వరంగల్: ప్రజలకు మేలు చేయలేని ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపేద్దామని వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్ పిలుపు ఇచ్చారు. టీఆర్ఎస్, టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్ లకు ఓట్లు అడిగే హక్కు లేదని, నిజాయతీ విలువలతో పనిచేస్తున్న వైఎస్సార్సీపీ కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉందని ఆయన అభివర్ణించారు. రాజన్న రాజ్యం తెచ్చుకొనేందుకు అంతా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి గెలిపించాలని జగన్ కోరారు. ప్రసంగ సారాంశం ఆయనమాటల్లోనే.. మిత్రులారా.. కేసీయార్ మన జిల్లాకు వస్తే కొన్ని ప్రశ్నలు అడగాల్సి ఉంది. మన జిల్లాలోనే 150 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొన్నారు. దీనికి కారణం ఏమిటి అని అడగండి పత్తి పొలాల్లో రైతుల్ని కలిసి రమ్మని అడగండి. ఎందుకంటే, పత్తి ని అమ్ముకోవాలంటే మద్దతు ధర 4,100 అంటారు. కానీ, రైతులకు మాత్రం 3,500 కూడా కిట్టుబాటు కాని పరిస్థితి. కానీ దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయంలో క్వింటాల్ కు రేటు 6,700 పలికే రోజు లు గుర్తు చేసుకోండి. మరో విషయం... లక్ష లోపు రుణాలన్నీ మాఫీ చేస్తాం అన్నారు. ఈ మాట విని చాలామంది రైతులు అప్పులు కట్టకుండా ఆగిపోయారు. ఇప్పుడు మీరేమో 4, 5 విడతలు అని చెబుతున్నారు. ఈలోగానే బ్యాంకులు అపరాధ వడ్డీ 14 నుంచి 18 శాతం వసూలు చేస్తున్నాయి. అంటే ఈ ఇస్తున్న డబ్బు వడ్డీలకే చాలటం లేదు. రుణాలు తీర్చక పోవటంతో సబ్సిడీ లు, ఇన్సూరెన్స్ అందటం లేదు. నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. ఇప్పుడు కందిపప్పు రూ. 230 పలుకుతోంది. ఇదే కందిపప్పు సంవత్సరం క్రితం 90 రూపాయిలు ఉండేది. మరో వైపు పెసరపప్పు 200 దాకా పలుకుతోంది. అదే ఏడాది క్రితం రూ.80 ఉండేది. ఉల్లిపాయలు కిలో కి రూ. 40 పలుకుతోంది. కానీ ఏడాది క్రితం రూ. 14 ఉండేది. , ఏడాది కాలంలో రేట్లు ఈ విధంగా పెరుగుతూ ఉంటే ఏ రకంగా కొనుక్కోవాలి అని అడగండి ఎన్నికల సమయంలో కేసీయార్ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు కట్టిస్తారు అన్నారు. 18 నెలల కాలంలో మీరు ఎన్ని ఇళ్లు కట్టించారు అని నిలదీయండి. తాను కట్టించిన ఇళ్లు 394. దివంగత నేత వైఎస్సార్ గారి పాలనను గుర్తు చేసుకోండి. దేశం మొత్తం మీద 48లక్షల ఇళ్లు నిర్మిస్తే, కేవలం మన దగ్గరే 48 లక్షలు కట్టించి దేశానికే మార్గ దర్శకంగా నిలిచారు. అంటే 10 లక్షల ఇల్లు. ఈయన మాత్రం 394 ఇళ్లు కట్టించారు. ఏమనుకోవాలి..! ఎన్నికల ముందు ..ప్రతీ పేదవారికి 3 ఎకరాలు ఇస్తామన్నారు. 18 నెలలు అయిపోయాక కేవలం 16 వందల ఎకరాలు ఇచ్చి చేతులు దులుపుకొంటున్నారు. కానీ, దివంగత వైఎస్సార్ తన పరిపాలనలో 20 లక్షల 60 వేల ఎకరాలు పంపిణీ చేశారు. ఇక్కడే మరొక్క విషయం చెప్పాలి. దివంగత మహానేత వైఎస్సార్ గారి పరిపాలన గుర్తు చేసుకోండి. తెలుగు నేల మీద నుంచి పేదరికం పోవాలి అని కలగన్నారు. పేదరికానికి రెండు కారణాలు అని ఆయన గుర్తించారు. మొదటిది పేదల కుటుంబాల్లో చదువుకోసం అప్పులు పాలయ్యే పరిస్థితి ఉంటుంది. దీనికి అడ్డుగట్ట వేసేందుకు పేదవారి పిల్లలు చదువుకి డబ్బు అడ్డు రాకూడదని ఫీజు రీ ఇంబర్స్ మెంట్ పథకాన్ని ప్రవేశ పెట్టారు. కానీ ఈ ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేస్తోంది. గత సంవత్సరం అంటే 2014..15 కి పథకం అమలుకి 2,400 కోట్లు కావాలి. కానీ, 900 కోట్లు విదిలించి రూ. 