ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్


ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ .... ఇలాగే ఉంటుంది చంద్రబాబు చెప్పేది. రాష్ట్రం రెండంకెల అభివృద్ధి చెందింది అంటాడు. అంతలోనే లోటు బడ్జెట్ తో రాష్ట్రం కష్టాలు పడుతోందని చెబుతాడు. కేంద్రం నిధులు ఇవ్వకుండా మోసం చేసింది అని అంటాడు. నిధులు లేకున్నా రాష్ట్రాన్ని నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టానని చెప్పుకుంటాడు. పరస్సర విరుద్ధమైన స్టేట్ మెంట్లు ఒకే సారి, ఒకే మైకు ముందు చెప్పగల మనిషి చంద్రబాబు. తిరుపతిలో ఓ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి ఆ సందర్భంలోనూ ఇలాంటి సంబంధం లేని స్టేట్ మెంట్లే ఇచ్చారు. తిరుపతి విమానాశ్రయాన్ని చంద్రబాబు గారు ఎంతో అభివృద్ధి చేసార్ట. అయితే విమానయాన మంత్రిత్వశాఖ ఎపికి దక్కినా కేంద్రం ఏ సహకారం అందించలేదట. అంటే కేంద్రం ఎపిలో విమానాశ్రయాల అభివృద్ధికి సహాకారం అందించలేదు. చంద్రబాబు గారు తన స్వంత ఖర్చుతో రేణిగుంట విమానాశ్రయాన్ని వృద్ధి చేసారన్నమాట...
గన్నవరం గతీ అంతే...
రేణిగుంట విమానాశ్రాయాన్ని చంద్రబాబు ఏమాత్రం అభివృద్ధి చేసారో, ఎలా చేసారో అన్న విషయాన్ని కాస్త పక్కన పెడితే, అసలు రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత, గన్నవరం ఎయిర్పోర్టుకు అంతర్జాతీయ హోదా తెస్తామని చెప్పి ఆ విషయంలోనూ చేతులెత్తేసారు ముఖ్యమంత్రి గారు. విమానయాన శాఖా మంత్రి అశోక్ గజపతిరాజు ఎపిలోని విమానాశ్రయాలకు పైసా ఉపయోగం కలిగించలేక పోయారు. కేంద్రం సహకరించలేదంటూ చెప్పే ముఖ్యమంత్రి కేంద్రంలో అధికారం పంచుకుని, విమానయాన శాఖను చేతిలో ఉంచుకుని కూడా సహకారం ఎందుకు సాధించలేక పోయారో మాత్రం చెప్పడం లేదు. నాలుగేళ్లుగా కేంద్రం సహాయం అందించడం లేదని ఒక్కనాడూ ఎందుకు బైటపెట్టలేదో చెప్పాలి. గన్నవరం నుంచి అంతర్జాతీయ విమానాలు తిరిగేయ బోతున్నాయంటూ హడావిడి చేసిన మూణ్ణాళ్లకే అశోక్ గజపతి రాజు రాజీనామా ఇచ్చి చతికిలబడ్డారు. 
రేణిగుంట దుస్థితి
తిరుపతి రేణిగుంట విమానాశ్రయానికి గన్నవరం విమానాశ్రయానికంటే ముందే అంతర్జాతీయ హోదా కల్పించారు. కానీ ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకున్నదాఖలాలు లేవు. రాయలసీమ నుంచి లక్షలాది మంది గల్ఫ్ దేశాలకు వెళ్తుంటారు. పైగా తిరుపతి ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతి గాంచిన ఆధ్యాత్మిక నగరం కూడా. దేశం నలుమూలల నుంచే కాక, విదేశీయులూ తిరుపతికి పెద్ద ఎత్తున వస్తుంటారు. అలాంటి చోట కూడా విమానాశ్రయం అభివృద్ధికి నోచుకోకపోవడం దురదృష్టకరం. 
ఇదేనా విమానాశ్రయాల అభివృద్ధి 
జిల్లాకో విమానాశ్రయాన్ని ప్రకటించారు చంద్రబాబు. అధికారంలోకి రాగానే ఆ హామీలన్నీ విమానం గాల్లోకి లేచినట్లే ఆకాశంలోకి ఎగిరిపోయాయి. గన్నవరం, విశాఖ పట్నం, రేణిగుంట, రాజమండ్రి ప్రాంతాల్లోని ప్రధాన విమానాశ్రయాలనైనా పూర్తిస్తాయిలో అభివృద్ధి పరిచారా అంటే అదీ లేదు. సర్వీసులు, సేవలు, అంతర్జాతీయ హోదా, కొత్త సంస్థలు...ఇలా ఏది చూసినా గాలివాటమే తప్ప విమానాయశ్రాయాల అభివృద్ధి జరిగింది శూన్యం. ప్రైవేటు విమానయాన సంస్థలతో, సిబ్బందితో గొడవపడి, దాడులు చేసి జెసి లాంటి దురుసు నాయకులు దేశవ్యాప్తంగా చేస్తున్న ప్రచారాలు తప్ప రాష్ట్రంలో విమానయాన రంగం వీసమెత్తు ఉపకారానికి నోచుకోలేకపోయింది. అభివృద్ధి, అందని సాయం అంటూ బాబగారి విరుద్ధ వాఖ్యలు వినడం తప్ప మరికొన్నాళ్లదాకా తెలుగు ప్రజలకు వేరే అవకాశం మాత్రం ఏముంది???



 
Back to Top