బాబు అసలు కథ తేలుస్తా

-బాబు నుంచి నాకు ప్రాణహాని ఉంది
- చంద్రబాబు నన్ను అవసరానికి వాడుకున్నారు.
- త్వరలో అన్ని రహస్యాలను బయటపెడతా
-ఓటుకు కోట్లు’ నిందితుడు మత్తయ్య ఆరోపణ
 
న్యూఢిల్లీ : ఓటుకు కోట్లు కేసులో ప్రధాన ముద్దాయి అయిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని కేసులో నిందితుడిగా ఉన్న జెరూసలెం మత్తయ్య అన్నారు. ‘‘నా ప్రాణానికి ఎలాంటి హాని జరిగినా అందుకు చంద్రబాబునాయుడే’’ బాధ్యుడని పేర్కొన్నారు. తనకు, తన కుటుంబ సభ్యులకు చంద్రబాబు నుంచి ప్రాణహాని ఉందని న్యూఢిల్లీలో విడుదల చేసిన ఓ ప్రకటనలో వెల్లడించారు. అదేవిధంగా తనకు ఏం జరిగినా తెలంగాణ ముఖ్యమంత్రి  కూడా బాధ్యత వహించాలని ఆ లేఖలో పేర్కొన్నారు. ఇద్దరు ముఖ్యమంత్రులనుంచి తనకు రక్షణ కల్పించాల్సిందిగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించినట్టు తెలిపారు.

ఓటుకు కోట్లు కేసులో తన ప్రమేయం లేకున్నా ఏ4గా చిత్రీకరించారని ఆరోపించారు. ‘‘చంద్రబాబు అసలు కథేంటో ఈ కేసులో తేలిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. బాబు తనను అవసరానికి వాడుకొని వదిలేశారని మండిపడ్డారు. అప్పట్లో నీకేం కాదు, నేనున్నానంటూ జోల పాడి... ఇప్పుడు అస్సలు పట్టించుకోవడం లేదన్నారు. ఏపీ పోలీసులు గానీ, లాయర్లు గానీ, టీడీపీ నేతలు గానీ నన్ను పట్టించుకోవడం లేదు. నన్ను దోషిగా చిత్రీకరించడానికి టీడీపీ, టీఆర్‌ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయి. చంద్రబాబు, కేసీఆర్ ఆడుతున్న రాజకీయ చదరంగంలో నన్ను బలిపశువును చేయాలని చూస్తున్నారు. నాకు, నా కుటుంబానికి ఏం జరిగినా ఇద్దరు ముఖ్యమంత్రులదే ఆ బాధ్యత.

దళిత క్రైస్తవుడినైన తనను అక్రమంగా ఈ రాజకీయ ఉచ్చులో ఇరికించి బలిపశువును చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ కేసులో ఎవరెవరి పాత్ర ఎంత ఉందో త్వరలోనే అన్ని రహస్యాలను న్యాయస్థానం ముందు బయటపెడతానని మత్తయ్య సంచలన వ్యాఖ్యలు చేశారు. 
 
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినీతి సొమ్ముతో ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తూ ఆడియో, వీడియో టేపులతో చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు.  పట్టపగలే ముఖ్యమంత్రి స్థానంలో ఉండి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిన చంద్రబాబు అవినీతి బాగోతం దేశవ్యాప్తంగా బట్టబయలైంది. దీంతో, ఎక్కడ జైలుపాలు కావాల్సివస్తుందోనని భయపడిపోయిన చంద్రబాబు...కేసీఆర్ తో రహస్య ఒప్పందం చేసుకొని  హైదరాబాద్ లో పదేళ్లు ఉండే అవకాశమున్నా ఉన్నపలంగా విజయవాడకు మకాం మార్చారు.  ఛార్జ్ షీట్ లో బాబు పేరు 24 సార్లు నమోదైనా ఇంతవరకు ఆయనపై ఎలాంటి చర్యలు లేవు. టీఆర్ఎస్, టీడీపీల లోపాయికారి ఒప్పందంతో కేసును నీరుగార్చే కుట్రలు జరుగుతున్నాయి. 

 

తాజా వీడియోలు

Back to Top