ప్రత్యేక హోదా కోసం పోరాడుతుంది వైయస్‌ఆర్‌సీపీనే

– రాష్ట్ర వ్యాప్త ధర్నాలు, బంద్‌లు, అరెస్టులు సాక్ష్యం
– విశాఖలో శాంతి ర్యాలీకెళితే వైయస్ జగన్ ను అరెస్టు చేసింది మరిచారా 
– జై ఆంధ్రప్రదేశ్‌ ఉద్యమం హోదా కోసం కాదా..
 –ఇవన్నీ తెలిసి కూడ పోరాడేవారిపై నిందలా..?
‍‍‍
సరిహద్దులు దాటితే చట్టాలు మారుతాయేమో కానీ.. నిజాలు కాదు. నిజం ఎప్పటికీ ఒక్కటే. ఎంతలా మరుగున పడేద్దామని చూసినా ఏదో ఒక రోజున పైకి రాకమానదు. నిజం నివురు గప్పిన నిప్పులాంటిది.. నిప్పు లాంటి నిజమైన ప్రత్యేక హోదా ఎవర్ని దహించవేయబోతోందో తెలియాలంటే కొంతకాలం ఓపిగ్గా ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఏపీలో పరిస్థితులన్నీ ఆ ఒక్క నిజం చుట్టూనే తిరుగుతున్నాయి. ఏపీకి ప్రత్యేక హోదా అనే హక్కును సాధించడంలో నిజంగా పోరాడుతోంది ఎవరు..  పేరు కోసం పాకులాడుతోంది  ఎవరు.. పోరాటాన్ని అడ్డుకుంటోంది ఎవరు.. ప్రత్యేక హోదా ఇవ్వాల్సింది ఎవరు.. దాని కోసం పోరాడాల్సింది ఎవరు.. ఈ ‘ఎవరు’ అనే దాని మీద జనాలందరికీ ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. నాయకులు ఎన్ని కుట్రలు పన్నినా నిగ్గుతేలాల్సిన రోజున మాత్రం ఎవరూ ఆపలేరు. 

