అరుదైన ఆత్మీయుడు.. స్నేహం కోసమే రాజకీయాల్లోకి

సీఎం  వైయ‌స్‌ జగన్‌తో స్నేహంతోనే రాజకీయాల్లోకి గౌతమ్‌రెడ్డి

ఎన్ని సవాళ్లు ఎదురైనా చిన్ననాటి మిత్రుడి వెంటే 

వైయ‌స్ఆర్‌సీపీ ప్రభుత్వ విజయాల్లో కీలక పాత్ర

 అమరావతి : రాజకీయ అవసరాల కోసం స్నేహాలు వర్తమాన పరిస్థితుల్లో సాధారణంగా కనిపిస్తుంటాయి. దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అందుకు పూర్తి మినహాయింపు. స్వప్రయోజనాల కోసం ఆయన స్నేహం చేయలేదు. స్నేహం కోసమే రాజకీయాల్లోకి వచ్చిన అరుదైన వ్యక్తిత్వం ఆయన సొంతం. ఎన్ని కష్టాలు ఎదురైనా స్నేహితుడి వెన్నంటి నిలిచారు. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో ఆయన బాంధవ్యం నేటి రాజకీయాల్లో అరుదైన స్నేహ బంధానికి ప్రతీకగా నిలుస్తోంది. 

చిన్నప్పుడే చిగురించిన స్నేహబంధం..
రాజకీయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ గౌతమ్‌రెడ్డి విద్యాభ్యాసం అనంతరం వ్యాపార రంగంపైనే దృష్టి కేంద్రీకరించారు. తొలినాళ్లలో రాజకీయ వ్యవహారాల పట్ల అంతగా ఆసక్తి చూపేవారు కాదు. ఆయన తమ్ముడు పృథ్వీరెడ్డి హైదరాబాద్‌లో చదువుకునే సమయంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి క్లాస్‌మేట్‌ కావడంతో స్నేహబంధం ఏర్పడింది. ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాకముందే ఆత్మీయ అనుబంధం మరిం త బలపడింది. 2009 ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ స్థానం టికెట్‌ కోసం నాడు కాంగ్రెస్‌ పార్టీలో తీవ్రపోటీ నెలకొనగా వైఎస్సార్‌ కుటుంబంతో ఉన్న సాన్నిహిత్యంతో గౌతమ్‌రెడ్డి తండ్రి మేకపాటి రాజమోహన్‌రెడ్డికే అవకాశం దక్కింది. 

ఆర్థికంగా అణచివేసినా వెరవలేదు..
  మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హఠాన్మరణం అనంతరం ఆయన అండదండలతో కాంగ్రెస్‌ నుంచి గెలిచిన పలువురు ప్రజాప్రతినిధులు ముఖం చాటేసినా కష్టకాలంలో మేకపాటి కుటుంబం వైయ‌స్‌ జగన్‌ వెన్నంటే నిలిచింది. నెల్లూరు జిల్లాలో ఓదార్పు యాత్ర నిర్వహణలో పాలు పంచుకుంది. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డికి అండగా నిలిచేందుకు తన ఎంపీ పదవిని త్యజించేందుకు సైతం మేకపాటి రాజమోహన్‌రెడ్డి వెనుకాడ లేదు. వైఎస్‌ జగన్‌ వెన్నంటి నిలిచిన మేకపాటి కుటుంబాన్ని నాడు కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తీవ్రంగా వేధించింది. అయినప్పటికీ గౌతమ్‌రెడ్డి వెరవక వైయ‌స్‌ కుటుంబంతోనే రాజకీయంగా ప్రయాణం కొనసాగించారు. 

