<strong>ఏపీని నంబర్ వన్ స్థాయికి తీసుకెళ్లిన సి.ఎం.</strong><br/>ఏపీని దేశంలోనే నంబర్ వన్ చేస్తామన్నారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆ మధ్యన.ఆ తర్వాత ఆ విషయాన్ని అందరూ మర్చిపోయారు. ఆయన ఏదో ఊరికే అంటారులే..నంబర్ వన్ గా ఏపీని ఎక్కడ మారుస్తారు? అని ప్రతిపక్షాలతో పాటు మామూలు జనమూ అనుకున్నారు. ఏదో ఫ్లోలో బాగుంది కదా అని చంద్రబాబు అలా అని ఉంటాడులే..అని సరిపెట్టుకున్నారు. పాపం చంద్రబాబు నాయుడు మాత్రం తాను ఏదయితే అన్నారో దాన్ని నిజం చేసుకోడానికి తన వంతు కృషిని తాను చేస్తూనే ఉన్నారు.రెండేళ్ల పాలనలో చంద్రబాబు నాయుడు ఏపీని నంబర్ వన్ చేయడానికి మంత్రులకు ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు. మంత్రులకే కాదు..పార్టీ నేతలకూ కావల్సినంత స్వేచ్ఛ ఇచ్చారు. వారి స్వేచ్ఛని అడ్డుకోవద్దని అధికారులకు అల్టిమేటాలూ ఇచ్చారు. ఆ అల్టిమేటాన్ని పట్టించుకోని అధికారులను పిలిపించి మందలించారు కూడా. ఇలా ఆయన రాత్రనక పగలనక కష్టపడి ఏపీని నంబర్ వన్ ని చేశారు.దేశ వ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో నిర్వహించిన ఓ సర్వేలో ఏపీ నంబర్ వన్ గా నిలిచింది.ఇది నిజంగా ప్రతీ తెలుగు వాడూ కూడా గర్వించాల్సిన విషయం. మామూలు ఘనత కాదు. దేశ వ్యాప్తంగా అవినీతిలో ఇపుడు ఏపీయే నంబర్ వన్ అని సర్వే తేల్చి చెప్పింది.ఈ స్థానం కోసం చాలా రాష్ట్రాలు పోటీ పడినా... చంద్రబాబు నాయుడు..ఆయన మంత్రి వర్గ సహచరుల పట్టుదల ముందు మిగతా రాష్ట్రాలు ఏపీకి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాయి.ఈ విజయం..ఈ ఘనత నిక్కచ్చిగా చంద్రబాబు నాయుడిదే.ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచే చంద్రబాబు నాయుడు ఏపీని నంబర్ వన్ గా ఎలా చేయాలా అన్న అంశంపైనే ఆలోచనలు చేస్తూ.. బుర్రకు తట్టిన ఆలోచనలను వెంటనే ఆచరణలో పెడుతూ అంతిమంగా నంబర్ వన్ ప్లేస్ ను ఖాయం చేసుకున్నారు.అవినీతిని పెంచి పోషించడం కోసం ...కొత్త కొత్త మార్గాలు కనిపెట్టడం కోసం... ఆయన వెళ్లని దేశం లేదు. ఎక్కని గుమ్మం లేదు. రాజధానిని మొత్తం ప్రపంచం గర్వపడే స్థాయిలో నిర్మిస్తామన్నారు. ఆ పనులను విదేశీ కంపెనీలకు కట్టబెట్టారు. తీరా పనులు పూర్తయ్యాక చూస్తే... తాత్కాలిక సచివాలయ భవనం కుంగిపోయిందని తేలింది. కొత్త రాజధాని పరిసర ప్రాంతాలన్నీ కూడా బురద మయం.అయితే ఇలా నాసిరకంగా పనులు చేయబట్టే... అధికారంలో ఉన్న వారికి నాలుగు ముడుపులు అందాయి. ఆ విధంగా అవినీతిని ఆవిష్కరించడానికి రాజధాని నగరాన్నే రాజధానిగా మార్చుకున్నారు.రాజధాని నిర్మాణం కోసం భూములు బలవంతంగా లాక్కుని... వాటిని కారు చౌకగా మంత్రులు... మురళీ మోహన్ వంటి ఆప్తులు...ఎన్నికల్లో ఫండింగ్ చేసిన నారాయణ లాంటి పెద్దమనుషులకు కట్టబెట్టారు. ఆ విధంగా వాళ్లు కోట్లకు పడగలెత్తారు. రైతులు నాశనమయ్యారు. అయితే ఆర్ధికంగా మాత్రం చాలా లావాదేవీలు నడిచి అవినీతి ఏరులై పారి ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టింది.ఏపీని నంబర్ వన్ గా చేయడం కోసమే.. పోలవరాన్ని పక్కన పెట్టి ..అవసరం లేని పట్టిసీమను నెత్తికెత్తుకున్నారు. ఎందుకంటే పోలవరం ప్రాజెక్టు అయితే అంతా కేంద్ర ప్రభుత్వం అజమాయిషీలో నడుస్తుంది కాబట్టి .. టిడిపి నేతలకు పెద్దగా ముడుపులు రావు. అందుకే పట్టిసీమ పట్టుకున్నారు. తాజాగా తమిళనాడులోని సదావర్తి సత్రంభూములు భోంచేశారు. రౌడీ షీటర్ స్థాయి నుండి ఎమ్మెల్యేగిరీకి ఎదిగిన ఓ నేతకు ఇసుక దందాలు చేసుకోడానికి అనధికార లైసెన్స్ ఇచ్చారు. దాన్ని ప్రశ్నించినందుకే ఓ మహిళా తహసిల్దార్ ను నానా మాటలూ అన్నారు. ఇలా వ్యవహరించడం వల్ల తన పేరు ప్రతిష్ఠలు మంట గలుస్తాయని తెలిసినా చంద్రబాబు నాయుడు రాజీ పడలేదు. అంతిమంగా ఆంద్ర ప్రదేశ్ ను నంబర్ వన్ ని చేయడమే తన లక్ష్యమనుకున్నారు. అన్నట్లుగానే చేసి చూపించారు.ఇంత కష్టపడ్డ చంద్రబాబు నాయుడిని అభినందించాల్సింది పోయి ప్రతిపక్ష వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ ఆయన అవినీతిపై విమర్శలు చేయడం విడ్డూరంగానే ఉంది.జై చంద్రబాబు జై కరప్ క్షన్ జై తెలుగుదేశం అంటూ తెలుగు తమ్ముళ్లు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు.వచ్చే ఏడాది అవినీతిలో మరింత ప్రగతి సాధించి ఎవరికీ అందనంత ఎత్తులో ఏపీని నిలబెట్టాలని తెలుగు దేశం నేతలంతా కరెన్సీ కట్టలపై ప్రమాణం చేసి మరీ ప్రతిజ్ఞ చేశారు.ఏపీని నంబర్ వన్ గా నిలబెట్టిన చంద్రబాబు నాయుడికి వెయ్యి రూపాయల నోట్లతో తులాభారం వెయ్యాలని మధ్యతరహా అవినీతి పరుల సమాఖ్య తో పాటు ...పెద్ద తరహా అవినీతి పరుల సంఘం కూడా నిర్ణయించాయి.ఇక నుంచి ఏటా ఒక రోజుని అవినితి దినోత్సవంగా జరుపుకోవాలని కూడా చంద్రబాబు నాయుడికి పార్టీ నేతలు ఓ విజ్ఞప్తిని సమర్పించాలనుకుంటున్నారు.