తాడేపల్లి: చంద్రబాబుది అక్రమ అరెస్టు కాదు.. అనివార్యమైన అరెస్టు అని మంత్రి అంబటి రాంబాబు పేర్కొన్నారు. కక్షసాధింపు చర్య అని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నారని.. అనేక కుంభకోణాల్లో సూత్రధారి చంద్రబాబు అని ఆరోపించారు. వందల కోట్ల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని మంత్రి అంబటి దుయ్యబట్టారు. నేరాలకు పాల్పడే వారు ఏ స్థాయిలో ఉన్నా అరెస్టు చేయటం, కోర్టులో ప్రవేశపెట్టడం చట్టం ప్రకారం అవసరమని తెలిపారు. చంద్రబాబును అరెస్టు చేయకపోతే రాజ్యాంగాన్ని పూర్తిగా అమలుచేయనట్లు అవుతుందని అన్నారు. అమరావతిలో అసైన్డ్ భూములు, ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్ మెంట్ లో మార్పు వంటి అనేక కుంభకోణాలు చంద్రబాబు చేశారని మంత్రి అంబటి మండిపడ్డారు. ఈడీ, ఇంటెలిజెన్స్, సీఐడీ, ఐటీ అన్ని విచారణ సంస్థలు లోతుగా విచారణ చేశాయని తెలిపారు. ఈ స్కాంలలో ఉన్న పలువురిని విచారణ చేసిన తర్వాత అనేక విషయాలు బయటకు వచ్చాయని పేర్కొన్నారు. ఈ మొత్తం సమాచారంలో అసలు సూత్రధారి చంద్రబాబు అనే తేలిందని మంత్రి పేర్కొన్నారు. సీమెన్స్ కంపెనీకి ఈ కుంభకోణంతో సంబంధం లేదని.. సీమెన్స్ కంపెనీ కోర్టులో 164 నోటీసులో స్పష్టం చేశారని అంబటి అన్నారు. షెల్ కంపెనీల ద్వారా ప్రజాధనం లూటీ చేస్తే చంద్రబాబును అరెస్టు చేయకూడదా? అని ప్రశ్నించారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబుది అక్రమ అరెస్ట్ కాదు...అనివార్యమైన అరెస్ట్:
ఈ రోజు ఉదయం నంద్యాలలో రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ జాతీయ అధ్యక్షుడిని అరెస్ట్ చేశారు.
ఇంత సీనియర్ నాయకుడిని, రాష్ట్ర రాజకీయాల్లో సుదీర్ఘ కాలంగా పనిచేస్తున్న వ్యక్తి అరెస్ట్ కావడం ఒకరకంగా దురదృష్టకరమే. అయితే ఇది అక్రమ అరెస్ట్ కాదు... అనివార్యమైన అరెస్ట్.
దీనివల్ల ఆయనకేదో సింపతీ వస్తుందని, వైఎస్సార్సీపీ కక్షసాధింపుగా ఈ అరెస్టు జరిగిందని ఎల్లో మీడియా, టీడీపీ వారు ప్రచారం చేస్తున్నారు.
ఒక నేరం చేసినప్పుడు, ఒక స్కాంకి సూత్రధారునిగా ఉన్నప్పుడు, వందల కోట్ల ప్రజాధనాన్ని జేబులో వేసుకోడానికి ప్రయత్నం చేసి సఫలం అయినప్పుడు ఆ వ్యక్తి ఎంతటి హోదాలో ఉన్నా అతన్ని అరెస్ట్ చేయడం, విచారణ చేయడం న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం భారత రాజ్యాంగం చెప్తున్న అంశం.
నారా చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే రాజ్యాంగాన్ని మనం పూర్తిగా అమలు చేయనివారిమవుతామనే ఆ విచారణ సంస్థకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు.
14 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ చేయాల్సి వచ్చిందో..? - ఈ అంశాన్ని ప్రజలు లోతుగా ఆలోచించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
చంద్రబాబు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక స్కాంలకు పాల్పడ్డారు.
తీవ్రమైన అవినీతి చేసి వేల కోట్ల రూపాయాలు రాష్ట్ర ఖజానాకు నష్టం చేశాడు.
ఒక్క స్కాం కాదు...స్కిల్ డెవలెప్మెంట్, ఫైబర్ నెట్, అమరావతి రింగ్ రోడ్డు స్కాం..ఇలా చెప్పుకుంటూ పోతే అనేక స్కాంలకు పాల్పడ్డాడు.
కూలంకుషంగా విచారణ చేసిన తర్వాత మాత్రమే ఏ చర్యలైనా జరుగుతాయనేది ప్రజలు గమనించాలి.
