పేదలను ఆదుకునే సంక్షేమ సూర్యుడు సీఎం వైయస్‌ జగన్‌

సూర్య భగవానుడు ముఖ్యమంత్రికి మరింత శక్తినివ్వాలి

బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ

తాడేపల్లి: తరతమ భేదం లేకుండా తన కాంతిని ప్రసరింపజేసి సృష్టిని ఆదుకునే ప్రత్యక్ష దైవం సూర్యుడిలా పేదరికంలో ఉన్నవారికి మేలు చేయడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి యజ్ఞం తలపెట్టారని బీసీ సంక్షేమ శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ అన్నారు. పేదలను ఆదుకోవడానికి పాదయాత్ర అనే తపస్సుతో ప్రజల కష్టాల కళ్లారా చూసిన వైయస్‌ జగన్‌.. వారి కుటుంబాల్లో సంతోషాలు తేవాలనే లక్ష్యాన్ని పెట్టుకొని తనకు ఎన్ని కష్టాలు, ఎన్ని నిందలు వచ్చినా చిరునవ్వుతో అన్నీ భరిస్తూ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. వరుసగా రెండో ఏడాది జగనన్న చేదోడు పథకం అమలు కార్యక్రమంలో మంత్రి వేణుగోపాల కృష్ణ పాల్గొని మాట్లాడారు. రథసప్తమి రోజున ఈ కార్యక్రమం అమలు చేయడం సంతోషంగా ఉందన్నారు.

కష్టాన్ని, చెమటను నమ్ముకొని జీవించే రజకులు, దర్జీలు, నాయీ బ్రాహ్మణుల ఎదుగుదల కోసం సంక్షేమ పథకాలతో పాటు మరోటి అదనంగా ప్రోత్సాహం ఇవ్వాలని, అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారులకు రూ.10 వేలు వారి బ్యాంక్‌ ఖాతాల్లో రెండో ఏడాది జమ చేస్తున్నారని, అత్యంత పారదర్శకంగా పథకం అమలవుతుందన్నారు. ప్రభుత్వం అంటే మాది అనే భావనతో బలహీనవర్గాలంతా భావిస్తున్నాయన్నారు. వైయస్‌ జగన్‌ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలన్నింటిలో సింహభాగం బీసీలకు దక్కుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. పేదల మేలు కోసం తపించే సీఎం వైయస్‌ జగన్‌కు సూర్య భగవానుడు మరింత శక్తిని ఇవ్వాలని, సీఎం తలపెట్టిన యజ్ఞఫలాలు ప్రజలకు అందించే ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నానని మంత్రి వేణుగోపాల కృష్ణ అన్నారు. 
 

Back to Top