ప్రభుత్వం కనికరించడం లేదు

కృష్ణా జిల్లా: ‘అయ్యా.. మా అబ్బాయి తలసేమియా వ్యాధితో బాధపడుతున్నాడు. ఆపరేషన్‌కు రూ.25 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వం కనీసం కనికరించడం లేదు. సీఎం రిలీఫ్‌ ఫండ్‌ ఎల్‌వోసీ ఇస్తే ఆస్పత్రిలో పని చేయదంటున్నారు’ అని భూక్యా వెంకటేశ్వర నాయక్  రావిచర్ల క్రాస్‌ వద్ద జరిగిన ప్రజాసంకల్పయాత్రలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలను వివరించారు. తన కుమారుడు జ్యోతిశ్వర్‌కు పుట్టుకతోనే తలసేమియా వ్యాధి రావడంతో ఉన్నంతలో వైద్యం చేయించామని తెలిపారు.

తమిళనాడు రాష్ట్రంలోని రాయ వెల్లూరులో బాలుడికి ఆపరేషన్‌కు రూ. 25 లక్షలు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పినట్లు వెల్లడించారు. ప్రభుత్వం ఎల్‌వోసీ లేఖను ఇచ్చినా ఆస్పత్రి వర్గాలు దానిని అంగీకరించటం లేదన్నారు. ఆ మొత్తానికి ఆస్పత్రి పేరిట చెక్కు ఇప్పించాలని విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం స్పందించటం లేదని వెంకటేశ్వర నాయక్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి 15 రోజులకు రక్తం ఎక్కించేందుకు, మందులు కొనేందుకు రూ. 18 వేలకుపైగా ఖర్చు అవుతుందని, తన కుమారుడిని కాపాడాలని ఆయన కన్నీటి పర్యంతమయ్యారు.

Back to Top