విశాఖపట్నం: వైజాగ్ వేదికగా కూటమి ప్రభుత్వం నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ఒట్టి బూటకమని వైయస్ఆర్సీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. విశాఖపట్నంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ... వైజాగ్ సమ్మిట్లో వేదిక మీద మంత్రుల తప్ప పారిశ్రామికవేత్తలెవరూ కనిపించలేదని గుర్తు చేశారు. 2023లో అదే విశాఖలో నిర్వహించిన జీఐఎస్లో నాటి సీఎం శ్రీ వైయస్ జగన్తో పాటు, భారత పారిశ్రామిక దిగ్గజాలు ముఖేష్ అంబానీ, కరణ్ ఆదానీ, దాల్మియా, నవీన్ జిందాల్, సంజయ్ బంగర్, భజంకా తదితరులు ఒకే వేదికపై కూర్చున్నారని చెప్పారు. అప్పటి, ఇప్పటి రెండు వేదికలను చూస్తే ఎవరు పారిశ్రామిక వేత్తలను బెదిరించారో తెలుస్తుందని అన్నారు. వైయస్ఆర్సీపీ పథకాలను పేర్లు మార్చి అమలు చేస్తున్న చంద్రబాబు కేవలం క్రెడిట్ చోరీ మాత్రమే కాదని.. విజన్ చోరీ కూడా అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యాఖ్యానించారు. నాలుగు దఫాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ 974 కిలోమీటర్ల తీర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలన్న ఆలోచన రాలేదని.. వైయస్.జగన్ హయాంలో ప్రతి 50 కిలోమీటర్లకు షిషింగ్ హార్భర్ లేదా పోర్టు నిర్మాణం ప్రారంభిస్తే.. అది కూడా తన ఆలోచన అని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. సముద్ర తీరంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్ల నిర్మాణం వైయస్.జగన్ విజన్ అయితే.. బికినీ ఫెస్టివల్స్ పేరుతో జల్సాలు చంద్రబాబు ప్రభుత్వ విజన్ అని మండిపడ్డారు. స్టీల్ ప్లాంట్ పై చంద్రబాబు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన అమర్నాధ్... రాష్రంలో అతిపెద్ద పరిశ్రమను కాపాడలేక, ఉద్యోగులను నిందిస్తున్న కూటమి ప్రభుత్వం.. రానున్న రెండేళ్లలో ఏ విధంగా 40 లక్షల ఉద్యోగాలిస్తుందని నిలదీశారు. ప్రెస్ మీట్ లో అమర్నాధ్ ఇంకా ఏమన్నారంటే... ● చంద్రబాబు పెట్టుబడుల లెక్క ఓ మోసం... విశాఖ వేదికగా జరిగిన పార్టనర్ షిప్ సమ్మిట్ లో చంద్రబాబు చేసిన ఎంఓయూలు.. పెట్టుబడులకు సంబంధించి ఆయన చెప్పిన మాటలమీద ఎవరికీ పెద్దగా ఆశల్లేవు. కారణం చంద్రబాబు చేసిన కార్యక్రమాలు, గతంలో జరిగిన అనుభవాలే దానికి ప్రామాణికం. 2014–19 మధ్యలో చంద్రబాబు విశాఖ వేదికగా మూడు దఫాల్లో పార్టనర్ షిప్ సమ్మిట్స్ నిర్వహించి... ఒక దఫా రూ.6 లక్షల కోట్లు, మరోసారి రూ.4 లక్షల కోట్లు, ఇంకోసారి రూ.9 లక్షల కోట్లు కలిపి రూ.19 లక్షల కోట్లు పెట్టుబడులు, 40 లక్షల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని మూడో దఫా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు చెప్పారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత .. చంద్రబాబు ప్రభుత్వం 2015, 2016, 2017లో చెప్పిన ఒప్పందాలు ఏ మేరకు కార్యరూపం దాల్చాయి, ఎంత మేరకు పెట్టుబడులుగా రూపాంతరం చెందాయో చూస్తే.. కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే వచ్చాయి. అంటే వారు చేసుకున్న ఒప్పందాలతో పోల్చి చూస్తే... కేవలం 2శాతం పెట్టుబడులు మాత్రమే కార్యరూపం దాల్చాయి. వాస్తవానికి పెట్టుబడి కింద మారే ఒప్పందాలకు సంబంధించిన వాస్తవాలు మాత్రమే చెప్పాలి తప్ప.. ప్రజలకు లేనిపోని ఆశలు కలిపించి, యువతకు లేని భ్రమలు కల్పించి మోసం చేయవద్దని చాలాసార్లు చెప్పాం. 2019 లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత... 2020 మార్చి నుంచి ఆగష్టు వరకు ఒక దశ, మరలా ఏఫ్రిల్ నుంచి రెండో దశ కోవిడ్, మరలా 2022 జనవరి వరకు మూడోదశ కోవిడ్ ను చూశాం. అన్నీ సద్దుమణిగిన తర్వాత విశాఖ వేదికగా ఒక ఇన్వెస్టర్స్ సమ్మిట్ ను ఏర్పాటు చేయాలని నిర్ణయించి 2023 మార్చిలో నిర్వహించాం. ఆ రోజు ముఖ్యమంత్రిగా వైయస్.జగన్ చాలా స్పష్టంగా మనం చేసుకున్న ఎంఓయూ పెట్టుబడిగా మారుతుందనుకుంటేనే.. ఒప్పందం కుదుర్చుకోవాలని చెప్పారు. లక్షల కోట్లు అని చెప్పి... అవి వాస్తవ రూపంలోకి రాకపోతే క్రెడిబులిటీ పోయే ప్రమాదం ఉందని కూడా చెప్పారు. ఆయన ఆదేశాల మేరకే ఆ రోజు పనిచేసాం. ● ఎవరిది విధ్వంసం? ఎవరిది అభివృద్ధి?.: 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న మొదటి సమ్మిట్ ఇది. ఇందులో కొత్తగా ఏ ఏ పెట్టుబడులను ఆకర్షించారన్నది ఇప్పటికీ కూటమి నేతలు చెప్పడం లేదు. రెండు రోజుల పాటు సభలు జరిగాయి. దేశ వ్యాప్తంగా పారిశ్రామిక వేత్తలు వచ్చి రాష్ట్ర ప్రజలకు ఒక మెసేజ్ ఇస్తారని ఆశించాం. అయితే చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ 2019–24 మధ్యలో పారిశ్రామిక వేత్తలు అందరూ భయపడిపోయారు, విధ్వంసం చూసి పెట్టుబడికి ముందుకు రాలేదన్నారు. 14 న తొలిరోజు సభ జరిగింది. చంద్రబాబుతో పాటు వేదిక మీద ఉన్న వ్యాపారవేత్తలు ఫోటో.. వైయస్.జగన్ హయాంలో నిర్వహించిన సమ్మిట్ లో పాల్గొన్న వ్యాపారవేత్తలను చూస్తే.. వాస్తవం అర్ధం అవుతుంది. వైయస్ఆర్సీపీ హయాంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి భయపడి రావడం లేదని దుష్ప్రచారం చేస్తున్న తండ్రీ కొడుకులు... 2023లో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆ రోజు వైయస్.జగన్ తో పాటు వేదిక మీద ఉన్న వ్యాపార దిగ్గజాలును గుర్తు చేసుకొవాలి. రిలయన్స్ సంస్థల నుంచి ముఖేష్ అంబానీ, ఆదానీ సంస్థల నుంచి కరణ్ ఆదానీ, దాల్మియాలు, జిందాల్ సంస్థ నుంచి నవీన్ జిందాల్, ఒబెరాయ్ లు, బంగర్ సంస్థల నుంచి సంజయ్ బంగర్, సెంచురీ ప్లైవుడ్స్ నుంచి భజంకా, సైంట్ టెక్నాలజీస్ నుంచి బీ వీ ఆర్ మోహన్ రెడ్డి, జిమ్మార్ సంస్థల నుంచి మల్లిఖార్జున రావు సహా పెద్ద సంఖ్యలో వ్యాపార వేత్తలు హాజరయ్యారు. అప్పడు ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తో పాటు ఆర్దిక, పరిశ్రమల