ఈ స్కిల్ కేసులో రూ.371 కోట్లు ప్రైవేటు కంపెనీకి బదిలీ చేసి ఆ షెల్ కంపెనీ నుంచి అనేక షెల్ కంపెనీలకు చేరి చివరిగా చంద్రబాబుకు చేరాయి.
దీనినంతటినీ ఈడీ, ఇంటిలిజెన్స్, సీఐడీ, ఇన్కం ట్యాక్స్ అందరూ విచారణ చేశారు.
సుమన్ బోస్ అనే సీమెన్స్ ఇండియా మాజీ ఎండీని, వికాస్ వినాయక్ అనే డిజైన్టెక్ ఎండీ, చంద్రఅగర్వాల్, స్కిల్లర్ ఎంటర్ప్రైజెస్కి చెందిన సురేష్ గోయల్ అనే చార్టెడ్ ఎకౌంటెంట్ని ఈడీ కస్టడీలోకి తీసుకుని అరెస్టు చేసింది.
ఇదంతా విచారణ చేసిన తర్వాత ప్రధాన సూత్రధారుడు, అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబే ప్రధాన ముద్దాయి అని నిర్ధారించుకున్న తర్వాతే అరెస్టు చేశారు.
ఒప్పందం విషయం అసలు సీమెన్స్ కంపెనీకి తెలియదు:
సీమెన్స్ కంపెనీ చాలా పెద్ద కంపెనీ. రూ.3356 కోట్ల ప్రాజెక్టులో ప్రభుత్వ వాటా 10 శాతం. కంపెనీ తన 90 శాతాన్ని ఉచితంగా ఇస్తుందని ఒప్పందం చేసుకున్నారు.
యువతకు శిక్షణ ఇచ్చి వారిలో స్కిల్ పెంచుతాం అంటూ ఒక తప్పుడు అగ్రిమెంట్ చేసుకున్నారు.
ఈ విషయం అసలు సీమెన్స్ కంపెనీ వారికే తెలియదు.. మాకు ఈ ఒప్పందానికి ఎటువంటి సంబంధం లేదని నేరుగా కోర్టు ముందే చెప్పారు.
దీనిలో మేం ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు..పెట్టబోమని చెప్పారు.
కానీ చంద్రబాబు రూ.371 కోట్లకు సీమెన్స్తో ఒప్పదం కుదిరిందని, నిధులు డిజైన్ టెక్కు విడుదల చేసి కొట్టేశారు.
ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఒక షెల్ కంపెనీకి పంపి దాని ద్వారా తన జేబులోకి తెచ్చుకున్న చంద్రబాబును అరెస్ట్ చేయకూడదా..? విచారణ చేయకూడదా?
ఆయన తాబేదారులు ఇప్పుడు ఏదేదో మాట్లాడుతున్నాడు..దత్తపుత్రుడు కూడా ఇది అన్యాయం, అక్రమం అని మాట్లాడుతున్నాడు...
ఇంట్లోకి ఎవర్నీ బయటకు రానివ్వడం లేదంటున్నావ్. నువ్వు హైదరాబాద్లోనే ఉన్నావుగా...రా..నువ్వు కూడా.
ఇంత ఘోరంగా ప్రజా ధనాన్ని లూటీ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేయకుండా ఏ చట్టమైనా ఎందుకు ఉంటుంది..?
చంద్రబాబును అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేస్తే మీరంతా మాట్లాడాలి. చంద్రబాబు అరెస్టు అక్రమం కాదు.. సక్రమం అని దర్యాప్తు సంస్థలే తేల్చాయి.
నేరాలు రుజువు కావడానికి సిద్ధంగా ఉంటేనే వ్యవస్థలు అరెస్ట్ చేస్తాయి.
ప్రాథమిక ఆధారాలుంటేనే వ్యవస్థలు అరెస్ట్ చేస్తాయి. ఆ వ్యవస్థలకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వాల్సిన బాధ్యత మాపై ఉంది.
అరెస్ట్ చేస్తే గావుకేకలు పెడితే ఎలా..?
పురందేశ్వరి గారు నోటీసులు సరిగ్గా ఇవ్వలేదని విమర్శిస్తున్నారు.
అరెస్ట్ చేస్తారు.. కోర్టులో ప్రవేశపెడతారు..న్యాయస్థానాలు ఏం చేయాలో చెప్తాయి.
ఇంత ఘోరంగా సీమెన్స్ కంపెనీ రూ.3000 కోట్లు గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తుందట. ఏ ప్రైవేటు కంపెనీ అయినా ఇలా ఇస్తుందా..?
