ఆంధ్రరాష్ట్రంలో అన్ని సమస్యలకూ ఒకటే పరిష్కారమని తెలుగు పండితులు కనిపెట్టారు. పంచాంగంలో కూడా ఇదే ప్రకటించారు. నారాలోకేష్ని అర్జెంట్గా మంత్రిని చేస్తే పోలవరం పదిరోజుల్లో పూర్తికావచ్చు. వారం రోజుల్లో పట్టిసీమ కంప్లీటై సీమకి నీళ్ళు పారచ్చు. రైతులకు పంటలు కూడా పండొచ్చు. ఆయన్ని మంత్రిని చేయకపోతే వైజాగ్లో మళ్ళీ హుద్హుద్ రావచ్చు. అమరావతిని వరదలు ముంచెత్తచ్చు. సముద్రం లేకపోయినా రాయలసీమలో ఉప్పెన రావచ్చు. ఈ ఉత్పాతాలన్నీ తెలుగుతమ్ముళ్లు కనిపెట్టే... చంద్రబాబు నాయుడికి విన్నవించారు. కొంతమంది ఎమ్మెల్యేలు ధర్నాలు కూడా చేసారు. ఒక నాయకుడు నిరాహారదీక్షకు కూర్చుని రోజురోజుకీ వెయిట్ కూడా పెరిగాడు. కడుపుమండిన ఒక సామాన్యుడు మాత్రం ఈ రకంగా ఉత్తరం రాశాడు.`` అయ్యా బాబు గారూ, ఆంధ్రరాష్ట్రానికి గత 40 ఏళ్ళుగా మీరు చేసిన సేవలు అన్నీ ఇన్నీ కాదు దానికి ప్రతిఫలంగా రెండెకరాలనుంచి 2 లక్షల కోట్లుకి ఎదిగారు. అవినీతికి కొత్త భాష్యం చెప్పారు. ఆ రకంగా మీరు నీతినిజాయితీలతో ముందుకు పోతున్నారు. మీకు గుర్తుందో లేదో తెలుగుదేశం ప్రభుత్వంలో మీరు తొలుత కర్షక పరిషత్ ఛైర్మన్గా రంగప్రవేశం చేసారు. రైతుల పట్ల రవ్వంత సానుభూతి కూడా లేని తమరు కర్షక పరిషత్ నాయకుడు కావడమే ఒక వింతే. ఇజ్రాయిల్ సేద్యం పేరుతో కుప్పం రైతుల్ని దివాళా తీయించిన ఘనత కూడా మీదే. వ్యవసాయం దండగని చెబుతూ ప్రతిదానికి సింగపూర్తో పోల్చడం మీ స్పెషాలిటీ. సింగపూర్ లోని ప్రజలు అన్నం కాకుండా కంప్యూటర్లు భోంచేస్తారేమో మాకు తెలియదు. అమెరికా అధ్యక్షుడైనా రైతు పండించిందే తినాలి తప్ప ఇంకొకటి కాదు. మరి మీరు రైతులంటేనే మండిపడతారు. రైతుబిడ్డగా పుట్టిన మీ పరిపాలనే ఇంత ఘోరంగా వుంటే, ఇక మీ వారసుడిని మా మీదకి రుద్దుతున్నారు. శ్రీ నారాలోకేష్ గారు ఎప్పడైనా పల్లెటూళ్ళలో వున్నారా? ప్రజలు ఎలా వుంటారో ఆయనకి తెలుసా? ప్రజల మధ్యన వున్నారా? ప్రజలతో ఓట్లు వేయించుకొని గెలిచారా? మరి ఆయన్ని మంత్రి చేస్తే ఇంకో తెల్ల ఏనుగుని మోయడం తప్ప వేరే ఏమైనా వుందా? మీ తండ్రి కొడుకులకి మనుషు లకంటే యంత్రాల మీదే ప్రేమ ఎక్కువ. అందుకే మీ పాలన యాంత్రికంగా మారిపోయింది. రెండు సంవత్సరాల నుంచి జనాన్ని గాలికొదిలి కొడుకుని నాయకుడ్ని చేసే పనిలో వున్నారు. కానీ పులి వేరు, పులి వేషం వేరు, పులివేషగాడు తననితాను పులి అనుకోవచ్చు. కానీ జనం అనుకోరు. నాయకుడు జనంలోంచి పుడతాడు. పార్టీ కార్యాలయాల్లో కాదు. రెండేళ్ళలో మీరు జనానికి సినిమా చూపించారు. ఇక మీ కొడుకు సినిమాస్కోప్ చూపించబోతున్నాడు. జనానికి సహనం ఎక్కువ. చూసిచూసి వచ్చే ఎన్నికల్లో మీకు సినిమా చూపిస్తారు. ఇట్లు సామాన్యుడు