వివాద రహితుడు.. అందరివాడు  
రాష్ట్ర రాజకీయాల్లో అజాత శత్రువుగా వెలుగొందారు మేకపాటి గౌతమ్‌రెడ్డి. పన్నెండేళ్ల రాజకీయ జీవితంలో ఆయన ఆద్యంతం వివాద రహితుడిగానే మెలిగారు. ఆర్థికంగా స్థితిమంతుడు.. సీనియర్‌ రాజకీయ నేత మేకపాటి రాజమోహన్‌రెడ్డికి కుమారుడైనా గౌతమ్‌రెడ్డి అత్యంత సాధారణంగానే వ్యవహరించారు. రాజకీయాలకు అతీతంగా అందరివాడిగా మన్ననలు పొందారు. వ్యాపారవేత్తగా ఉంటూ తనకేమాత్రం సరిపడని రాజకీయాల్లోకి వచ్చినప్పటికీ మృదుస్వభావిగానే కొనసాగారు. ప్రత్యర్థులపై ఏనాడూ వ్యక్తిగత విమర్శలు చేయకపోవడం హుందాతనానికి నిదర్శనం. 2014, 2019 ఎన్నికల్లో పోటీ చేసిన ఆయన ఎన్నికలు అయిపోగానే రాజకీయాలను పూర్తిగా పక్కనపెట్టేసి ప్రజా సమస్యలపైనే దృష్టి సారించేవారు. అందుకే ఆయనపై పోటీ చేసి ఓడిపోయిన ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులు కూడా ఆయనతో గౌరవ ప్రదమైన సంబంధాలనే కొనసాగించారు. గౌతమ్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు సైతం దుందుడుకుగా వ్యవహరించలేదు. అధికారంలోకి వచ్చిన తరువాత కూడా ఏనాడూ అహంకారం ప్రదర్శించలేదు. ప్రతిపక్ష నేతగా ఆనాడు ప్రజా సమస్యలు, విధానపరమైన అంశాలపైనే స్పందించారు తప్ప వివాదాస్పదుడు కాలేదు. అందుకే ఆయన విమర్శలను కూడా ఆనాటి ప్రభుత్వాలు తిప్పికొట్టలేకపోయేవి. ఆయన లేవనెత్తిన అంశాలను పరిష్కరించడానికే ప్రాధాన్యమిచ్చేవి. 

మంత్రిగానూ హుందాగానే..
వైయ‌స్ఆర్‌సీపీ అధికారంలోకి వచ్చాక కీలక మైన పరిశ్రమలు, ఐటీశాఖ మంత్రిగా నియమితులైన తరువాత కూడా గౌతమ్‌రెడ్డి హుందాతనంతో కూడిన రాజకీయాలే నెరిపారు. ప్రతిపక్ష టీడీపీ కూడా అసెంబ్లీ సమావేశాల్లోగానీ బయట గానీ గౌతమ్‌రెడ్డిని విమర్శించే సాహసం చేయలేకపోయింది. మంత్రిగా సమర్థవంతమైన పనితీరు కనబర్చిన ఆయన తనను విమర్శించేందుకు ప్రతిపక్షాలకు ఏనాడూ అవకాశం ఇవ్వలేదు. చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటు అంశంపై ప్రతిపక్ష టీడీపీ ఓ సారి అసెంబ్లీలో ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించింది. పరిశ్రమల శాఖ మంత్రిగా సమాధానమిస్తూ.. గౌతమ్‌రెడ్డి తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ధికి చేపట్టిన చర్యలు, వాటి సత్ఫలితాలను వివరించారు. ఎక్కడా ప్రతిపక్ష టీడీపీని ఒక్క మాట అనకుండా.. ఎదురుదాడి చేస్తున్నట్టుగా కాకుండా ఆయన సవివరంగా ఇచ్చిన సమాధానంతో టీడీపీ మిన్నుకుండిపోయింది.

వర్గ రాజకీయాలు లేవు.. అవినీతి మరకా లేదు
ఎత్తులు, జిత్తులతో నిత్యం వర్గ రాజకీయాలకు కేంద్ర బిందువుగా ఉండే నెల్లూరు జిల్లాలో గౌతమ్‌రెడ్డి తనదైన శైలిలో వివాద రహితుడుగా గుర్తింపు పొందడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి అత్యంత సన్నిహితుడైన ఆయన వైఎస్సార్‌సీపీ ఆవిర్భావం నుంచి పార్టీలో ఉంటున్నప్పటికీ దానిని అవకాశంగా చేసుకుని జిల్లాపై రాజకీయ ఆధిపత్యం చెలాయించేందుకు యత్నించలేదు. ఇతర నియోజకవర్గాల వ్యవహారాల్లో జోక్యం చేసుకోలేదు. జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర నేతలను కలుపుకుని జిల్లా అభివృద్ధికి కృషి చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోని అరుదైన రాజకీయ నేతగా గౌతమ్‌రెడ్డి గుర్తింపు పొందారు. కనీసం రాజకీయ ప్రయోజనాల కోసమైనా ప్రతిపక్షాలు ఆయనపై అవినీతి ఆరోపణలు చేసేందుకు సాహసించలేదు.  గౌతమ్‌రెడ్డి ఎవర్నీ ఏకవచనంతో సంభోదించే వారు కాదు.  

Back to Top