పశ్చిమ గోదావరి: కొల్లేరు సమస్యను పరిష్కరిస్తామని వైయస్ జగన్ ఇచ్చిన హామీతో స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మూడున్నర లక్షల మంది కొల్లేరు ప్రజల సమస్య వైయస్ జగన్మోహన్రెడ్డి వల్లనే పరిష్కారమవుతుందని రాష్ట్ర మత్స్యకారుల సంఘం మహిళా అధ్యక్షురాలు ఘంటసాల వెంకటలక్ష్మి తెలిపారు. సంకల్పయాత్రలో భాగంగా ఉండిలో పర్యటించిన వైయస్ జగన్మోహన్రెడ్డిని సంఘ సభ్యులం కలుసుకుని కొల్లేరు ప్రజల సమస్యపై వినతిపత్రం అందజేసినట్టు ఆమె చెప్పారు. కొల్లేరును 5 నుంచి 3 కాంటూరు కుదింపునకు కృషి చేసి, లక్షలాది మంది కొల్లేరు ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతానని జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని వివరించారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టగానే కొల్లేరు గ్రామాల్లో భూమిలేని ప్రతి పేద కుటుంబానికి రెండెకరాల భూమి అందజేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఎన్నో ఏళ్లగా కొల్లేరును నమ్ముకుని జీవిస్తున్న ప్రజల హక్కులను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వైయస్జగన్ గుర్తు చేశారని తెలిపారు. మత్స్యకారులకు వలలు, రుణాలు అందించి అన్ని రకాలుగా ఆదుకుంటానని జగన్ ఇచ్చిన హామీతో ఆమె హర్షం వెలిబుచ్చారు. కాంటూరు కుదింపు చేపట్టే జగన్మోహన్రెడ్డికి కొల్లేరు ప్రజల మధ్దతు ఉంటుందని ఆమె వెల్లడించారు.