గుంటూరు: దేశ చరిత్రలో అబద్ధాలతో ముఖ్యమంత్రి అయిన ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడని, ఆయన చెప్పేవన్ని అబద్ధాలేనని వైయస్ఆర్ సీపీ ఎంపీ వరప్రసాదరావు విమర్శించారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి రైతుల నోట్లో మన్నుకొట్టారని మండిపడ్డారు. వ్యవసాయం శుద్ధ దండుగ అని చెప్పిన వ్యక్తి ముఖ్యమంత్రి స్థానానికి అనర్హుడని ధ్వజమెత్తారు. గుంటూరులో వైయస్ జగన్ రైతు దీక్ష వేదికపై ఎంపీ వరప్రసాద్ మాట్లాడారు. రైతులు ఓట్లు వేయకపోతే గెలవలేమని తెలిసి అబద్ధాల పుట్టను రైతులపై వెదజల్లి ఓట్లు వేయించుకొని చివరకు వారిని అష్టకష్టాలు పెడుతున్నారని బాబుపై మండిపడ్డారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఉచిత విద్యుత్ ఇస్తే అధికారంలోకి వచ్చిన వెంటనే దాన్ని తీసేసిన దరిద్ర ఘనత చంద్రబాబుదన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర దొరక్కుండా పోతుందన్నారు. పెట్టుబడులు కూడా దక్కక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు ఎన్నో హామీలనిచ్చి రైతులను, యువకులను, డ్వాక్రా మహిళలను అందరినీ మోసం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న పాలన మళ్లీ రావాలంటే తప్పనిసరిగా వైయస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలన్నారు. దమ్మున్న నాయకుడు వైయస్ జగన్ అని వ్యాఖ్యానించారు. ఏపీకి పట్టిన శనిపోవాలంటే చంద్రబాబు గద్దెదిగాలన్నారు. బీజేపీతో భాగస్వామి అయిన చంద్రబాబు ప్రత్యేక హోదాను సాధించడంలో కూడా విఫలమయ్యాడని, అసమర్థ ముఖ్యమంత్రి చంద్రబాబు అని విమర్శించారు.