తాడేపల్లి: ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రెట్టింపు ఉత్సాహంతో క్షేత్రస్థాయిలోకి వెళ్లడానికి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాచరణ రూపొందించింది. ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతీ హామీని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అమలు చేయడం, అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందించడం, కులాలు, మతాలు, ప్రాంతాల కతీతంగా ప్రభుత్వం చేసిన మేలును ఇంటింటికి వెళ్లి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు పార్టీ ఈ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఈ నెల 10 నుంచి 28 వరకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రణాళికలను రూపొందించింది. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మండలాల వారీగా గృహ సారథులకు శిక్షణ, ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమం నిర్వహణకు రూపొందించిన షెడ్యూల్ను వైయస్ఆర్ సీపీ కేంద్ర కార్యాలయం విడుదల చేసింది.
పార్టీ రూపొందించిన షెడ్యూల్ వివరాలు..
- ఈనెల 10 నాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ గృహ సారథుల నియామకం పూర్తి చేయాలి.
- 13న వైయస్ఆర్ సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో తాడేపల్లిలో సమీక్ష సమావేశం. ఈ సమావేశానికి ముందు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు పార్టీ సూచించిన నిర్దిష్ట ఫార్మాట్లో గృహ సారథుల నియామక తుది జాబితా కాపీని సమర్పించాలి. సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు, వలంటీర్లకు తదుపరి కార్యక్రమమైన ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమానికి సంబంధించి సవివరమైన ప్రజెంటేషన్ను ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఈ సమావేశంలో అందించడం జరుగుతుంది.
- 14 నుంచి 19 వరకు మిగిలి ఉన్న మండలాల్లో ‘సచివాలయ కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు వలంటీర్లకు’ శిక్షణ కార్యక్రమాలు.
- 20న 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఏకకాలంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించాలి. ఎమ్మెల్యేలు, నియోజకవర్గ సమన్వయకర్తలందరూ తమ నియోజకవర్గాల్లో పత్రికా సమావేశాలు నిర్వహించి, కనీసం 25 నుంచి 30 ఇళ్లకు తిరిగి ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
- సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, గ్రామ, వార్డు వలంటీర్లు ఇంటింటికీ తిరిగి నిర్వహించే ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమం రాష్ట్రంలో మొత్తం 15,000 సచివాలయాల పరిధిలో అదే రోజు ప్రారంభించాలి.
- 20 నుంచి 27 వరకు ‘జగనన్నే మా భవిష్యత్తు’ ప్రచార కార్యక్రమాన్ని నియోజకవర్గ పరిధిలోని అన్ని ఇళ్లలో (100 శాతం) పూర్తి చేయాలి.