ప్రతి ఒక్కరు సామాజిక దూరం..పరిశుభ్రత పాటించాలి 

మూడవ దశలోకి వెళ్లకుండా నిరోధించేందకు సీఎం వైయస్‌ జగన్‌ చర్యలు

ప్రజల సహకారంతోనే కరోనా నియంత్రణ సాధ్యం

 ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని

తూర్పు గోదావరి:  ప్రతి ఒక్కరు సామాజిక దూరం..పరిశుభ్రత పాటిస్తే కరోనాను నియంత్రించగమని ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్లనాని పేర్కొన్నారు. సోమవారం తూర్పు గోదావరి జిల్లాలో మంత్రి పర్యటించి కరోనా వైరస్‌ వ్యాప్తి చెందకుండా తీసుకుంటున్న చర్యలపై సమీక్షించారు. ఏపీలో నమోదు అయిన 6 కరోనా పాజిటివ్‌ కేసులలో వారి ఆరోగ పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. ప్రస్తుతం ఏపీలో కరోనా వ్యాప్తి రెండవ దశలో ఉందని, మూడవ దశలోకి వెళ్లకుండా నిరోధించేందకు ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పలు చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఇందుకోసం కరోనా పాజిటివ్‌ కేసులు వచ్చిన జిల్లాల్లో పర్యటించి పరిస్థితిని సమీక్షించమని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించినట్లు చెప్పారు. 

 కాగా.. ప్రజల సహకారంతోనే కరోనాను నియంత్రించగలమని మంత్రి అన్నారు. పాజిటివ్‌ కేసులు నమోదు అయిన జిల్లాలలో ప్రజలను మరింతగా అప్రమత్తం చేయ్యాల్సిన అవసరం ఉందన్నారు. నియోజకవర్గంకు 100 పడకల ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 108 సిబ్బందికి అవసరమైన పరికరాలు.. వస్తువులు అందించడంతో పాటుగా.. వారికి మనోధైర్యాన్ని నింపేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తక్కవగా ఉందని, ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు. లాక్‌ అవుట్‌ నేపథ్యంలో ఎవరైనా నిత్యవసర వస్తువుల ధరలు పెంచినా... బ్లాక్‌ మార్కెటింగ్‌ చేసిన వారిపై కేసులు నమోదు చేస్తామని మంత్రి హెచ్చరించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకునే చర్యలకు ప్రజలందరూ సహకరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
 

Back to Top