అమరావతి: కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం(సీపీఎస్) రద్దు చేసి.. పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరుతూ ప్రభుత్వ ఉద్యోగులు చేపట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమం ఉద్రిక్తతలకు దారితీసిన విషయం తెలిసిందే. వివిధ జిల్లాల నుంచి అసెంబ్లీ ముట్టడికి తరలివచ్చిన ఉద్యోగులపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. పలుచోట్ల ఉద్యోగులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపట్ల అమానుషంగా ప్రవర్తించారు. ఉద్యోగులను బలవంతంగా అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. న్యాయమైన తమ డిమాండ్ల కోసం ఆందోళన చేపట్టిన ఉద్యోగుల పట్ల ప్రభుత్వ వ్యవహరించిన తీరును ఏపీ ప్రతిపక్షనేత, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్ రెడ్డి ఖండించారు. ఈ మేరకు ఆయన ‘సీపీఎస్ కోసం అమరావతిలో నిరసన వ్యక్తం చేసిన టీచర్లను అరెస్ట్ చేయడాన్ని ఖండిస్తున్నాను’ అని ట్వీట్ చేశారు.