సమైక్యానికి సానుకూలం స్పందన

హైదరాబాద్, 26 నవంబర్ 2013:

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం సమైక్యంగా ఉంటేనే మూడు ప్రాంతాలకూ న్యాయం, మేలు, అభివృద్ధి జరుగుతుందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ అధ్యక్షుడు‌ శ్రీ వైయస్ జగన్మోహ‌న్‌రెడ్డి ఆకాంక్ష అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు డాక్టర్‌ ఎంవీ మైసూరారెడ్డి తెలిపారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచేందుకు జాతీయ స్థాయిలో వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ చేస్తున్న కృషికి‌ జాతీయ, ప్రాంతీయ పార్టీల నుంచి సానుకూల స్పందన వచ్చిందని ఆయన అన్నారు. తమ పార్టీ వాదనతో అన్ని పక్షాలూ ఏకీభవించాయని, తప్పకుండా పార్లమెంటులో ఈ విషయం చెబుతామని వారు హామీ ఇచ్చారని అన్నారు. పార్టీ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయ లబ్ధి కోసం అసెంబ్లీ తీర్మానం లేకుండానే ఆర్టికల్ 3 ని దుర్వినియోగం చేసి రాష్ట్రాన్ని విభజించడం సమంజసం కాదన్నారు. సమైక్యాంధ్ర కోసం వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ చేసిన ప్రయత్నాల వల్ల కొంత సానుకూల వాతావరణం ఏర్పడవచ్చని ఆయన అన్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన బిల్లు పార్లమెంట్ ముందు‌కు వస్తే ఆయా రాజకీయ పార్టీలు దాన్ని వ్యతిరేకిస్తాయనే విశ్వాసం తమకు ఉందని వైయస్ఆర్ కాంగ్రె‌స్ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యుడు ఎంవీ మైసూరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనపై కాంగ్రె‌స్ పార్టీ, కేంద్ర ప్రభుత్వ క్షుద్ర రాజకీయాలను జాతీయ‌ స్థాయిలో ఆయా రాజకీయ పార్టీల దృష్టికి తెచ్చి వారి మద్దతు కూడగట్టడంలో వైయస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్‌రెడ్డి కృతకృత్యులయ్యారని చెప్పారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెస్, కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని వ్యతిరేకిస్తూ శ్రీ జగన్మోహన్‌రెడ్డి దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ.. పలు జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్ర నేతలను కలిసి వివరిస్తున్నారని మైసూరారెడ్డి చెప్పారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయంలో కాంగ్రెస్‌ పార్టీ దుష్ట రాజకీయం చేస్తున్నదని చెప్పినట్లు తెలిపారు.

కేవలం ఓట్లు, సీట్ల కోసమే కాంగ్రెస్‌ నాయకులు రాష్ట్ర సమైక్యతకు భంగం కలిగిస్తున్నారని చెప్పామన్నారు. ఆర్టికల్ 3ను దుర్వినియోగం చేయడం, తీర్మానం లేకుండా ఆంధ్రప్రదేశ్‌ను విభజించడం దుర్మార్గమైన చర్య అని రాష్ట్రపతిని కలిసినప్పుడు చెప్పామన్నారు. గడిచిన కొద్దిరోజులుగా శ్రీ జగన్ నేతృత్వంలోని తమ పార్టీ ప్రతినిధి బృందం రాష్ట్రపతి ప్రణ‌బ్ ముఖర్జీని, వామపక్షాలను, బీజేపీ, తృణమూ‌ల్ కాంగ్రెస్, జేడీ(యూ), బీజేడీ, ఎన్సీపీ, శివసేన పార్టీల ‌అగ్ర నాయకులను కలుసుకున్నదని చెప్పారు.


