సీఎం పర్యటనను అడ్డుకుంటాం

కల్లూరు:

కర్నూలు జిల్లాలో ఆదివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి పర్యటనను ప్రజలు, రైతులతో అడ్డుకుంటామని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కన్వీనర్ గౌరు వెంకటరెడ్డి తెలిపారు. జిల్లాలో ఆరు వేల హెక్టార్లకు సాగునీరందించిన తర్వాతనే అనంతపురం జిల్లాకు హంద్రీనీవా నీరు మళ్లించాలనే నిబంధన ఉందన్నారు. జిల్లాలో ఒక ఎకరాకు కూడా సాగునీరు అందించకుండానే ఎత్తిపోతల ద్వారా అనంతపురానికి నీరు మళ్లిస్తే ఇక్కడి రైతుల పరిస్థితి ఏమవుతుందని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో నీటిపారుదల శాఖ నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఈ ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన బాధితులకు నష్టపరిహారం అందించడంలోనూ అలసత్వం చేస్తోందని ఆరోపించారు. జిల్లాలో పంట కాలువలు నిర్మించకుండానే ప్రధాన కాలువ ద్వారా నీటిని అనంతపురానికి మళ్లిస్తే ఊరుకునేది లేదన్నారు. 18వ తేదీన నందికొట్కూరు మండలం మల్యాల వద్ద హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టుకు సంబంధించిన ఎత్తిపోతల పథకాన్ని సీఎం ప్రారంభించనున్నారనీ, ఈ కార్యక్రమాన్ని అడ్డుకుంటామనీ  హెచ్చరించారు. ప్రజలు, రైతులు పెద్దఎత్తున పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

తాజా వీడియోలు

Back to Top