చంద్రబాబు నాయుడు పరిపాలనలో సామాన్యుడి బతుకు భారం గా మారిపోయింది. నిత్యావసర వస్తువుల ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. పప్పులు, ఉప్పులు కొనాలంటే కష్టంగా తయారైంది. ఇంత జరగుతున్నా చంద్రబాబు మాత్రం అమరావతి జపం చేస్తూ సింగపూర్ కంపెనీల బాగోగుల కోసం తాపత్రయ పడుతున్నారు.ధరల పెరుగుదలను అదుపు చేయలేక పోవటం విషయంలో తప్పంతా చంద్రబాబుదే. ఉత్పత్తి క్షీణత 10శాతం లోపే ఉన్నప్పటికీ మార్కెట్ లో పప్పులు నిల్వలు అడుగంటుతున్నాయి. దీంతో ధరలు భగ్గుమంటున్నాయన్నది పచ్చి నిజం. అటువంటప్పుడు రెవిన్యూ యంత్రాంగాన్ని, పౌర సరఫరాల శాఖ ను సమన్వయ పరచాలి. ప్రజలకు అను నిత్యం అవసరం అయ్యే సేవల విషయంలో అప్రమత్తం చేయాలి. జిల్లాల్లో జాయింట్ కలెక్టర్ నేత్రత్వంలో టాస్క్ ఫోర్స్ లను ఏర్పాటు చేయాలి. నల్ల బజారుకి తరలిస్తున్న పందికొక్కులపై కొరడా ఝుళిపించాలి. ఇటు, పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో అందరికీ అందుబాటులో ఉండేట్లుగా నిత్యావసర వస్తువుల్ని తీసుకొచ్చే ప్రయత్నాలు చేయాలి.ఇవేమీ చేయకుండా ప్రజల సమస్యల మీద నిర్లక్ష్యం వహిస్తున్న చంద్రబాబు ప్రభుత్వ వైఖరికి నిరసనగా ప్రతిపక్ష వైఎస్సాసీపీ ఆందోళన పథాన్ని పట్టింది. ఎక్కడికక్కడ ఆందోళనలు చేపడుతోంది. అన్ని మండల తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ప్రదర్శనలు నిర్వహిస్తోంది.