శాఖ మంత్రులగా బుగ్గన రాజేంద్రనాథ్, నేను తప్ప వేదిక మీద పూర్తిగా వ్యాపారవేత్తలే ఉన్నారు. ఒక స్పష్టమైన సందేశం ఇవ్వాలనే లక్ష్యంతోనే అలా చేశాం. నిన్న (శనివారం) జరిగిన సమ్మిట్ లో మాత్రం వేదిక మీద మొత్తం కేబినెట్ అంతా కూర్చున్నారు. సీఎం చంద్రబాబుతో పాటు కరణ్ ఆదానీ, జీఎమ్మార్ సంస్థ అధినేత గ్రంథి మల్లిఖార్జున రావుగారు తప్ప ఆ వేదిక మీద ఉన్న వ్యాపార దిగ్గజాలు ఎవరో చెప్పండి? అంటే మీ ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నాట్టా? మా ప్రభుత్వం మీద నమ్మకం ఉన్నట్టా? పార్టనర్ షిప్ సమ్మిట్స్ లను మా పార్టీ ఆహ్వానిస్తుంది. అయితే అది రాష్ట్రానికి ఉపయోగపడాలే తప్ప.. మీరు చేస్తున్నది వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేదిగా ఉంది. తండ్రీ కొడుకులు చంద్రబాబు, లోకేష్ లు ఒకరిని ఒకరు పొగుడుకుంటూ.. పరస్పరం తబలా కొట్టుకున్నట్టు ఉంది. దీనికోసం ఇన్ని వందల కోట్లు ఖర్చా? 2018లో మీరు ప్రకటించి అమలులోకి రాని ఒప్పందాలకు కొత్తపూత వేసి మీ విజయాలుగా చెప్పుకుంటున్నారు. 2018 పార్ట్నర్షిప్ సమ్మిట్లో కుదుర్చుకున్న ఏబీసీ పవర్, ఎకరన్ ఎనర్జీ తో మరలా ఒప్పందాలు కుదుర్చుకున్నారు. ● మీ బెదిరింపులకు ఇదే సాక్ష్యం... రెన్యూ గ్రూప్ కోసం అయితే సినిమా ఈవెంట్ తరహాలో లోకేష్ ట్విట్టర్ లో పెద్ద అనౌన్స్ మెంట్ చేసారు. తీరా చూస్తే పాత సినిమాకు కొత్త పేరు పెట్టి విడుదల చేశారు. 2022లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే వారికి కావాల్సిన జీవోలు, మద్ధతు ఇచ్చాం. మా హయాంలోనే పెట్టుబడి పెట్టారు. ప్రజలకు మీ ద్వారా కోరుతున్నాను. మేం ఢిల్లీలో డిప్లమాటిక్ కాన్ క్లేవ్ పెడితే.. రెన్యూ పవర్ కి చైర్మన్ సుమన్ సిన్హా దానికి హాజరై రాష్ట్రంలో జరుగుతున్న అభివద్ధి, పెట్టుబడులు గురించి మాట్లాడారు. తర్వాత మరలా విశాఖపట్నంలో జరిగిన సమ్మిట్ కు హాజరై అక్కడ కూడా మాట్లాడారు. తీరా నిన్న వేదిక మీద మాట్లాడుతూ..మేం రాష్ట్రానికి వచ్చి 6 ఏళ్లు అయింది. 6 ఏళ్లు తర్వాత వస్తున్నామని ఆయనే మాట్లాడారు. అంటే పారిశ్రామిక వేత్తలను బెదిరించి ఎవరు? మీరా? మేమా? అదే వేదిక మీద ఢిల్లీ, విశాఖలలో మాట్లాడిన రెన్యూ పవర్ చైర్మన్ 6 ఏళ్ల తర్వాత రాష్ట్రానికి వస్తున్నానని చెప్పారంటే ఆయన్ను ఎవరు ఇబ్బంది పెట్టారో అర్ధం అవుతుంది.. మరోవైపు టీడీపీ ప్రభుత్వ నిలయ విధ్వంసుడు ... లులూ గ్రూప్ చైర్మన్ కూడా తీసుకొచ్చారు. ఆయన ఇప్పటికీ ఏపీలో ఏమీ కట్టడం లేదు. ఏ సమ్మిట్ అయినా ఉంటాడు. 2016 నుంచి విశాఖలో లులూ కన్వెన్షన్, హైపర్ మార్కెట్ అని చెప్పి 10 ఏళ్లు అయింది. ప్రాజెక్టు మాత్రం లేదు. ఇదే ప్రచారానికి, వాస్తవానికి ఉన్న తేడా? 2016 లో మీరు లులూ మాల్ విశాఖలో కడతామని చెపితే... 