రైతు ప్ర‌తి స‌మ‌స్య‌ను ఆర్బీకేలు ప‌రిష్క‌రిస్తాయి

ఆర్డ‌ర్ చేసిన 48 గంట‌ల్లో ప్ర‌భుత్వం నిర్ధారించిన ఎరువులు, విత్త‌నాలు, పురుగుమందులు

ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం

రుణాలు రాలేదని ఎవరైనా చెబితే వెంటనే చర్యలు తీసుకుంటాం

ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం

కేంద్ర ప్రభుత్వ కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.

పీఎం కిసాన్ సీఈఓ వివేక్ అగ‌ర్వాల్‌తో సీఎం వైయ‌స్ జ‌గ‌న్ వీడియో కాన్ఫరెన్స్‌

గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్ష

తాడేపల్లి: రైతుల‌కు సంబంధించిన ప్ర‌తి స‌మ‌స్య‌ను రైతు భ‌రోసా కేంద్రాలు ప‌రిష్క‌రిస్తాయ‌ని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అన్నారు. గిడ్డంగులు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణంపై సీఎం వైయ‌స్ జ‌గ‌న్ స‌మీక్షా స‌మావేశం నిర్వ‌హించారు. పీఎం కిసాన్‌ సీఈవో వివేక్‌ అగర్వాల్‌తో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడారు. ఈ సంద‌ర్భంగా కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధికి సంబంధించిన వివరాలను ముఖ్యమంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌కు వివేక్‌ అగర్వాల్‌ తెలిపారు. రాష్ట్రానికి అన్ని రకాలుగా సహకరిస్తామన్నారు.

ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్ మాట్లాడుతూ.. `ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాలు ఏర్పాటు చేశాం. రాష్ట్ర వ్యాప్తంగా 10,641 రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి. రైతులకు సంబంధించిన ప్రతి సమస్యను రైతు భ‌రోసా కేంద్రాలు పరిష్కరిస్తాయి. నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు అందిస్తాం. కియోస్క్‌లో ఆర్డర్‌ చేయగానే 48 గంటల్లోగా ప్రభుత్వం నిర్ధారించిన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందుతాయని తెలిపారు. గ్రామ సచివాలయంలో ఉన్న రెవెన్యూ అసిస్టెంట్, అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు కలిసి ఈ–క్రాపింగ్‌ చేస్తారు. వాటిలో పంటలకు సంబంధించిన పూర్తి వివరాలు నమోదవుతాయి.ఇంకా జియో లొకేషన్‌ ట్యాగ్‌ కూడా చేస్తారు.

పంట‌ల‌కు సంబంధించిన రుణాలు రాలేదని ఎవ్వరైనా చెబితే వెంటనే చర్యలు తీసుకుంటాం. అలాగే బీమా సదుపాయం కూడా కల్పిస్తాం. ఆర్బీకేల్లో కనీస గిట్టుబాటు ధరలను ప్రకటిస్తాం. మార్కెట్‌లో ధరలు తగ్గితే వెంటనే మార్కెటింగ్‌లో జోక్యం చేసుకుంటాం. రైతుల ఉత్పత్తులకు సరసమైన ధరలు లభించేలా చర్యలు తీసుకుంటాం. దీని కోసం ప్రత్యేక ఫ్లాట్‌ఫాం కూడా తీసుకువస్తున్నాం. అంతే కాకుండా గ్రామాల్లో జనతా బజార్లను తీసుకువస్తున్నాం. ప్రభుత్వం కొనుగోలు చేసిన వాటిని ప్రజలకు అందుబాటులో ఉంచుతుంది. వినియోగదారులకు తక్కువ ధరలకు లభించడమే కాకుండా రైతులకూ మేలే జరుగుతుంది. వీటితోపాటు ప్రతి గ్రామంలో గోడౌన్లను, స్టోరేజీ సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. ప్రీ ప్రాసెసింగ్‌తో పాటు, గ్రేడిండ్‌ కూడా అక్కడే చేస్తాం.

అలాగే మండలాల్లో కోల్డ్‌ స్టోరేజీలు కూడా ఏర్పాటు చేస్తున్నాం. నియోజకవర్గాల వారీగా అవసరమైన మేరకు క్లస్టర్లను ఏర్పాటు చేసి.. ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లను ఏర్పాటు చేస్తాం. రైతుల నుంచి కొనుగోలు చేసిన వాటికి అదనపు విలువ జోడిస్తాం. టమోటా, చీనీ, మొక్కజొన్న, మామిడి, అరటి తదితర పంటలకు సంబంధించి ఫుడ్‌ ప్రాసెసింగ్‌ చేస్తాం. ఆర్బీకేల ఆలోచన వచ్చిన దగ్గర నుంచి.. వాటి ఏర్పాటుతో పాటు.. ఈ అంశాలన్నింటిపైనా దృష్టి పెట్టాం. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న కార్యక్రమాలు మా లక్ష్యాల సాధనకు ఉపయోగపడతాయని ఆశిస్తున్నాం.

ఫిషరీస్, ఆక్వాకు సంబంధించి కూడా కొన్ని సమస్యలు ఎదుర్కొంటున్నాం. పంట చేతికి వచ్చేసరికి ధరలు తగ్గిపోయే పరిస్థితి. దీనిపై కూడా దృష్టి పెట్టాం. అమూల్‌తో ఇటీవలే ఒప్పందాలు కుదుర్చుకున్నాం. పాడి పరిశ్రమ వృద్ధికి ఇది తోడ్పడుతుంది. అణగారిన వర్గాలకు, భూమి లేని నిరుపేదలకు ఇది మంచి ఉపయోగకరం, పాడి పశువుల పెంపకంతో వీరికి మేలు జరుగుతుందన్నారు. వ్యవసాయంలో ఉత్తమ యాజమాన్య పద్ధతులను కూడా ఆర్బీకేల ద్వారా రైతులకు తెలియజేస్తున్నాం` అని ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి వివ‌రించారు.

Back to Top