చంద్రబాబు మాత్రం ఇచ్చేస్తుందని చెప్పాడు. చూడ్డానికి బాబు చెప్పింది బాగానే ఉంది కానీ సీమెన్స్ కంపెనీ ఒక్క పైసా కూడా పెట్టుబడి పెట్టలేదు.
కానీ రూ.371 కోట్లు మాత్రం ఈయన డిజైన్ టెక్ అనే షెల్ కంపెనీకి ఇచ్చేశాడు.
ఆధికారులు వద్దన్నా.. ఒత్తిడి చేసి రూ.371 కోట్లు కొట్టేశారు:
ఆనాడు ఈ డబ్బు ఇవ్వాలని చంద్రబాబు చెబితే అధికారులు అలా ఇవ్వడానికి కుదరదని చెప్పారు.
ముఖ్యమంత్రి ఆదేశిస్తున్నాడు..ఇచ్చేయండి అన్న తర్వాత అధికారులు చేసేదేమీ లేక ఇచ్చేశారు.
అప్పుడు చీఫ్ సెక్రటరీ కృష్ణారావు కూడా దీన్ని అనుమతించలేదు.
అన్ని రూల్స్ అతిక్రమించి, రూ.371 కోట్లు విడుదల చేసి ఆ సొమ్మును కాజేసిన ముద్దాయిని అదుపులోకి తీసుకుని విచారిస్తే అన్యాయం, అక్రమం అట.
కక్షసాధింపు చర్యలు అన్యాయంగా చేస్తే ప్రజలు క్షమించరు.
అనివార్యమైన పరిస్థితుల్లోనే నారా చంద్రబాబునాయుడిని చట్టబద్దంగా అదుపులోకి తీసుకున్నాం.
ఈ స్కాంలో ఉన్న పీఎస్ శ్రీనివాస్, మనోజ్ వాసుదేవ పార్ధసానీ ఇద్దరూ ఇప్పటికే పరార్ అయ్యారు.
వాళ్లు పరారు కావడానికి కూడా బాబే కారణం.
అన్ని అధారాలు సేకరించిన తర్వాత మాత్రమే చంద్రబాబును అరెస్టు చేశారు.
ఈ అరెస్టు న్యాయబద్ధమైనది..సక్రమమైనదని నమ్మి మాత్రమే సీఐడీ అరెస్ట్ చేసింది.
బాబు అవినీతిపై విచారణ జరపాలన్నది మీరే కదా..:
బీజేపీ తరఫున పురందేశ్వరి గారు తన బంధువని స్టేట్మెంట్ ఇచ్చారా..? బీజేపీ తరఫున స్టేట్మెంట్ ఇచ్చారో వివరణ ఇవ్వాలి.
బీజేపీ కూడా చంద్రబాబు చేసిన అక్రమాలపై విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని గతంలో అన్నారు. మర్చిపోయారా?
పవన్ కల్యాణ్ కూడా 2018లో ఇదే మాటలు అన్నారు. ఇప్పుడు గుర్తుకు రావడం లేదా?
ఇంత క్లియర్గా ఆధారాలు దొరికిన తర్వాత కూడా అరెస్ట్ చేయకపోవడం తప్పు అవుతుంది.
ఇంకా ఫైబర్ నెట్ స్కాం ఉంది...అమరావతి రింగ్ రోడ్డు స్కాం ఉంది..కొన్నింటిలో ఆయన కుమారుడు కూడా సూత్రధారిగా ఉన్నాడు.
విచారణ జరుగుతోంది..ఎంతటి పెద్ద వారైనా తప్పించుకోవడం సాధ్యపడదు.
యువగళంలో లోకేశ్ రాజ్యాంగాన్ని పట్టుకున్నాడట..ఆ రాజ్యాంగం చెప్పినట్లే అన్నీ జరుగుతున్నాయన్నది లోకేష్ తెలుసుకోవాలి.
మీకు అభ్యంతరాలుంటే రోడ్డుమీదకు కాదు రావాల్సింది.. న్యాయ స్థానాలకు వెళ్లండి.
ఏం పీకారు అన్నావుగా.. ఆధారాలుంటేనే పీకుతారు స్వామీ!:
చంద్రబాబుని అన్ని ఆధారాలతో అరెస్ట్ చేయడం అన్నది ప్రజాస్వామ్యాన్ని కాపాడటం కోసమే. అవినీతిని అంతమెందించడం కోసం..అక్రమాలను తుడిచివేయడం కోసమే.
