షర్మిలకు సంఘీభావంగా కువైట్‌లో పాదయాత్ర


హైదరాబాద్, 21 అక్టోబర్ 2012: షర్మిల 'మరో ప్రజాప్రస్థానం' పాదయాత్రకు సంఘీభావంగా వైయస్ఆర్ సీపీ సభ్యులు కువైట్‌లో  పాదయాత్ర జరిపారు. ఖేతాన్ ప్రాంతం నుంచి తెలుగువారు ఎక్కువగా నివసించే మాలియా వరకూ 14 కిలోమీటర్ల దాకా ఈ యాత్ర సాగిందని పార్టీ ఎన్నారై విభాగం కన్వీనర్ మేడపాటి వెంకట్ ఒక ప్రకటనలో తెలిపారు. కె.వాసుదేవరెడ్డి, జి.సిద్ధయ్య, పి.విశ్వనాథ్‌రెడ్డి, సి.పెంచల్‌రెడ్డి, ఎం.సుధాకర్‌రెడ్డి, కె.సహదేవరాజు, షేక్ మహబూబ్‌బాషా, సుబ్రమణ్యం రాజుతో సహా పెద్ద సంఖ్యలో వైయస్‌ అభిమానులు ఈ యాత్రలో పాల్గొన్నారని ఆయన వివరించారు.
ఒక మహిళ ఇలా 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టడం ప్రపంచ చరిత్రలోనే రికార్డు అంటూ ఎన్‌ఆర్‌ఐలు శ్లాఘించారనీ ఆయన తెలిపారు. షర్మిల పర్యటనకు జనం తప్పక నీరాజనం పడతారనీ, ఆమెకు మద్దతుగా లక్షలాది మంది మరో ప్రజాప్రస్థానంలో పాల్గొంటారని వారు విశ్వాసం వ్యక్తం చేశారని మేడపాటి పేర్కొన్నారు. ఇలాంటి సాహసోపేతమైన కార్యాలు చేయడం ఒక్క వైఎస్సార్ కుటుంబానికే సాధ్యమని వక్తలు అన్నారు. వైయస్ఆర్ కుటుంబానికి తామంతా అండగా నిలబడతామని వారంతా ప్రతిజ్ఞ చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా వైయస్ కుటుంబంపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని, లేనిపోతే కాంగ్రెస్‌ను జనమే భూస్థాపితం చేస్తారని వారు హెచ్చరించారు.

Back to Top