తాడేపల్లి: అధికారులు ఓనర్షిప్ తీసుకోవాలని ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి సూచించారు. గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయాలి.. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయన్నారు. బుధవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో సీఎం వైయస్ జగన్ సమీక్ష నిర్వహించారు. సచివాలయాల్లో మెరుగైన పనితీరు, సమగ్ర పర్యవేక్షణ, సుస్థిర ప్రగతి లక్ష్యాల సాధనలో సచివాలయాల కీలక పాత్ర, సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీల భర్తీ తదితర అంశాలపై సీఎం సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే...: పరిపాలనలో విప్లవాత్మక మార్పుగా గ్రామ, వార్డు సచివాయాలను ఏర్పాటు చేశాం. చివరి స్థాయి వరకూ సమర్థవంతమైన డెలివరీ మెకానిజమే లక్ష్యంగా వీటిని ఏర్పాటు చేశాం. ఇలాంటి వ్యవస్థ సమర్థవంతంగా పనిచేయాలి. సరైన ఎస్ఓపీలు, పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. సిబ్బంది హాజరు దగ్గరనుంచి అన్నిరకాలుగా పర్యవేక్షణ ఉండాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో మధ్యాహ్నం 3 గంటలనుంచి 5 గంటలవరకూ స్పందన నిర్వహించాలి. ప్రభుత్వ విభాగాల వారీగా మండలాల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. రిపోర్టింగ్ స్ట్రక్చర్ పటిష్టంగా ఉండాలి. గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందిపై విభాగాల వారీగా మండల స్థాయిలో పర్యవేక్షణ ఉండాలి. ఎవరెవరు ఏం చేయాలన్నదానిపై చాలా స్పష్టత ఉండాలి. విధులు, బాధ్యతలపై ఎస్ఓపీలు ఉండాలి, వాటిని సమర్థవంతంగా అమలు చేయాలి. అర్జీల పరిష్కారం కూడా చాలా ముఖ్యమైనది. వాటి పరిష్కారంలో నాణ్యత ఉండాలి. ఒకే అర్జీ మళ్లీ వచ్చినప్పుడు మళ్లీ అదే వ్యవస్థ దాన్ని పరిశీలించే బదులు, ఆ పై వ్యవస్థ పరిశీలన చేసి ఆ అర్జీని పరిష్కరించాలి. రీ వెరిఫికేషన్ కోసం పై వ్యవస్థకు వెళ్లడం అన్నడం అన్నది ప్రధానం. ఈ అంశాలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. అప్పుడే గ్రామ, వార్డు సచివాలయాలు సమర్థవంతంగా పనిచేయగలుగుతాయి. అధికారులు ఓనర్షిప్ తీసుకోవాలి. అప్పుడే ఆశించిన ఫలితాలు వస్తాయి. ప్రభుత్వ శాఖాధిపతులు ప్రతి నెల 2 సచివాలయాలను తప్పనిసరిగా సందర్శించాలి. దీనివల్ల వాటి సమర్థత పెరుగుతుంది. సచివాలయాల స్థాయిలో మెరుగైన సేవలు అందాలి. ప్రభుత్వంలో సమర్థవంతమైన ఉద్యోగులు ఉన్నారు. వారి సేవలు ప్రజలకు అందాలి. అప్పుడే ప్రజలకు అన్నిరకాలుగా ఉపయోగం, అనుకున్న లక్ష్యాలను కూడా సాధించగలుగుతాం. సిబ్బందితో మంచి సమన్వయం కోసం, వారు అందుబాటులో ఉండేలా మెరుగైన విధానాలను అవలంభించాలి : ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వాడుకోవాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే వీటన్నింటి లక్ష్యం. అందుకనే ప్రతి ప్రభుత్వ విభాగంలోనూ ఫేషియల్ రికగ్నైజేషన్తో కూడిన హాజరును అమలు చేయాలి. ప్రభుత్వ శాఖాధిపతుల నుంచే ఇది అమలు అయితే కింది స్థాయిలో కూడా అందరూ అమలు చేస్తారు. దీనివల్ల సిబ్బంది అందుబాటులో ఉండి ప్రజల వినతులకు సంబంధించిన పరిష్కారంపై దృష్టిపెడతారు. లేకపోతే అంతిమంగా ఇబ్బందులు పడేది ప్రజలే. సుస్థిర ప్రగతి లక్ష్యాలపై గ్రామ, వార్డు సచివాలయాల సిబ్బందికి అవగాహన కల్పించాలి. అప్పుడే ఆ లక్ష్యాలను అందుకోగలం. గ్రామస్థాయిలో అమలవుతున్న కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసినప్పుడు సుస్థిర ప్రగతి లక్ష్యాలను అందుకోగలం. లేకపోతే ఆ లక్ష్యాల సాధనలో పురోగతి కనిపించదు. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలో ఏపీ నంబర్ఒన్గా నిలవాలి. అలాగే సచివాలయాల్లో సాంకేతిక పరికరాల విషయంలో ఎలాంటి లోపం ఉండకూదు. టెక్నాలజీ పరంగా, సాంకేతిక పరికరాల పరంగా వారికి లోటు ఉండకూడదు. నిరంతరం టెక్నాలజీని అప్డేట్ చేయాలి, వారిని అప్డేట్గా ఉంచాలి. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఖాళీల భర్తీకి సీఎం ఆమోదం. గ్రామ, వార్డు సచివాలయాల్లో ఏర్పడ్డ ఖాళీలను భర్తీ చేయండి. గత నియామక ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపట్టారని మంచి పేరు వచ్చింది. మళ్లీ ఎలాంటి లోపం లేకుండా సమర్థవంతంగా వీరి నియామక ప్రక్రియను చేపట్టాలి. అన్ని ప్రభుత్వ విభాగాలనుంచి ఖాళీల వివరాలను సేకరిస్తున్నామని సీఎంకు తెలిపిన అధికారులు. ఈ నెలాఖరు కల్లా రాష్ట్రసచివాలయం నుంచి గ్రామస్థాయి సచివాలయం వరకూ కూడా ఫేషియల్ రికగ్నైజేషన్ హాజరు అమలు చేయాలి. అన్ని గ్రామ సచివాలయాలను వైర్డ్ ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలని సీఎం ఆదేశాలు. ప్రస్తుతం వైర్లెస్ ఇంటర్నెట్తో నడుస్తున్న 2,909 గ్రామ సచివాలయాలను వైర్డ్ఇంటర్నెట్తో అనుసంధానం చేయాలన్న అధికారులు. గ్రామంలోని ఆర్బీకేలు, విలేజ్ సెక్రటేరియట్స్లో కూడా ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాలన్న సీఎం. అంగన్వాడీలను కూడా సచివాలయాల పర్యవేక్షణలోకి తీసుకురావాలని సీఎం వైయస్ జగన్ అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎస్ డాక్టర్ కె ఎస్ జవహర్రెడ్డి, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ కమిషనర్ జి సాయి ప్రసాద్, గ్రామ, వార్డు సచివాలయాల స్పెషల్ సీఎస్ అజయ్ జైన్, వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎం టీ కృష్ణబాబు, హోంశాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, సాంఘిక సంక్షేమ, బీసీ సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జి జయలక్ష్మి, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి కాంతిలాల్ దండే, సర్వే సెటిల్మెంట్స్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ కమిషనర్ సిద్ధార్ధ జైన్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ ఏ ఎండీ ఇంతియాజ్, గ్రామ వార్డు సచివాలయాలశాఖ కమిషనర్ షన్ మోహన్, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.