చాలా సందర్భాల్లో చంద్రబాబు నాపై కేసులు వేశారు ఏం పీకారు అన్నాడు..
అధారాలుంటేనే పీకుతారు స్వామీ..ఇవాళ ఆధారాలున్నాయి కాబట్టి మిమ్మల్ని అరెస్ట్చేశారు.
ఏ ఆధారాలు లేకుండా ఒక వ్యక్తిని అరెస్ట్ చేయడానికి ఏ చట్టమూ ఒప్పుకోదు. రాజకీయ కక్ష కానే కాదు.
ఆదాయపు శాఖ వారు నోటీసులు ఇస్తే మీరు కాదు ఇవ్వాల్సింది అన్నాడు.
ఇన్కం ట్యాక్స్ అభియోగాలకు డొంకతిరుగుడుగా సమాధానాలు ఇస్తున్నాడు.
చట్టం ముందు ఎవరైనా సమానులే అని చెప్పడానికి ఇదొక ఉదాహరణ.
ఈ అరెస్టులు నన్నేమీ చేయలేవు అనే డైలాగులు కోర్టులో చెప్పుకోమనండి.
పవన్ రోడ్డు మీదకు వచ్చి హింసను ప్రేరేపిస్తాడా?
పవన్ కల్యాణ్ రోడ్డు మీదకు రానివ్వడం లేదు అంటాడు...రోడ్డు మీదకు వచ్చి హింసకు పాల్పడతామంటే ఊరుకుంటారా?
ఈ ప్రభుత్వం సహించదు..అక్రమంగా అన్యాయంగా హింసకు పాల్పడితే ఉక్కుపాదంతో అణచివేయాల్సిందే.
చంద్రబాబును అరెస్ట్ చేస్తే ప్రజలెందుకు రోడ్లమీదకు రావాలి..?
కావాలంటే షూటింగ్ మానుకుని పవన్ కల్యాణ్ను వచ్చి రోడ్డు మీద కూర్చోమనండి..?
ఆయన రాడు కానీ..ప్రజలంతా రోడ్డు మీద కూర్చోవాలని ఆయన కోరిక.
నీతిగురించి మాట్లాడే పవన్ కల్యాణ్..చంద్రబాబు నీతిమంతుడు అని చెప్పే స్థాయికి దిగజారి పోయాడు.
రూ.371 కోట్లు డిజైన్ టెక్ కంపెనీకి అక్రమంగా ప్రభుత్వ నిధులు విడుదల చేస్తే పవన్ కల్యాణ్ సమర్ధిస్తున్నాడు.
అసలు కేసు విచారణ గురించి నీకు తెలుసా పవన్ కల్యాణ్..?
సిగ్గు లేకుండా నువ్వు సపోర్ట్ చేస్తున్నావా..?
అమాకమైన ప్రజలొచ్చి రోడ్లపై ధర్నాలు చేయాలా..?
పవన్ కల్యాణ్, చంద్రబాబు, లోకేశ్, పురంధేశ్వరి అందరూ కట్టకట్టుకుని వచ్చినా చట్టం తన పని తాను చేసుకుపోతుంది.
ఇంకా అనేక కేసులు చంద్రబాబు ఎదుర్కోవాల్సి ఉంటుంది.
ఈ కేసులో 2018లోనే ఒక విజిల్ బ్లోయర్ ఫిర్యాదు చేశాడు..అప్పుడు విచారణ చేపడితే ఆపేశారు.
అన్ని ఆధారాలతో తీగలాగితే.. డొంక కదిలినట్లు కదిలింది.
ఈడీ కూడా ఈ కేసులో అనేక మందిని అరెస్ట్ చేసింది.
రూ.371 కోట్లు మింగేసిన బాబుకు పూలబొకే ఇవ్వాలా..?:
ఒక దుర్మార్గం చేసిన వ్యక్తిని కాపాడే ప్రయత్నం చేస్తావా పవన్.? అదేమంటే నీతి నిజాయితీ అంటావా?
ఆలోచించి మాట్లాడు పవన్ కల్యాణ్...రాజకీయ పార్టీ అయినంత మాత్రానా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతావా..?
పోలీసుల తీరు ఏ విధంగా ఉండాలో పవన్ కల్యాణ్ని చెప్పమనండి.
ఒక కేసులో ముద్దాయిగా ఉండి, రూ.371 కోట్లు మింగేసినట్లు ఆధారాలు దొరికినప్పుడు ఆయనకు వెళ్లి పూలబొకే ఇవ్వాలా..?
ఇప్పుడు నువ్వు వచ్చి నీ దత్తతండ్రికి జైల్లో పూలబొకే ఇచ్చుకో.
