విశాఖపట్నం: ఈ నెల 28వ తేదీ నుంచి విశాఖ ఉత్సవ్ ప్రారంభం కానున్నట్లు పర్యాటక, సంస్కృతిక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్ చెప్పారు. విశాఖపట్నంలో విశాఖ ఉత్సవ్కు సంబంధించిన ప్రోమోను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు గుడివాడ అమర్నాథ్, కరణం ధర్మశ్రీ, తుప్పల నాగిరెడ్డి, అదీప్రాజ్, వీఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్లు పాల్గొన్నారు. ఈ మేరకు మంత్రి అవంతి శ్రీనివాస్ విశాఖ ఉత్సవ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 28న విశాఖ ఉత్సవ్ను ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని చెప్పారు. కైలాసగిరిపై వీఎంఆర్డీఏ అభివృద్ధి పనులను, వైయస్ఆర్ సెంట్రల్ పార్కులో ఫ్లవర్షోను సీఎం వైయస్ జగన్ ప్రారంభిస్తారని చెప్పారు. విశాఖ ఉత్సవ్కు ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసిందన్నారు. విశాఖ ఉత్సవ్ తొలిరోజు బీచ్లో కళాకారులతో కార్నివాల్ నిర్వహణ ఉంటుందని, ఉత్సవ్లో దేవీశ్రీ, తమన్ల లైవ్షోలు ఉండబోతున్నాయన్నారు. విశాఖ ఉత్సవ్ ముగింపు వేడుకల్లో గవర్నర్ హరిచందన్ పాల్గొంటారని వివరించారు. అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకునే నాయకుడు సీఎం వైయస్ జగన్.. అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేస్తారన్నారు.