- వైయస్ జగన్కు వినతుల వెల్లువ
- గోడు వెల్లబోసుకున్న మధ్యాహ్న భోజన కార్మికులు
- జీవో 279ను రద్దు చేయాలని పారిశుద్ధ్య కార్మికులువినతి
- వైయస్ జగన్ను కలిసిన పారిశుద్ధ్య కార్మికులు
విజయనగరం: కష్టాల సుడిగుండంలో చిక్కుకుని విలవిల్లాడుతున్న రాష్ట్ర ప్రజలకు నేనున్నాంటూ భరోసా ఇవ్వడానికి వైయస్ జగన్ ప్రారంభించిన ప్రజాసంకల్పయాత్ర ప్రభంజనం సృష్టిస్తోందన్నారు. గతేడాది నవంబర్ 6న ఇడుపులపాయలో ప్రారంభమైన పాదయాత్ర 3000 కిలోమీటర్ల మైలురాయిని దాటి దిగ్విజయంగా కొనసాగుతోంది. చంద్రబాబు అవినీతిని ఎలుగెత్తి చాటుతూ.. పేదల ఉసురు పోసుకుంటున్న విధానాలను తూర్పారాబడుతూ సాగిస్తున్న యాత్రకు 11 జిల్లాల ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ప్రస్తుతం విజయనగరం జిల్లాలో వైయస్ జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. మంగళవారం జననేతను మధ్యాహ్న భోజన కార్మికులు, పారిశుద్ధ్య కార్మికులు, జేఎన్టీయూ కాంట్రాక్టు అధ్యాపకులు, 104 ఉద్యోగులు కలిసి తమ బాధలు చెప్పుకున్నారు. అన్నా..మీరే దిక్కు అంటూ మొరపెట్టుకుంటున్నారు.
టీడీపీ ప్రభుత్వ హయాంలో తాము ఎదుర్కొంటున్న సమస్యలను మధ్యాహ్న భోజన కార్మికులు వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువచ్చారు. మంగళవారం ఉదయం జననేతను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ప్రభుత్వం తమకు ఆరు నెలల నుంచి బిల్లులు చెల్లించడంలేదని.. పిల్లలకు కుళ్లిన కోడిగుడ్లను సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సీఎం చంద్రబాబు తమను రోడ్డున పడేసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఇంటికి పంపించి బుద్ధి చెప్తామన్నారు.
రాబోయే ఎన్నికల్లో జననేతకు మద్దతు
జీవో నంబర్ 279ను రద్దు చేయాలని పారిశుద్ధ్య కార్మికులు వైయస్ జగన్ను కలిసి వినతి పత్రం అందజేశారు. సీఎం చంద్రబాబు పారిశుద్ధ్య నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై మండిపడ్డారు. మహిళా కార్మికులను జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సమస్యలను ఎంపీ అశోక్ గజపతిరాజు, ఎమ్మెల్యే గీత పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే రాబోయే ఎన్నికల్లో జననేతకు మద్దతు ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో పనిచేస్తున్న తామంతా జగన్కు మద్దతు ఇస్తామని తెలిపారు.
ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా చేశారు
చంద్రబాబు నాయుడు తమ ఉద్యోగాలు తీసేసి తమన రోడ్డున పడేలా చేశారని జేఎన్టీయూ కాంట్రాక్టు అధ్యాపకులు వైఎస్ జగన్ వద్ద తమ ఆవేదనను వ్యక్తం చేశారు. విజయనగరం జిల్లాలో పాదయాత్ర కొనసాగిసస్తున్న జననేతను కలిసిన అధ్యాపకులు.. వారి సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు తమను రెగ్యులరైజ్ చేస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పుడు తమ ఉద్యోగాలు తీసేసి రోడ్డున పడేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం జీతాలు పెంచలేదని, టైం స్కేల్ కూడా అమలు చేయడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వైయస్ జగన్ను కలిసిన 108 ఉద్యోగులు
విజయనగరం జిల్లాలో ప్రజాసంకల్పయాత్ర కొనసాగిస్తున్న వైఎస్ జగన్ను 108 ఉద్యోగులు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని జననేతను కోరారు. ప్రభుత్వ నిర్వహణ లోపంతో 108 వాహనాలు మూలన పడ్డాయని వైఎస్ జగన్కు తెలిపారు. అలాగే వారు ఎదుర్కొంటున్న సమస్యలపై జననేతకు వినతి పత్రం అందజేశారు.మరోవైపు ప్రజా సమస్యలు తెలుసుకుంటూ.. వారికి భరోసానిస్తూ వైయస్ జగన్ చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విజయనగరం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. వైఎస్ జగన్ పాదయాత్ర సాగుతున్న విజయనగరం నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది.