పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నులు వేగ‌వంతం చేయండి

సాగు నీటి ప్రాజెక్టుల ప్రగతిపై సీఎం వైయ‌స్ జగన్‌ సమీక్ష

కాఫర్‌ డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలి

మే నాటికి నెల్లూరు. సంగం బ్యారేజీల‌ను పూర్తి చేయాలి

డి‌సెంబ‌ర్ నాటికి  వెలిగొండ రెండో ట‌న్నెల్ పూర్తి

తాడేప‌ల్లి: పోల‌వ‌రం ప్రాజెక్ట్ ప‌నుల‌ను వేగ‌వంతం చేయాల‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అధికారుల‌ను ఆదేశించారు.సాగునీటి ప్రాజెక్టుల ప్రగతిపై ముఖ్యమంత్రి వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సమీక్ష నిర్వహించారు. పోలవరంతో పాటు ఇతర ప్రాధాన్య ప్రాజెక్టుల ప్రగతిపై చర్చించారు. కాఫర్‌ డ్యాంలో ఖాళీలను త్వరగా పూర్తి చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం వైయ‌స్ జగన్‌ అధికారులను ఆదేశించారు. స్పిల్‌ ఛానల్‌లో మట్టి, కాంక్రీట్‌ పనులను మరింత వేగవంతం చేయాలని సూచించారు.  నెల్లూరు, సంగం బ్యారేజీలను మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు సీఎంకు తెలిపారు.

డిసెంబర్‌ నాటికి వెలిగొండ రెండో టన్నెల్‌ పూర్తవుతుందన్నఅధికారులు.. వంశధారలో ఫేజ్‌-2, స్టేజ్‌ -2 పనులు జూలై నాటికి పూర్తి చేస్తామన్నారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టి పెట్టాలని సీఎం వైయ‌స్ జగన్‌ ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్న సీఎం.. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్ట్‌లను పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు.

వర్షాలు వచ్చేలోగా పూర్తిచేయాల్సిన పనులపై సీఎం సమీక్ష
కాఫర్‌ డ్యాంలో ఖాళీలు పూర్తి, అప్రోచ్‌ ఛానల్, స్పిల్‌ ఛానల్, గేట్ల పూర్తి, మెయిన్‌ డ్యాం పనులు తదితర కీలక పనులపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌ సమీక్ష నిర్వ‌హించారు. మే నెల కల్లా కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తిచేస్తామని అధికారులు తెలిపారు. అప్రోచ్‌ ఛానల్‌ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఇవి కూడా మే నాటికి పూర్తవుతాయని వెల్ల‌డించారు. కాఫర్‌ డ్యాంలో ఖాళీలను పూర్తిచేయడం, అప్రోచ్‌ ఛానల్‌ను పూర్తిచేయడం అన్నది అత్యంత ఆవశ్యకమని, వెంటనే వీటిపై దృష్టిపెట్టాలని అధికారులను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. 

స్పిల్‌ ఛానల్‌లో మట్టి, కాంక్రీట్ పనుల తవ్వకం పనులను మరింత వేగవంతం చేయాల‌ని సీఎం ఆదేశించారు. రానున్న 45 రోజులు అత్యంత కీలకమని, వర్షాలు వచ్చేలోగా పనులు అత్యంత వేగంగా, సమర్థవంతంగా జరగాలన్నారు. పోలవరం ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన సహాయ పునరావాస కార్యక్రమాలపైనా సీఎం స‌మీక్షించారు. ప్రభుత్వం ప్రాధాన్యతగా తీసుకున్న ప్రాజెక్టులకు నిధుల విషయంలో ఎలాంటి సమస్య రాకుండా చూస్తున్నామ‌న్నారు. కష్టకాలం అయినప్పటికీ .. పోలవరం సహా ప్రాజెక్టులను అనుకున్న సమయానికి పూర్తిచేయాలనే ఉద్ధేశ్యంతో నిధుల విడుదలతో పాటు అన్నిరకాలుగా ప్రభుత్వం అడుగులేస్తుందని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ చెప్పారు. 

త్వరితగతిన ప్రాధాన్యతా ప్రాజెక్టులు
ప్రాధాన్యతా ప్రాజెక్టులుగా  ప్రభుత్వం నిర్దేశించుకున్న నెల్లూరు బ్యారేజీ, సంగం బ్యారేజీ, అవుకులో టన్నెల్‌ –2, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌ –1, వెలిగొండ హెడ్‌ రెగ్యులేటర్‌ –2, టన్నెల్‌ –2 సహా సహా వెలిగొండ ప్రాజెక్టులో మిగిలిన పనులు, వంశధార నాగావళి లింక్, వంశధార ఫేజ్-2, స్టేజ్‌ –2 పనులపైనా సీఎం సమీక్షించారు. నెల్లూరు, సంగం బ్యారేజీలు మే నాటికి పూర్తి చేస్తామని అధికారులు వివ‌రించారు. అవుకులో రెండో టన్నెల్‌లో కెమికల్‌ పోరింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఆగస్టు నాటికి పనులు పూర్తి చేస్తామని వెల్లడించారు. ఆగస్టు నాటికి మొత్తంగా 20వేల క్యూసెక్కుల నీటిని తీసుకెళ్లేలా సొరంగాలు సిద్ధమవుతాయని అధికారులు సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వివ‌రించారు. వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్‌ –1  ఇప్పటికే పూర్తైందని,  డిసెంబర్‌ నాటికి రెండో టన్నెల్‌ పూర్తి అవుతుందని, వెలిగొండ టన్నెల్‌–1 ద్వారా సెప్టెంబరు నాటికి నీరు విడుదల చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ఉత్తరాంధ్ర సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష
వంశధార నాగావళి, వంశధారలో ఫేజ్-2, స్టేజ్‌ –2 పనులు జులై నాటికి పూర్తిచేస్తామని అధికారులు వివ‌రించారు. నేరడి బ్యారేజీ నిర్మాణంపై దృష్టిపెట్టాలని సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు. ఒడిశాతో ఉన్న సమస్య పరిష్కారంపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్నారు. నిర్దేశించుకున్న లక్ష్యంలోగా ప్రాజెక్టులను పూర్తిచేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ప్రాధాన్యతా ప్రాజెక్టులపైన అధిక దృష్టిపెట్టి ముందుకెళ్తున్నామ‌న్నారు. ఎక్కడా కూడా అవాంతరాలు అనేవి రాకుండా తదేక దృష్టితో ముందుకు సాగుతున్నామని చెప్పారు. గత ఐదేళ్లలో జరిగిన పనులతో పోలిస్తే.. ఈ 18 నెలల కాలంలో పనులు చాలా వేగంగా ముందుకు వెళ్లాయన్నారు. ప్రస్తుతం ఉన్న ప్రాధాన్యతా ప్రాజెక్టులు పూర్తైన తర్వాత మిగిలిన వాటిపై దృష్టిపెట్టాలని అధికారుల‌ను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశించారు. మహేంద్ర తనయ, మడ్డువలస ఫేజ్‌–2, తారకరామ సాగర్‌ తదితర మిగిలిన ప్రాజెక్టులను ప్రాధాన్యతగా తీసుకోవాలని ఆదేశించారు. 

రాయలసీమ, పల్నాడు కరవు నివారణ ప్రాజెక్టులపై సమీక్ష
రాయలసీమ కరువు నివారణ కింద చేపట్టనున్న ప్రాజెక్టులు, అలాగే పల్నాడు ప్రాంతంలో కరువు నివారణ కోసం చేపట్టనున్న ప్రాజెక్టు పనులపైనా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. ఒక ప్రణాళికా బద్ధంగా ఈ ప్రాజెక్టులు ముందుకు సాగేలా కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. ఈ సమావేశానికి సీఎస్‌ ఆదిత్యనాథ్‌ దాస్, నీటిపారుదలశాఖ కార్యదర్శి జె శ్యామలరావు, ఆర్ధికశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌ఎస్‌ రావత్, ఈఎన్‌సీ సి నారాయణరెడ్డి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాజా వీడియోలు

Back to Top