మడకశిర: ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ప్రజలు చిత్తుగా ఓడించారని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు పదవిలో కొనసాగే నైతికహక్కు ఏమాత్రం లేదని వైయస్ఆర్ సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. వెంటనే ముఖ్యమంత్రి తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడప, కర్నూలు, నెల్లూరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బులను వెదజల్లి టీడీపీ అక్రమంగా గెలిచిందని తెలిపారు. అయితే లక్షలాది మంది పట్టభద్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు చిత్తుగా ఓడిపోయారని విమర్శించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజల్లో విశ్వాసాన్ని పూర్తిగా కోల్పోయారని తెలిపారు. రోజురోజుకూ టీడీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతోందని తెలిపారు. ఉపాధ్యాయులు, ఉద్యోగులు, యువకులు, పట్టభద్రులు ముఖ్యమంత్రిపై ఆగ్రహంగా ఉన్నారనడానికి ఈ ఫలితాలే నిదర్శనమన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిన ఘనత చంద్రబాబుదేనని తెలిపారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్లు కూడా దక్కవన్నారు. గోపాల్రెడ్డి విజయానికి కృషి చేసిన పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.<br/>