లోగా పరిష్కారం కావాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లోని టెక్నికల్, ఇంజినీరింగ్ సిబ్బంది, విలేజ్ క్లినిక్స్లో సిబ్బందికి స్కూళ్లలో వసతుల నిర్వహణపై తగిన ఎస్ఓపీలను ఇవ్వాలి. ప్రైవేట్ కాలేజీల సౌకర్యాలపై కన్నేయండి.. ప్రైవేటు కాలేజీల్లో కూడా సౌకర్యాలు ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నాయా? లేదా? చూడాలి. తల్లిదండ్రులు కష్టపడి ఫీజులు కడుతున్నారు. ఆ మేరకు పిల్లలకు సౌకర్యాలు, వసతులు అందిస్తున్నారో లేదో క్రమం తప్పకుండా చూడాలి. ప్రణాళిక ఆచరణలోకి.. రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధికి రూపొందించిన ప్రణాళికను ఆచరణలోకి తీసుకురావడానికి వెంటనే చర్యలు తీసుకోవాలి. ప్రతి పార్లమెంటుకు ఒక స్కిల్ కాలేజీతోపాటు, ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కూడా ఐటీఐ, పాలిటెక్నిక్ సమ్మిళతంగా ఒక స్కిల్ సెంటర్ ఉండాలి. వీటన్నింటికీ పాఠ్యప్రణాళికను స్కిల్ యూనివర్శిటీ రూపొందించాలి. దీన్ని తిరుపతిలో పెడతామని ఇదివరకే నిర్ణయం తీసుకున్నాం. ఏర్పాటుపై అధికారులు దృష్టిపెట్టాలి. నైపుణ్యం ఉన్న మానవవనరులకు చిరునామాగా రాష్ట్రం ఉండాలి. ఈసమీక్షా సమావేశంలో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ, ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధానకార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి, పాఠశాల విద్యాశాఖ స్పెషల్ సీఎస్ బుడితి రాజశేఖర్, ముఖ్యమంత్రి కార్యదర్శి సాలోమన్ ఆరోకియా రాజ్, అదనపు కార్యదర్శి ఆర్ ముత్యాలరాజు, ఆర్ధికశాఖ కార్యదర్శి ఎన్ గుల్జార్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్ సురేష్, పాఠశాల విద్యాశాఖ సలహాదారు ఏ మురళీ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్(ఎస్సీఈఆర్టి) బి ప్రతాప్ రెడ్డి, సీఎం సీపీఆర్వో పూడి శ్రీహరి, పలువురు అధికారులు పాల్గొన్నారు.