తొలి జాబ్‌మేళా గ్రాండ్‌ సక్సెస్‌

ఊహించిన దాని కంటే ఎక్కువ రెస్పాన్స్‌

మొత్తం 7,537 ఉద్యోగాల కల్పన

గరిష్ట వేతనం రూ.77 వేలతో ఉద్యోగ ఆఫర్‌

యువతకు ఉద్యోగావకాశాలే సీఎం వైయస్‌ జగన్‌ లక్ష్యం

వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్ విజయసాయిరెడ్డి

తిరుపతి: వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వ‌ర్యంలో తిరుప‌తి ఎస్వీ యూనివ‌ర్సిటీలో నిర్వ‌హించిన మెగా జాబ్‌మేళా గ్రాండ్ స‌క్సెస్ అయ్యిందని వైయ‌స్ఆర్ సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, అనుబంధ విభాగాల ఇన్‌చార్జ్‌, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి అన్నారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ ఆదేశాల మేర‌కు యువ‌త‌కు ఉద్యోగ అవ‌కాశాల క‌ల్ప‌నే ల‌క్ష్యంగా జాబ్‌మేళా నిర్వ‌హిస్తున్నామ‌న్నారు. రెండు రోజుల పాటు నిర్వ‌హించిన మేళాకు ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వ‌చ్చింద‌న్నారు. మేళాకు స‌హ‌క‌రించిన వారంద‌రికీ ప్ర‌త్యేకంగా ధ‌న్య‌వాదాలు తెలిపారు. జాబ్ మేళా అనంత‌రం ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఎస్వీ యూనివ‌ర్సిటీలో విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

విజయసాయిరెడ్డి ఇంకా ఏమన్నారంటే..

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించాలి. వారి కుటుంబానికి ఆధారం కల్పించాలి. సామాజికంగా, ఆర్థికంగా ఆ కుటుంబం ఎదగాలి. ఇదీ సీఎం వైయస్‌ జగన్‌ ఆశయం. ఆయన సంకల్పంతోనే ఈ జాబ్‌మేళాల నిర్వహణ. వాస్తవానికి ఈ కార్యక్రమం గురించి ఆలోచించినప్పుడు ఇంత స్పందన వస్తుందని ఊహించలేదు. కంపెనీలు కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాయి. ఆ కంపెనీల ప్రతిని«ధులకు నేను ఒకటే విజ్ఞప్తి. మన రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు ఇవ్వడంలో మనం ఎంత వరకు ఉపయోగపడ్డామన్నది ఆలోచించాలి. అది ఒక రకంగా దేశానికి చేసే సేవనే చెప్పాలి. తిరుపతి జాబ్‌మేళాలో అత్యధిక వేతనం రూ.77 వేలతో ఆఫర్‌ లెటర్‌ ఇవ్వడం జరిగింది. 

రెండోరోజు 2753 ఉద్యోగాలు..
ఇవాళ్టి జాబ్‌మేళాకు కూడా ఊహించని విధంగా ఉద్యోగార్థులు వచ్చారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, పాలిటెక్నిక్‌ అర్హతలతో 4,774 మంది రాగా, వారిలో 1792 మందికి ఎంపికయ్యారు. బీఏ, బికామ్, బీఎస్సీ, బీబీఏ అర్హతలతో 2732 మంది హాజరు కాగా, 341 మంది సెలెక్ట్‌ అయ్యారు. బీఈ, బీటెక్, ఎంటెక్, ఎంసీఏ, ఎంబీఏ అర్హతలతో 2370 ఉద్యోగార్థులు హాజరు కాగా, 621 మంది ఎంపికయ్యారు. ఇవాళ 9,876 మంది హాజరు కాగా, వారిలో 2753 మంది సెలెక్ట్‌ అయ్యారు. ఈ రెండు రోజుల్లో దాదాపు 25 వేల మంది హాజరు కాగా, మొత్తం 7537 మందికి ఉద్యోగాలు వచ్చాయి.

వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు..
ఈ ఘనత పూర్తిగా ఆయా కంపెనీలకు దక్కుతుంది. మీరు 7537 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించారంటే, ఒక్కో కుటుంబంలో సగటున నలుగురిని లెక్క వేసుకున్నా, దాదాపు 30 వేల మందికి మీరు సంతోషం కల్పించారు. అందుకు మీకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ జాబ్‌మేళా నిర్వహణలో సహకరించిన వివిధ విభాగాల అధికారులతో పాటు, యూనివర్సిటీ అధికారులకు కూడా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 

ఇది పార్టీ కార్యక్రమం..
వాస్తవాలకు దూరంగా మేము ఏ కార్యక్రమం చేయలేదు. నేను తొలి రోజే చెప్పాను. ప్రభుత్వం వేరు. పార్టీ వేరు. గతంలో సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ విపక్షనేతగా ఉన్నప్పుడు, ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు, అధికారంలోకి వచ్చాక దాదాపు 6 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు. అది ప్రభుత్వ పరంగా చేస్తే, ఇది పూర్తిగా పార్టీ కార్యక్రమం. నిజానికి ప్రైవేటు కంపెనీల్లో ఉద్యోగం ఒక సవాల్‌గా ఉంటుంది. ఎదుగుదలకు కూడా మంచి అవకాశాలు ఉంటాయి.

అన్ని జిల్లాలలోనూ పార్టీ కార్యక్రమాలు..
కేవలం ఉత్తరాం«ధ్రలో మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ పార్టీ అనుబంధ విభాగాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తాం. విపక్షాల విమర్శ సహేతుకంగా ఉండాలి. కేవలం విమర్శ కోసం విమర్శలు చేయడం సరి కాదు. కేవలం యువత కోసం ఈ పని చేస్తున్నాం. మేం ఏం చేసినా రాష్ట్రం, ప్రజల కోసమే చేస్తాము.. అని విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు.

Back to Top