<strong>అనంతపురం:</strong> మానవ హక్కులను కాలరాయడమే లక్ష్యంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేస్తున్నాయని వైయస్ఆర్సిపికి చెందిన అనంతపురం ఎమ్మెల్యే గురునాథరెడ్డి ఆరోపించారు. అనంతపురంలోని 5వ డివిజన్లో కొత్తరెడ్డి గోవిందరెడ్డి ఆధ్వర్యంలో శనివారం జరిగిన 'జగన్ కోసం.. జనం సంతకం' కార్యక్రమంలో గురునాథరెడ్డి మాట్లాడారు. జననేత శ్రీ జగన్పై అక్రమంగా కేసు బనాయించి, ప్రజల నుంచి దూరం చేయాలని కాంగ్రెస్ నాయకులు చూస్తున్నారని గురునాథరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినప్పటికీ జనం గుండెల్లో ఉండేది దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుటుంబమేనని పేర్కాన్నారు. మహానేత వైయస్ఆర్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలతో జనం ఇబ్బందుల పాలవుతున్నారని ధ్వజమెత్తారు.<br/>ప్రజా సమస్యలపై శ్రీ జగన్ ఎక్కడ నిలదీస్తారోనన్న భయంతో జైలుకు పంపారన్నారు. ఎన్ని రోజులు నిర్బంధించినా శ్రీ జగన్మోహన్రెడ్డి నిర్దోషిగా బయటకు వస్తారన్నారు. 2014 ఎన్నికల్లో శ్రీ జగన్ నేతృత్వంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు.<br/>జిల్లా అడ్హాక్ కమిటీ కన్వీనర్ శంకరనారాయణ మాట్లాడుతూ, శ్రీ వైయస్ జగన్ కోసం చేపట్టిన్న కోటి సంతకాల కార్యక్రమానికి ప్రజలు స్వచ్ఛందంగా తరలి వచ్చి సంతకాలు చేస్తున్నారన్నారు. ప్రధానంగా యువత, వృద్ధులు జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారన్నారు. కార్యక్రమంలో వైయస్ఆర్సిపి జిల్లా నాయకుడు ఎర్రి స్వామిరెడ్డి, చవ్వా రాజశేఖర్రెడ్డి, మునిసిపల్ మాజీ చైర్మన్ అంబటి నారాయణరెడ్డి, ఆలమూరు శ్రీనివాస్రెడ్డి, ఎల్ఎం మోహన్రెడ్డి, ఎల్లుట్ల మారుతీనాయుడు, యూపీ నాగిరెడ్డి, వలిపిరెడ్డి శివారెడ్డి, వైటీ లింగారెడ్డి, అంకిరెడ్డి ప్రమీల పాల్గొన్నారు.