1530 కోట్లు బకాయిలు పెట్టారు. అప్పుడే విద్యా సంవత్సరం మొదలై 5 నెలలు అయిపోయింది. కాలేజీలకు పిల్లలు పోతుంటే యాజమాన్యాలు పీజుల గురించి అడుగుతుంటే పిల్లలు ఏం చేయాలి. వైఎస్సార్ ..పేదరికానికి ఇంకో కారణం ఉంటుందని గుర్తించారు. నిరుపేదల కుటుంబీకుల వైద్యానికి లక్షల రూపాయిలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. పేదవాడి అప్పులకు ఇది మరో కారణం. అందుకే ప్రతీ పేదవానికి ఆరోగ్యం కల్పించేందుకు ఆరోగ్య శ్రీ కల్పించారు. అనారోగ్యం కానీ, ఆపద కానీ వాటిల్లితే ఒక్క ఫోన్ కాల్ తో ప్రతీ పేదవారి ఇంటికి 108 వాహనం వచ్చి వాలేది. పేదల్ని ఆస్పత్రికి తీసుకొనివెళ్లి మెరుగైన వైద్యం చేయించేవారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఆశ వర్కర్లు 70 రోజులకు పైగా సమ్మె చేస్తుంటే ఈ ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దీన్ని బట్టి ఈ ప్రభుత్వ పనితీరు అర్థంచేసుకోవచ్చు. ప్రభుత్వం కిందకు దిగి రావాలంటే ఓటు తోనే సాధ్యం. టీఆర్ ఎస్ ప్రభుత్వానికి పాలన చేతకావటం లేదు కాంగ్రెస్ కు ఓటు వేయవద్దు. ఎందుకంటే అంతకంటే దారుణమైన పార్టీ మరోటి ఉండదు. దివంగత నేత వైఎస్సార్ పట్ల ఏ రకంగా ప్రవర్తించిందో మీకు గుర్తుండే ఉంటుంది. ఆయన బతికి ఉన్నంత కాలం మంచోడే, జగన్ కాంగ్రెస్ లో ఉన్నంతకాలం కూడా మంచి వాడే. కానీ, ఎప్పుడైతే మాటకోసం జగన్ పార్టీ విడిచి బయటకు వెళ్లాడో..రాజశేఖర్ రెడ్డి, జగన్ మంచివాళ్లు కాదట. కుటుంబసభ్యుల్ని తప్పుడు కేసుల్లో ఇరికించి జైలుకి పంపించటానికి కూడా వెనుకాడలేదు. కాంగ్రెస్ కు విలువలు లేవు, విశ్వసనీయత లేదు. నచ్చితే నాయకులకు పూలదండ అయినా వేస్తారు, లేదంటే బండలు అయినా వేస్తారు. అదీ కాంగ్రెస్ పరిస్థితి. ఇక తెలుగుదేశం పార్టీ..ఆయన ఓటు అడిగితే ఒకటే చెప్పాలి. 18 నెలల పరిపాలన చూస్తూ ఉన్నాం. పూర్తిగా అబద్దాలు,మోసం, వెన్నుపోటు మూడింటి మీదే చేస్తు ఉన్నారు. కేసీయార్ గారే కాస్తో కూస్తో నయం అని పిస్తోంది అని స్పష్టంగా చెప్పాలి. అటు, బీజేపీ పార్టీ. కేంద్రంలో 18 నెలల నుంచి అధికారంలో ఉన్నా రాష్ట్ర ఏర్పాటు సమయంలో ఇచ్చిన హామీలను ఏమాత్రం నెరవేర్చలేదు. అందుకే ఈ రాజకీయ పార్టీలకు విలువలు, విశ్వసనీయత లేదు. చెడిపోయిన వ్యవస్థ మారాలంటే విలువలు, విశ్వసనీయత రావాలి. ఈ రెండు తెచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది వైఎస్సార్సీపీ అని చెప్పగలుగుతాను. వైఎస్సార్సీపీ కి మాత్రమే ఓటు అడిగే హక్కు ఉంది ప్రతీ ఇంటికి, ప్రతీ గ్రామానికి మేలు చేసిన నాయకుడు వైఎస్సార్ మాత్రమే. దివంగత నేత చనిపోలేదు. ఆయన ఎప్పటికీ బతికేఉంటారు అని చెప్పుకొనేందుకు వైఎస్సార్సీపీ ని నిలబెట్టుకొందాం.