భాషా ప్రయుక్త రాష్ట్రాలను ఏర్పాటు చేయడానికి ముందు ఎస్సార్సీని వేసి, దాని సిఫార్సుల మేరకు వ్యవహరించిన కేంద్ర విభజన విషయంలో అలాంటి సంప్రదాయాన్ని తుంగలో తొక్కి  అప్రజాస్వామికంగా, ఏకపక్షంగా, నిరంకుశంగా వ్యవహరిస్తోందని తెలిపామన్నారు. ఫజుల్ అలీ కమిషన్‌ను వేసినా రెండు రాష్ట్రాల అసెంబ్లీలూ 2/3వ వంతు మెజారిటీతో తీర్మానం ఆమోదిస్తేనే కలపాలని సిఫార్సు చేసిన వైనాన్ని ఆయన గుర్తుచేశారు. భాషాప్రయుక్తాన్ని ప్రాతిపదికగా తీసుకున్నప్పటికీ రెండు రాష్ట్రాలను కలపడానికి అనుసరించిన సంప్రదాయాలను విభజించేటప్పుడు అనుసరించవద్దా అని మైసూరారెడ్డి నిలదీశారు. రాష్ట్రాన్ని విభజించాలనుకున్నప్పుడు ముందుగా అసెంబ్లీ తీర్మానాన్ని తీసుకుని ఉండాల్సిందన్నారు.

ఇంతకు ముందు కొన్ని రాష్ట్రాలను విభజించినప్పుడు ఎస్సార్సీ వేశారని, అసెంబ్లీల ఆమోదాన్ని కూడా కేంద్రం తీసుకున్నదని జాతీయ, ప్రాంతీయ పార్టీల అగ్ర నేతలకు వివరించి చెప్పామన్నారు. కాని ఆంధ్రప్రదేశ్‌ విభజన విషయానికి వచ్చినప్పుడు మాత్రం ఎలాంటి కమిటీ సిఫార్సులూ తీసుకోలేదని, అసెంబ్లీ తీర్మానాన్ని విశ్వాసంలోకి తీసుకోలేదన్న విషయాన్ని తెలిపామన్నారు. ఆరు నెలల్లో అధికారం నుంచి దిగిపోతున్న ప్రభుత్వం, మళ్ళీ అధికారంలోకి వస్తుందా అంటే అది కూడా కనుచూపు మేరలో లేని కాంగ్రెస్‌ ఇలాంటి అడ్డగోలు దుర్మార్గానికి పాల్పడుతున్న వైనాన్ని చెప్పామన్నారు. సాధారణ మెజారిటీకీ 40 సీట్లు తక్కువ ఉన్న కాంగ్రెస్‌ పార్టీ తన సొంత ఇంటి వ్యవహారంగా నినంకుశంగా విభజన చేయడం అప్పజాస్వామికం, రాజ్యాంగాన్ని దుర్వినియోగం చేయడమే అవుతుందని వివరించామన్నారు.

దేశాన్ని సమైక్యంగా ఉంచాలనే అభిప్రాయంతోనే ఆనాడు రాజ్యాంగ నిర్మాతలు ఆర్టికల్ 3ని అత్యంత పటిష్టంగా ఏర్పాటు చేశారని మైసూరారెడ్డి తెలిపారు.‌ అరకొర మెజారిటీ ఉన్న పార్టీ అలాంటి ఆర్టికల్‌ను చేతిలో పెట్టుకుని విభజించడం ప్రారంభిస్తే.. భవిష్యత్తులో ఎవరు అధికారంలోకి వచ్చినా తమకు అధికారం కోసం దానిని దుర్వినియోగం చేసే ప్రమాదం ఉందని చెప్పినప్పుడు అన్ని పార్టీల నాయకులు ఏకీభవించారని మైసూరారెడ్డి తెలిపారు. కొన్ని పార్టీల నేతలు తమ తమ పార్టీల్లో అంతర్గతంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారన్నారు. తమ వాదన విని కొంతమంది నేతలు విస్మయం చెందారని మైసూరారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పార్టీ ఇంత‌లా దిగజారిపోయి వ్యవహరిస్తుందని అనుకోలేదని కొందరు నేతలు తమతో చెప్పారని ఆయన తెలిపారు. మిగిలిన రాజకీయ పార్టీలను కూడా త్వరలోనే కలుస్తామని మైసూరారెడ్డి తెలిపారు.

Back to Top