విజయనగరం :
జనహృదయ నేత రాజన్న తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగనన్న సోదరి శ్రీమతి షర్మిలను సమీపం నుంచి చూసేందుకు గ్రామాల ప్రజలు బారులు తీరుతున్నారు. ఏ గ్రామంలో చూసినా జనసంద్రమే కనిపిస్తోంది. ప్రజలు అడుగడుగునా శ్రీమతి షర్మిలకు నీరాజనాలు పలుకుతున్నారు. జేజేలు చెబుతున్నారు. వృద్ధులు, మహిళలు అప్యాయంగా పలకరిస్తున్నారు. తండ్రిలోని పట్టుదల.. అన్నలోని ఓర్పును శ్రీమతి షర్మిలలోనూ చూస్తున్నామని ప్రతిఒక్కరూ చెబుతున్నారు.
విజయనగరం జిల్లాలో ఈ నెల 8వ తేదీ నుంచి ప్రారంభమైన మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర సోమవారానికి ఐదు నియోజకవర్గాల్లో పూర్తయింది. శ్రీమతి షర్మిలను చూసేందుకు ఊళ్లకు ఊళ్ళు కదలివస్తున్నాయి. కొత్తవలస, కొటారుబిల్లి, విజయనగరం, నెల్లిమర్ల, చీపురుపల్లిల్లో జరిగిన బహిరంగ సభలకు స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. దీనితో సహజంగానే టిడిపి, కాంగ్రెస్ నేతల గుండెలో రైళ్లు పరిగెత్తుతున్నాయి. శ్రీమతి షర్మిల సభలకు హాజరవుతున్న జనాన్ని చూస్తున్న ఆ పార్టీల నాయకుల కళ్లు బైర్లు కమ్ముతున్నాయి.
ముఖ్యంగా బొత్స ఇలాకా.. చీపురుపల్లి నియోజకవర్గంలో జరిగిన మరో ప్రజాప్రస్థానం పాదయాత్రకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఇది అధికార పార్టీ నాయకులకు మింగుడు పడడం లేదు. 2003లో మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రజా ప్రస్థానం పాదయాత్ర చేయగా సరిగ్గా పదేళ్ల తరువాత ఆయన తనయ... జగనన్న చెల్లెలు శ్రీమతి షర్మిల మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర మొదలుపెట్టారు. 2012 అక్టోబర్ 18న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర మరికొద్ది రోజుల్లో శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో ముగియనున్నది.
విజయనగరం జిల్లాలో పాదయాత్ర జరుగుతున్న ప్రతిచోటా శ్రీమతి షర్మిల ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. ముందుకు సాగుతున్నారు. గ్రామాల్లో తనను చూసేందుకు బారులు తీరుతున్న ప్రజలకు శ్రీమతి షర్మిల టిడిపి కుమ్మక్కు రాజకీయాలను వారి కళ్ళకు కట్టినట్లు వర్ణించి చెబుతున్నారు. సభల్లో ఆమె మాట్లాడినప్పుడు పరిణితి చెందిన రాజకీయవేత్తలా గణాంకాలతో సహా రాష్ట్ర పరిస్థితిని చెబుతున్నప్పుడు అంతా ఔరా! అని ఆశ్చర్యపోతున్నారు.
మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలను ఒక్కొక్కటిగా నిర్వీర్యం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరిని శ్రీమతి ప్రతిచోటా ఎండగడుతున్నారు. రాజన్న హయూంలో పథకాల అమలు తీరు, ప్రస్తుత కాంగ్రెస్ పాలనలో వాటి తీరును ప్రజలకు వివరిస్తున్నారు. తమ సమస్యలను నేరుగా వినేందుకు ఓ ఆశాకిరణం తమ గ్రామాలకు వస్తున్నదని శ్రీమతి షర్మిల రాక కోసం ఎదురుచూస్తున్నారు. మహిళలు రోడ్డుకు ఇరు వైపులా హారతులతో స్వాగతం పలుకుతున్నారు. వృద్ధులు దీవిస్తున్నారు. ‘మంచి రోజులొస్తాయి. మన ప్రభుత్వం వస్తుంది.. రాజన్న రాజ్యం వస్తుంది.. జగనన్న మళ్లీ స్వర్ణయుగం తెస్తారని శ్రీమతి షర్మిల చెబుతున్నప్పుడు గ్రామీణుల్లో ఓ వైపు కన్నీళ్లు.. మరోవైపు రాజన్న కుటుంబం తమకు ఎంతో అండగా ఉంటుందన్న భరోసా కూడా కనిపిస్తోంది.