ఇప్పుడు మెలిక పెట్టాలనిపిస్తోందా...
నిన్న గుంటూరులో కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో జరిగిన ఏపీకి ప్రత్యేక హోదా భరోసా సభ నుంచి రాహుల్‌ గాంధీ జ్ఞానబోధ చేసిపోయారు. ఇన్నాళ్లు రాష్ట్రానికి రావడానికే భయపడిపోయిన రాహుల్‌.. ప్రత్యేక హోదా సాధన పేరు చెప్పుకొని ఎలాగోలా సభకు హాజరయ్యారు. ఒక్కడే రాలేక యూపీఏ మిత్రపక్షాలను వెంటేసుకుని వచ్చారో..  ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో అందరం ఏపీకి వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పాలనుకున్నారో గానీ యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్, జేడీయూ అధ్యక్షుడు శరద్‌ యాదవ్, సీపీఐ, సీపీఎం నాయకులు సభకు హాజరై రాహుల్‌తో వేదిక పంచుకున్నారు. పోలవరాన్ని కేంద్రం నుంచి కమీషన్ల కోసం చంద్రబాబు తీసుకున్నారని.. రాష్ట్రంలో భూముల కుంభకోణాలు.., రైతుల నుంచి ప్రాజెక్టుల పేరుతో భూములు లాక్కోవడం.., సరిగ్గా నష్టపరిహారం చెల్లించకపోవడం వంటి చాలా విషయాలపై స్పష్టంగా చంద్రబాబును విమర్శించిన రాహుల్‌ గాంధీ.. ఏ విషయం మీదైనైతే సభను నిర్వహించారో దానిపై స్పష్టత కొరవడినట్టుగా ఉంది. అసలు మరుగున పడిపోయిన ఏపీకి ప్రత్యేక హోదా నినాదాన్ని భుజాలకెత్తుకున్నది ఎవరు.. రాష్ట్ర వ్యాప్త బంద్‌లకు పిలుపునిచ్చింది ఎవరు.. విశాఖలో జరిగిన శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వెళ్లి ఎయిర్‌పోర్టులో అరెస్టయింది ఎవరు.. యువభేరి పేరుతో ఇప్పటికే దాదాపు పది జిల్లాల్లో విద్యార్థులు, యువతకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించింది ఎవరు... వీటన్నిటికీ సమాధానం వైయస్‌ఆర్‌సీపీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రత్యేక హోదా కోసం ఎంపీలతో రాజీనామా చేయిస్తామనలేదా.. రాబోయే ఎన్నికల్లో మా నినాదం ప్రత్యేక హోదా అని ఇప్పటికే ఆయనొక్కరే కనీసం వందసార్లయినా చెప్పి ఉంటారు. జై ఆంధ్రప్రదేశ్‌ పేరుతో విశాఖలో భారీ సభ నిర్వహించారు. వైయస్‌ఆర్‌సీపీ నుంచి ప్రాతినిథ్యం వహిస్తున్న ఒంగోలు పార్లమెంట్‌ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి ఇప్పిటికే రెండుసార్లు ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ పార్లమెంట్‌లో ప్రైవేటు మెంబర్‌ బిల్లు కూడా ప్రవేశపెట్టాడాయె. ఈ పార్టీ ఆధ్వర్యంలో ఇప్పటికే దాదాపు 30కి పైగా పోరాటాలు, ధర్నాలు, రాష్ట్రవ్యాప్త బంద్‌లు జరిగాయి. దానికి పలు సందర్భాల్లో ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ, బీజేపీలు తప్ప కాంగ్రెస్‌తోసహా అన్ని పార్టీలు మద్దతు పలికాయి. మరి ఈ విషయం ఆ పార్టీ పీసీసీ ఛీఫ్‌ రఘువీరారెడ్డి చెప్పడం మరిచారో.. చెప్పినా రాహుల్‌గాంధీ మరిచారో గానీ...ఇంతదూరం వచ్చాం, ఏదో ఓ నిందవేయాలి కదా అని వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానికి భయపడుతున్నారని నోరుజారారు. భయపడేవాడైతే ఒకటీ రెండు దీక్షలు చేసేసి ముగించేవాడే కదా.. మొన్న ప్రధానిని కలిసినప్పడు కూడా ప్రత్యేక హోదా గురించే మాట్లాడారని టీడీపీ అనుకుల మీడియాల్లోనూ వార్తలొచ్చాయి. పత్రికలూ అచ్చొత్తాయి. ఇదంతా రఘువీరాకి తెలియదా..? నిజానికి ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని నినాదాన్ని తలకెత్తుకున్నదే వైయస్‌ఆర్‌సీపీ.. మిగతావన్నీ అడపాదడపా చప్పుడు చేసేసి జెండాలు మడతపెట్టుకుని మూలనపెట్టే పార్టీలే. పవన్‌ కళ్యాణ్ లాంటి వాళ్లు ట్విట్టర్‌లో తప్ప హోదా గురించి మాట్లాడరు. చిన్నాచితకా కష్టసుఖాల్లో పరామర్శలకు వెళ్లడానికి తీరికుంటది కానీ.. ఐదున్నర కోట్ల మందికి ప్రయోజనం చేకూర్చే కార్యక్రమానికి వెళ్లడానికి మాత్రం టైం అడ్జెట్‌ కాలేదట పాపం. 

జీఎస్టీకి మద్దతివ్వకుండా మెలికపెట్టలేదే..
రెండు సార్లు ఆమోదం లభించక వాయిదా పడుతూ వచ్చిన జీఎస్టీ బిల్లు యూపీఏ ఆమోదం లభించకపోయుంటే మాత్రం పార్లమెంట్‌లో తప్పనిసరిగా పాసయ్యేది కాదు. ఈ బిల్లు కోసం వెంకయ్య ద్వారా కాంగ్రెస్‌కు ఎన్నెన్ని రాయబారాలు నడిచాయో.. ప్రతిపక్ష పార్టీలను బీజేపీ ఎంతగా దువ్విందో రాహుల్ సహా నిన్న గుంటూరు వేదికపై ఉన్న పెద్దలందరికీ (సీపీఐ, సీపీఎం) అందరికీ తెలుసు. మరి ఏపీకి ప్రత్యేక హోదా సాధించే విషయంలో అంత ప్రేముంటే ఆ రోజే వీరంతా మెలిక పెట్టుంటే సరిపోయేది కదా. ప్రధాని మోడీకి ఎదురు చెప్పలేక చంద్రబాబు దాసోహ మయ్యారని.. కమీషన్ల కోసం పోలవరాన్ని కేంద్రం నుంచి తెచ్చేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేసిన రాహుల్‌ గాంధీ నాలుగు రోజులు ఇక్కడే ఉన్నా చంద్రబాబును ఎందుకు నిలదీయలేకపోయారు.  ఇలాంటి వేమీ చేయకపోగా పోరాడుతున్న పార్టీల మీద బురద జల్లడానికి మాత్రం సిద్ధంగా ఉండటం దారుణం. 
Back to Top