ఏపీకి ప్ర‌త్యేక హోదా ఇవ్వాల్సిందే..

కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి

పంట గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలి

విగ్రహాల ధ్వంసంలో టీడీపీ నేతలున్నట్లు ఆధారాలున్నాయి

ఐపీసీ 295కి సవరణ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలి

అఖిలపక్ష సమావేశంలో వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని వైయస్‌ఆర్‌ సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి అఖిలపక్ష సమావేశంలో డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ బడ్జెట్‌ సమావేశాల నేపథ్యంలో ప్రధానమంత్రి మోడీ అధ్యక్షతన అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వైయస్‌ఆర్‌ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను సమావేశంలో లేవనెత్తారు. అంతేకాకుండా జాతీయ స్థాయిలోని ప‌లు అంశాల‌పై ప్ర‌స్తావించారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండ్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు. విశాఖలో జాతీయ విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని కోరారు. భౌగోళిక ప్రాతిపదికన జల వనరులు కేటాయించాలన్నారు. దిశ చట్టానికి వెంటనే అనుమతులు ఇవ్వాలని కోరారు. అదే విధంగా రేప్‌ ఘటనలకు పాల్పడే వారికి త్వరగా శిక్షలు పడేలా ఐపీసీ, సీఆర్‌పీసీలకు సవరణలు తీసుకురావాలని డిమాండ్‌ చేశారు. 

పంటల గిట్టుబాటు ధరలకు చట్టబద్ధత కల్పించాలని కేంద్రాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి కోరారు. అదేవిధంగా ప్రత్యేక రైతు కమిషన్‌ ఏర్పాటు చేయాలన్నారు. చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు.  విగ్రహాల ధ్వంసంలో టీడీపీ నేతలున్నట్లు ఆధారాలు బయటపడ్డాయని, ఐపీసీ 295కి సవరణ చేసి 20 ఏళ్ల జైలు శిక్ష విధించాలని డిమాండ్‌ చేశారు. 
 

Back to Top