నంద్యాల: ఆపదలో ఉన్నామని తన దగ్గరికి వచ్చి గోడు చెప్పుకున్న బాధితులకు తక్షణ సాయం అందజేసి మరోసారి మంచి మనసును చాటుకున్నారు ముఖ్యమంత్రి వైయస్ జగన్. అవుకు రెండో టన్నెల్ ప్రారంభించి జాతికి అంకితం చేసేందుకు గురువారం నంద్యాల జిల్లా పర్యటనకు వచ్చిన సీఎం వైయస్ జగన్ను కొందరు అభాగ్యులు కలిశారు. అనారోగ్యంతో బాధపడుతూ, చికిత్సకు ఆర్థిక స్థోమత లేక ఇబ్బంది పడుతున్నామని ముఖ్యమంత్రికి వారి ఆవేదన చెప్పుకున్నారు. వారి బాధలు విని చలించిన సీఎం వైయస్ జగన్ వారిలో ఒకరికి రూ.లక్ష, మరొకరికి రూ.5 లక్షల ఆర్థిక సాయం వెంటనే అందజేయాలని నంద్యాల కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్ను ఆదేశించారు. సీఎం వైయస్ జగన్ ఆదేశాలతో 15 నిమిషాల్లోనే బాధితులకు కలెక్టర్ చెక్కులు అందజేశారు. ముఖ్యమంత్రికి రుణపడి ఉంటాం అనంతపురం జిల్లా నార్పల మండలం బొమ్మకుంట గ్రామానికి చెందిన నారా పుల్లారెడ్డి (53) ఒక్క కిడ్నీతోనే పుట్టారు. ప్రస్తుతం ఆ కిడ్నీ కూడా సరిగా పనిచేయడం లేదు. కిడ్నీ ల్యాడర్ మందుల కోసమే నెలకు రూ.26 వేల వరకు ఖర్చవుతోంది. తన ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో మందులు కొనేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తన బాధను సీఎం వైయస్ జగన్కు తెలియజేశారు. తక్షణం స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ కింద బాధితునికి సాయం చేయాలని కలెక్టర్ను ఆదేశించారు. సీఎం ఆదేశించిన నిమిషాల్లోనే కలెక్టర్ డాక్టర్ మనజీర్ జిలానీ శామూన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి బాధితునికి రూ.5 లక్షలు అందజేశారు. తన సమస్య విన్న వెంటనే స్పందించి, సాయం చేసిన ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటానని పుల్లారెడ్డి చెప్పారు. కొత్త జీవితాన్ని ఇచ్చారు నంద్యాల జిల్లా అవుకు మండలం గోకులదిన్నె గ్రామానికి చెందిన గుర్రప్ప, సౌమ్య దంపతులకు ఇద్దరు సంతానం. గుర్రప్ప ఆటో డ్రైవర్. వీరికి రెండో సంతానంగా పాప హర్షిత జన్మించింది. పాపకు మూడు నెలలున్నప్పుడు అనారోగ్యానికి గురైంది. గుండెలో రంధ్రం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అప్పటి నుంచి పాపను ఆస్పత్రుల చుట్టూ తిప్పుతున్నారు. ప్రస్తుతం పాపకు 20 నెలలు. ఆపరేషన్ చేయిస్తే నయమవుతుందని వైద్యులు చెప్పడంతో ఆర్థిక సాయం కోసం ఆ తల్లిదండ్రులు తిరగని చోటు లేదు. గురువారం సీఎం వైయస్ జగన్ను కలిసి వారి బాధను వివరించారు. స్పందించిన ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సాయం అందజేయాలని కలెక్టర్ను ఆదేశించారు. కలెక్టర్ తక్షణ సాయం కింద రూ.లక్ష చెక్కును బాధితులకు అందజేశారు. తమ చిన్నారికి ముఖ్యమంత్రి వైయస్ జగన్ కొత్త జీవితాన్ని ఇచ్చారని ఆ దంపతులు హర్షం వ్యక్తం చేశారు.