<strong>విజయనగరం:</strong> వేగావతి నదిపై బ్రిడ్జి నిర్మిస్తామని చంద్రబాబు, ఆయన కోటరీ ఇచ్చిన హామీ నేటికీ అమలుకు నోచుకోలేదని బొబ్బిలి నియోజకవర్గం బాడంగి మండలం గొల్లాది గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నదిపై బ్రిడ్జి లేక ఎన్నో ఇబ్బందులు పడుతున్నామని గొల్లాది గ్రామస్తులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ను కలిసి మొరపెట్టుకున్నారు. బొబ్బిలి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్ జగన్మోహన్రెడ్డిని వారు కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. బ్రిడ్జి లేక అష్టకష్టాలు పడాల్సి వస్తుందన్నారు. గొల్లాది– కొత్తపెంట గ్రామాల మధ్య ఉన్న వేగావతి నదిపై బ్రిడ్జి లేకపోవడంతో అవస్థలు పడుతున్నామన్నారు. స్కూలు పిల్లలు, ఉపాధి కూలీలు నది దాటేందుకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఏడు నెలల క్రితం గొల్లాది గ్రామానికి వచ్చిన చంద్రబాబు, మంత్రి సుజయ్ సోదరుడు బేబినాని బ్రిడ్జి నిర్మించాకే ఓట్లు అడుగుతామని చెప్పారని, అది ఇప్పటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రతి ఎన్నికల సమయాల్లో ఇలాగే చెబుతున్నారని, ఇకపై చంద్రబాబును నమ్మే పరిస్థితి లేదన్నారు