మహిళా దినోత్సవం రోజు అవమానం

  • ఆక్వాఫుడ్ పార్కుకు వ్యతిరేకంగా తుందుర్రులో ఆందోళన
  • మహిళలపై లాఠీలు ఝుళిపించిన పోలీసులు
  • వైయస్సార్సీపీ నేతల హౌస్ అరెస్ట్
  • పార్కును దూరంగా తరలించాలని ప్రతిపక్ష నేత హెచ్చరిక
  • ప్రభుత్వం మొండివైఖరి..మండిపడుతున్న ప.గో. జిల్లా ప్రజలు
పశ్చిమగోదావరిః ఏపీలో మహిళలకు రక్షణ కరువైంది. మహిళా దినోత్సవం రోజు ప్రభుత్వం మహిళల పట్ల అవమానకరంగా ప్రవర్తించింది. ఆక్వా ఫుడ్‌పార్కు పెడితే దాన్నుంచి వెల్లువెత్తే కాలుష్యం కారణంగా తమ జీవనం మొత్తం అస్తవ్యస్తం అవుతుందని గగ్గోలు పెడుతున్న తుందుర్రు పరిసర గ్రామాల వాసులను పోలీసులు ఈడ్చిపారేశారు. ఫుడ్‌పార్కుకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న మహిళలను మహిళా దినోత్సవం అని కూడా చూసుకోకుండా లాఠీలతో కుమ్మేశారు. గర్భిణులను కూడా ఎత్తుకెళ్లి జీపుల్లో వేసి స్టేషన్లకు తీసుకెళ్లారు. ఆక్వాఫుడ్ బాధిత గ్రామాల ఆందోళనకు మద్దతుగా నిలిచిన వైయస్సార్సీపీ నాయకులను కూడా ఎక్కడికక్కడ అరెస్టులు, హౌస్ అరెస్టులు చేశారు. 

ఆక్వాఫుడ్‌ పార్క్ బాధిత మహిళలు బుధవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు అడుగడునా అడ్డంకులు సృష్టించడంతో తుందుర్రు ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆక్వాఫుడ్‌ పార్క్ బాధిత గ్రామాల్లో సుమారు 1100 మంది పోలీసులను మోహరించారు. ఆక్వాపార్క్‌ వ్యతిరేక పోరాట కమిటీ సభ్యులను పోలీసులు ముందస్తు అరెస్ట్‌ చేశారు. పోలీసుల అత్యుత్సాహంతో నరసాపురం, భీమవరం, మొగల్తురు మండలాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నరసాపురంలో వైయస్ఆర్‌సీపీ నేత ముదునూరి ప్రసాదరాజును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహిళా దినోత్సవం రోజు మహిళలపై ప్రభుత్వ అణచివేత ధోరణిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమౌతున్నాయి.

ప్రజల మనోభావాలను గుర్తించరా?
ప్రజల మనోభావాలను గుర్తించకుండా.. తీరప్రాంత ప్రజలను దారుణంగా నిర్బంధిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నాయకుడు ముదునూరి ప్రసాదరాజు మండిపడ్డారు. నిర్బంధాల ద్వారా ప్రజావ్యతిరేకతను ప్రభుత్వం ఆపలేదని ఆయన అన్నారు. ఈ ఫ్యాక్టరీ కడితే నీళ్లకు చాలా ఇబ్బంది అవుతుందని, మత్స్యకారుల జీవన విధానం దెబ్బతింటుందని చెప్పారు. వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ మోహన్ రెడ్డి కూడా వచ్చి తుందుర్రు పరిసర ప్రాంత వాసులకు అండగా నిలిచారని గుర్తుచేశారు. ఫ్యాక్టరీలకు తాము వ్యతిరేకం కాదని, ఇదే నియోజకవర్గంలో సముద్రతీరప్రాంతంలో కట్టాలని తామంతా కూడా కోరామని.. దాని నిర్మాణానికి సహకరిస్తామని చెప్పామని అన్నారు. కానీ ప్రభుత్వం మొండివైఖరితో ఆరు నెలల నుంచి ఈ గ్రామాల్లో పోలీసులను మోహరిస్తున్నారని, 144 సెక్షన్ పెట్టి ప్రజలను నిర్బంధిస్తున్నారని ఆగ్రహించారు. ఈ ఫ్యాక్టరీని ఇదే నియోజకవర్గంలో ఎవరికీ నష్టంలేని చోట తీరప్రాంతంలో కడితే, ఉపాధి అవకాశాలు కూడా ఇక్కడివారికే వస్తాయని తెలిపారు.

రౌడీ రాజ్యం
ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రమంతటినీ రౌడీ రాజ్యం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైయస్ఆర్‌సీపీ నాయకుడు గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. ఇక్కడ దాదాపు 2వేల మంది పోలీసులను పెట్టారని, తమ సొంత ఊళ్లలో తిరగాలన్నా కూడా ఆధార్ కార్డులు పట్టుకుని తిరగాల్సి వస్తోందని అన్నారు. అసలు తొలుత పబ్లిక్ హియరింగ్ జరిపించి, ప్రజల అనుమతితోనే ఫ్యాక్టరీ కడతామని అందరూ చెప్పారని, కానీ అసలు పబ్లిక్ హియరింగ్ అన్నదే చేయలేదని తెలిపారు. పోలీసులు మఫ్టీలో ఉండి ప్రజల్లో కలిసిపోయి దారుణాలు చేస్తున్నారని, మహిళలను కూడా అరెస్టు చేసి ఈడ్చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు నేతృత్వంలో ఇక్కడ రాక్షస పాలన కొనసాగుతోందని, ప్రభుత్వం ఫ్యాక్టరీ యాజమాన్యానికి వంతపాడుతోందని మండిపడ్డారు. పోలీసులను అడుగుదామని అనుకుంటే తమను పొద్దుట నుంచి ఒక్క అడుగు కూడా బయటకు వేయనీయకుండా హౌస్ అరెస్టు చేశారన్నారు. తమ పరిస్థితే ఇలా ఉంటే ఇక సామాన్యుల పరిస్థితి ఏం చెప్పాలని ఆయన అన్నారు.
Back to Top