అన్యాయం అనుకుంటే పవన్ కల్యాణ్ వచ్చి కోర్టులో చెప్పమనండి.
2018లో ఒకరు ఫిర్యాదు చేయగానే నోట్ ఫైల్స్ మాయం చేశారు.
ఇన్ని ఘోరాలకు పాల్పడితే.. పవన్ కల్యాణ్ ఇంకా మద్దతు పలుకుతున్నారు..?
అన్యాయమైన విషయాల్లో మద్దతు పలకడం సరైంది కాదు..అన్యాయం, అక్రమం, అవినీతి చేసిన వారిని సపోర్ట్ చేస్తే నువ్వూ అవినీతి పరుడివి అవుతావ్ పవన్ కల్యాణ్.
బీజేపీ స్పందిస్తుందని నేను అనుకోలేదు. పురంధేశ్వరి కూడా ఎక్కడా అవినీతి చేయలేదు అనలేదు.. అరెస్ట్ చేసిన విధానం బాగాలేదని ట్వీట్ చేశారు.
పురందేశ్వరి వాళ్లే చంద్రబాబు అంత దుర్మార్గుడు లేడని అన్న విషయం వారు మర్చిపోవచ్చు కానీ..ప్రజలు మర్చిపోలేదు.
సీఎం రమేష్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, ఆదినారాయణలు అందరూ ఎక్కడ పుట్టారు..ఎక్కడ పెరుగుతున్నారో తెలుసు కదా.
కేశినేని కేంద్రానికి లేఖ రాసినా అభ్యంతరం లేదు.. కోర్టులో పిటిషన్ వేయమనండి తప్పేమీ లేదు.
ఆయన ఎంత గొప్పవాడైనా శిక్ష తప్పదు:
ఎంత కాదన్నా... ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా 14 ఏళ్లు పనిచేశాడు.
అలాంటిని వ్యక్తిని ఆధారాలు లేకుండా అరెస్ట్ చేయడానికి ఎవరూ సిద్ధపడరు.
మేం చెప్పే దానిలో వాస్తవం ఉంది కాబట్టి ప్రజల్లో ఆయనకు మద్దతు ఉండదు.
మీరేమన్నా రౌడీలా..మీ ఇష్టం వచ్చినట్లు దోచుకుంటే ప్రభుత్వాలు చూస్తూ ఊరుకోవాలా..?
ఇక ప్రభుత్వాలు, విచారణ సంస్థలు ఇక ఎందుకు..?
ఒకటి కాదు రెండు కాదు..బాబు, తన హయాంలో అనేకమైన స్కాంలకు పాల్పడ్డాడు.
ఆయన ఎంత గొప్పవాడైనా, కేంద్రంలో చక్రం తిప్పినా ఆన్ని స్కాంలలోనూ ఆయనకు శిక్ష తప్పదు.
చట్టప్రకారమే ఏ ప్రభుత్వమైనా నడుస్తుంది..ఆయనైనా నడవాల్సిందే.
లోకేశ్ను తండ్రిని చూసుకోమనండి ఎవరు వద్దన్నారు..జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు..
పద్దతి ప్రకారం కోర్టు అనుమతితో తండ్రిని చూసుకోవచ్చు.
స్కామ్స్ మాస్టర్ బాబుః
ఇదొకటే కాదు.. ముందుంది మొసళ్లపండుగ..
అమరావతి రాజధానిలో జరిగిన అక్రమాలపై మొన్ననే ఇన్కం ట్యాక్స్ నోటీసులు ఇచ్చింది...
ఒకదాని వెనుక ఒకటి వస్తాయి..స్కామ్స్ మాస్టర్ చంద్రబాబు సంగతేంటో తేలిపోతుంది.
లోకేశ్ పాత్ర ఉంటే ఆయన్నీ అరెస్ట్ చేస్తారు..అరెస్ట్ చేసేది కూడా వాళ్లకే ముందే తెలుస్తుంది.
తప్పు చేసిన వారిని అరెస్ట్ చేస్తారని చంద్రబాబుకు తెలుసు కాబట్టి... తనను అరెస్ట్ చేస్తారని ముందే చెప్పాడు.
ఇన్ని తప్పులు చేసిన చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే ఇక ప్రభుత్వాలు, పోలీసు శాఖలు వేస్ట్.
చంద్రబాబు ఆర్ధిక బలశాలి కాబట్టి, రేపు ఆయన కోసం ఓ వంద మంది ప్లీడర్లు హైదరాబాద్, ఢిల్లీ నుంచి కూడా వస్తారు.