2026 కూడా వచ్చేస్తుంది కానీ మాల్ రాలేదు. ● ఇనార్భిట్ మాల్ – మా ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం.. అదే వైయస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 2023 ఆగష్టు 1 ఇనార్భిట్ మాల్ కు శంకుస్థాపన చేస్తే... అధి రానున్న 2026 జనవరి నాటికి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అది మా ప్రభుత్వానికున్న చిత్తశుద్ధి. మేం ప్రచారం చేసుకోలేకపోవచ్చు కానీ ప్రజలకు వాస్తవాలు చెప్పాలన్న తాపత్రయం మాది అయితే.. అబద్దాలు చెప్పి అయినా ప్రజలను మోసం చేయాలన్న తాపత్రయం చంద్రబాబుది. ● చంద్రబాబు విజన్ చోర్. క్రెడిట్ చోర్..: మా పథకాలు చోరీ, మా విజన్ చోరీ... అన్నింటిలోనూ క్రెడిట్ చోరీ చంద్రబాబుకి అలవాటు. మూడు దఫాలు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబుకి విశాలమైన సముద్రతీరంలో పోర్టులు కట్టాలన్న ఆలోచన విజనరీగా చెప్పుకునే మీకు ఎందుకు రాలేదు? ఆదానీ, గూగుల్ డేటా సెంటర్ విషయంలో కూడా ఆదానీ సంస్థల డైరెక్టర్ కరణ్ ఆదానీ చాలా స్పష్టంగా చెప్పారు. వైయస్.జగన్ విజన్ అంటే సముద్ర తీరం, నిర్మాణం చేసుకున్న పోర్టులు, దాని ద్వారా ఉద్యోగాల కల్పన, ఆర్దిక కార్యకలాపాలు పెరుగుతాయన్న విజన్ మాది అయితే.. మీకు మాత్రం సముద్రతీరం కనిపిస్తే బికినీ ఫెస్టివల్ పెట్టాలి లేదంటే భార్యభర్తలు కూర్చుని మందు తాగాలి.. ఇదీ వీ విజన్. ఇదే మీ ఆలోచన. సముద్రతీరాన్ని ఆర్థికాభివృద్ధి కోసం మేం ఆలోచిస్తే... జల్సాల కోసం ఎలా వాడుకోవాలని చూస్తూ.. దాన్నే మీరు విజన్ గా చెప్పుకుంటారు. మీ పథకాలు కూడా క్రెడిట్ చోరీయే. అమ్మఒడి అని మేం పేరు పెడితే మీరు తల్లికి వందనం అని మారుస్తారు. రైతు భరోసా అని మేం ప్రవేశపెడితే... అన్నదాత సుఖీభవ అని పేరుమారుస్తారు. గ్రామ సచివాలయాలు అని మేం ఏర్పాటు చేస్తే.. వాటికి విజన్ యూనిట్స్ అని పేరు మారుస్తారు. దివంగత నేత వైయస్సార్ తీసుకొచ్చిన ఆరోగ్యశ్రీని ఎన్టీఆర్ వైద్య సేవ అని పేరు మారుస్తారు. ఇలా మేం తీసుకొచ్చిన వాటికే పేరు మార్చడమే.. మేం తీసుకొచ్చిన కంపెనీలకు మరలా ఎంఓయూలు చేసుకోవడమే తప్ప.. మీరు ఏం చేశారు ? మీ సమ్మిట్ ముగిసిన తర్వాత పాత్రికేయులు విశాఖ స్టీల్ ప్లాంట్ మీద ప్రశ్నిస్తే... మీద పడి రక్కినంత కోపం ఎందుకు మీకు? ఈ ప్రాంత ప్రజల మనసులో ఉన్నదే అడిగితే.. ఆ జర్నలిస్టు మీద మీ ఆగ్రహం ఏంటి? స్టీల్ ప్లాంట్ కార్మికులకున్న ఇబ్బందులు, అనుమానాలను నివృతి చేయాలని ప్రశ్నిస్తే మీకు ఎందుకంత ప్రస్టేషన్? అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ఏం చేయబోతున్నారు? తెల్ల ఏనుగుతో పోల్చుతారా? ● స్టీల్ ప్లాంట్ ని రక్షించలేని అసమర్థ ప్రభుత్వం... గతంలో భారతీయ జనతాపార్టీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం.. స్టీల్ ప్లాంట్ అప్పులను నష్టాల కింద చూపించడంతో పాటు, స్టీల్ కార్మికుల మీద లేనిపోని ఆరోపణలు చేయడం, ప్లాంట్ ను నష్టాల్లో ఉందని చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్లాంట్ గతంలో అనేక లాభాలార్జించిన విషయం వాస్తవం కాదా? స్టీల్ ప్లాంట్ లో నిన్న ఓ సర్క్యులర్ జారీ చేస్తూ... ఉద్యోగులు చేసిన పనికి, ఉత్పత్తి మీద వచ్చిన ఆదాయాన్ని ఆధారంగా చేసుకుని జీతాలు చెల్లిస్తామని చెబుతున్నారు. ఇదెక్కడి న్యాయం? ఉద్యోగులు షేర్ హోల్డర్సా? ఇదెక్కిడి నిబంధన? ఇప్పుడు నష్టాలు వచ్చాయి కాబట్టి దాని ప్రకారం జీతాలు ఇస్తామని చెప్పడానికి.. గతంలో లాభాలు వచ్చినప్పుడు ఉద్యోగులకు పంచిపెట్టారా? 9వేల మంది ఉద్యోగులను ఇప్పటికే సాగనంపారు. 2024 జూన్ కి 2025 నవంబరు నాటికి ఉద్యోగులు సంఖ్య 9– 10 వేల మంది తగ్గిపోయారు. ఇదీ కూటమి ప్రభుత్వం సాగించిన ఘనత. రాష్రానికి అతిపెద్ద పరిశ్రమ, అత్యధిక ఉద్యోగులున్న స్టీల్ ప్లాంట్ ను ఉద్దరించలేకపోతున్న చంద్రబాబు ప్రభుత్వం... రానున్న 2–3 ఏళ్లలో 40 లక్షల మందికి ఉద్యోగాలిస్తామని గొప్పలు చెబుతున్నారు. మీరు తొలగించిన ఉద్యోగుల సంఖ్య మేం చెబుతాం, మీరిచ్చిన ఉద్యోగాలు సంఖ్య చెప్పండి చంద్రబాబూ? సమ్మిట్ మందురోజు 400 ఎంఓయూలు, రూ.9 లక్షల కోట్లు పెట్టుబడులు అని చెప్పి.. సమ్మిట్ పూర్తైన తర్వాత రూ.13 లక్షల కోట్ల పెట్టుబడులు అని చెప్పారు. గతంలో మా ప్రభుత్వ హయాంలో రూ.13 లక్షల కోట్లు పెట్టుబడులకి ఎంఓయూలు జరిగాయి కాబట్టి.. మరలా అదే సంఖ్యను కాపీ చేశారు. ఇవన్నీ కేవలం ప్రచార ఆర్భాటాలు, ఇమేజ్ బిల్డింగ్ మీద పెట్టిన శ్రద్ద... రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్ మెంట్ , నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ, అన్నదాత సుఖీభవతో పాటు పెండింగ్ హామీల అమలు మీద పెట్టండి. రూ.2.20 లక్షల కోట్లు అప్పు చేసిన డబ్బు ఏమైందిని నిలదీశారు. ఇవన్నీ పదే, పదే ప్రచారం చేసి ప్రజలను ఇంకా మోసం చేసే ప్రయత్నం చేయవద్దని.. రెండు మూడేళ్లలో మీ నిజస్వరూపం ప్రజలకు అర్ధం అవుతుందని అమర్నాద్ హెచ్చరించారు. ఇప్పటికైనా వాస్తవాలకు దగ్గరగా ప్రజలకు చేయాల్సిన మంచి చేయాలని డిమాండ్ చేశారు. మీడియా ప్రశ్నలకు బదులిస్తూ.. 2023 మార్చిలో వైజాగ్ లో సమ్మిట్ జరిగితే 2024 వచ్చేనాటికి ఎన్నికలు వచ్చాయి. ఏడాది కాలంలో మా హయాంలో రూ.13 లక్షల కోట్ల పెట్టుబడుల్లో 19 శాతం కార్యరూపం దాల్చాయి. జాతీయ సగటు చూసినా, వైబ్రెంట్ గుజరాత్ లో జరిగే సమ్మిట్స్ చూస్తే.. సరాసరి 20–25 శాతం కార్యరూపం దాల్చుతాయి. మేం జీఐఎస్ నిర్వహిస్తే, నాడు దాదాపు రూ.6 లక్షల కోట్లు ఒక్క ఇంధన రంగంలోనే పెట్టుబడిగా వచ్చాయి. పంప్డ్ స్టోరేజీ ప్లాంట్ల ఏర్పాటుకు సంబంధించి పెట్టుబడులు సమకూరాయి. వాటికి సంబంధించి కర్నూలు, పార్వతీపురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో ప్రాసెస్ కొనసాగుతోంది. అప్పటికప్పుడు చాలా మంది వచ్చినా, పూర్తి అవగాహనతో వ్యవహరించామని, ఆ మేరకే పెట్టుబడులు అంగీకరించామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వివరించారు.