తాడేపల్లి: ఈ నెల 12 న యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి, అదే రోజు వైయస్ఆర్సీపీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్టేట్ కో-ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం...ఈ విషయంలో తక్షణమే స్పందించాలని, ఆయా వర్గాల తరుపున ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు ఈ నెల 12వ తేదీన అన్ని జిల్లా కేంద్రాల్లో తలపెట్టిన యువత పోరు కార్యక్రమ ర్యాలీలు, జిల్లా కలెక్టర్లకు మెమోరాండం సమర్పించే కార్యక్రమంలో పార్టీ శ్రేణులు ఉత్సాహంగా పాల్గొనాలని ఆయన సూచించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జ్లు, రీజనల్ కోఆర్డినేటర్లు, అనుబంధ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర కార్యదర్శులు, ముఖ్యనేతలతో సజ్జల రామకృష్ణారెడ్డి శుక్రవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ... రాష్ట్రంలో లక్షలాది మంది విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు వైయస్ఆర్ కాంగ్రెస్ అధినేత వైయస్ జగన్ యువత పోరు కార్యక్రమానికి పిలుపునిచ్చారు. అన్ని జిల్లా కేంద్రాల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, ఆయా వర్గాల ప్రజలు సంయుక్తంగా ర్యాలీగా జిల్లా కలెక్టర్కు మెమోరాండంను సమర్పించాలి. మొత్తం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు ఈ కార్యక్రమంలో ఉత్పాహంగా పాల్గొనాలి. విద్యార్ధులే కాదు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించి మోసగించిన వైనం, వైద్య విద్యను ప్రైవేటీకరణ చేయడం ఇలా విద్యార్ధులు, యువతను నిలువునా మోసగించిన తీరుపై వారి పక్షాన పోరుబాటకు సిద్దమయ్యాం. ఇది అన్ని వర్గాల ప్రజలకు అండగా నిలబడాల్సిన సమయం, సందర్భం. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, వారికి న్యాయం జరిగేలా ఒత్తిడి చేసేందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈ కార్యక్రమంలో విద్యార్ధులు, యువకులు, వారి తల్లిదండ్రులంతా భాగస్వామ్యం అయ్యేలా విస్తృతంగా ప్రచారం చేయాలి కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తూ, రైతులకు అండగా నిలుస్తూ, ఎన్నికల తరువాత వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో చేపట్టిన కార్యక్రమం ఇప్పటికే విజయవంతమైంది. ఆ తర్వాత విద్యుత్ ఛార్జీలపై చేసిన కార్యక్రమం కూడా అదే స్ధాయిలో విజయవంతం అయింది. ఈ రెండు కార్యక్రమాల ద్వారా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంత బలంగా ఉందో, ప్రజాసమస్యలపై ఎంత దృఢంగా ఉందో వెల్లడయింది. జిల్లా పార్టీ అధ్యక్షులు కీలకంగా అందరినీ సమన్వయం చేసుకుంటూ ఈ మూడో కార్యక్రమాన్ని (యువత పోరు) కూడా విజయవంతం చేయాలి. ఇందుకు సంబంధించి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని కూడా నిర్వహిద్దాం. పార్టీ శ్రేణులు సైతం భారీగా ఈ కార్యక్రమంలో పాల్గొని, ప్రజల గొంతుకగా సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేందుకు కృషి చేయాలి. జిల్లా స్ధాయిలో జరుగుతున్న కార్యక్రమం కాబట్టి ఆయా నియోజకవర్గాల ఇంఛార్జ్లు అందరూ తగిన విధంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకుని ఈ కార్యక్రమం విజయవంతం చేయాలి. నియోజకవర్గ ఇంఛార్జ్లంతా కూడా తప్పనిసరిగా పాల్గొని ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగట్టాలి. ఈ నెల 12 న మన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రతీ చోటా ఘనంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహించాలి, మన పార్టీపై ఉన్న ప్రజాభిమానం ఈ సందర్భంగా వెల్లడవ్వాలి, పార్టీ క్యాడర్ అంతా ఉత్సాహంగా పాల్గొని ప్రజాభిమానం ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాలి, ఈ వేడుకలను అందరం విజయవంతం చేద్దాం, ఈ కార్యక్రమాన్ని ఉదయాన్నే పూర్తి చేసుకుని అనంతరం యువత పోరు కార్యక్రమం నిర్వహించాలి. మన అధినేత శ్రీ వైయస్ జగన్ గారు యువత పోరు కార్యక్రమం ప్రజలకు సంబంధించిన అంశం కాబట్టి ఆ రోజు యధావిధిగా కొనసాగించాలని సూచించారు, అంతేకాక పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామాల నుంచి రాష్ట్రస్ధాయి వరకూ వైయస్ఆర్సీపీ జెండా ఎగురవేయాలి. సోషల్ మీడియాకు సంబంధించి కొత్తగా మరికొంతమంది కార్యకర్తలపై పోలీసులు కేసులు నమోదు చేస్తూ వేధిస్తున్నారు, వారికి అవసరమైన న్యాయసహాయం అందించేందుకు లీగల్ సెల్ సిద్దంగా ఉంది, ఏ సమయంలో ఎవరి దృష్టికి వచ్చినా వెంటనే లీగల్ సెల్ను అప్రమత్తం చేసి వారికి అండగా నిలబడాలి. వైయస్ఆర్సీపీ మండల స్ధాయి వరకూ కమిటీల నియామకం కూడా ఈ నెల 16 కల్లా పూర్తి చేయాలని వైయస్ జగన్ గారు ఆదేశించారు. పార్టీ కమిటీల నియామకంపై ఆయన ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. దీనిని ప్రతి ఒక్క జిల్లా అధ్యక్షులు సీరియస్ గా తీసుకోవాలి, అవసరమైతే రాష్ట్ర స్ధాయి నాయకుల సహకారం తీసుకుని కమిటీల నియామకాలు పూర్తిచేయాలని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు.