విశాఖ: జూన్ 9వ తేదీన వైయస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని వైయస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర రీజనల్ కో–ఆర్డినేటర్, ఎంపీ వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పట్ల ప్రజలు ఎంతో విశ్వాసంతో ఉన్నారని, వైయస్ జగన్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ప్రజలు ఎంత పెద్ద ఎత్తున వచ్చారన్నది పోలింగ్ రోజు చూశామన్నారు. మరీ ముఖ్యంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల మహిళలు, వృద్ధులు స్వచ్ఛందంగా తరలివచ్చి ఎండను, వర్షాన్ని లెక్క చేయకుండా లైన్లో నిలబడి ఓపికతో ఓట్లు వేశారన్నారు. దాని అర్థం వైయస్ జగన్ మరల ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలి, గత ఐదేళ్లు అందించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అదే విధంగా ముందుకు సాగాలని ప్రజలు కోరుకుంటున్నారు. మా నమ్మకం ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. లోగడ చెప్పినట్లుగానే జూన్ 9వ తేదీ ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల మధ్యలో విశాఖ పట్నంలోనే మా పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. స్వరూపానందస్వామి ఆశీస్సులు విశాఖపట్నం చిన్న ముసిడివాడలోని స్వరూపానంద స్వామి వారి ఆలయాన్ని ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వై వీ సుబ్బారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వరూపానంద స్వామి ఆశీస్సులు తీసుకున్నారు. ఆయన వెంట విశాఖపట్నం సౌత్ ఎమ్మెల్యే వాసు పల్లి గణేష్ కుమార్, కావలి ఎమ్మెల్యే రామ్ రెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, తదితరులు ఉన్నారు.