ఏపీలో రూ.16,400 కోట్లతో ఐదు సోలార్ పార్కులు

రాజ్యసభలో వైయ‌స్ఆర్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రశ్నకు కేంద్ర‌మంత్రి జవాబు

న్యూఢిల్లీ: సోలార్ పార్కుల అభివృద్ధి పథకం కింద ఆంధ్రప్రదేశ్‌కు 4,100 మెగావాట్ల సామర్థ్యంతో 5 సోలార్ పార్కులు మంజూరు చేసినట్లు కేంద్ర పునరుత్పాదక శక్తి, విద్యుత్ శాఖల మంత్రి ఆర్.కే. సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర‌మంత్రి రాతపూర్వకంగా జవాబిచ్చారు. అనంతపురంలో రెండు, కర్నూలు, వైయ‌స్సార్‌ కడప జిల్లాలో ఒక్కో సోలార్ పార్కు, రామగిరిలో సోలార్ విండ్ హైబ్రీడ్ పార్కుల అభివృద్ధికి కేంద్ర ప్రభత్వ ఆర్థిక సహాయం కింద 590.80 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1కు 244.81 కోట్లు, 500 మెగావాట్ల పార్కు-2కు 91.24 కోట్లు, వైయ‌స్సార్‌ కడప జిల్లాలోని 1000 మెగావాట్ల సోలార్ పార్కుకు 54.25 కోట్లు, కర్నూలులో 1000 మెగావాట్ల పార్కుకు 200.25 కోట్లు చొప్పున ఆర్థిక సహాయాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. అనంతపురంలో 1400 మెగావాట్ల సోలార్ పార్కు-1, కర్నూలులో 1000 మెగావాట్ల సోలార్ పార్కు స్థాపిత సామర్థ్యం మేరకు పూర్తిస్థాయిలో పని చేస్తున్నాయి. వైయ‌స్సార్‌ కడప జిల్లాలో 1000 మెగావాట్ల సామర్థ్యానికి గాను 250 మెగావాట్లు, అనంతపురంలోని  రెండవ సోలార్ పార్కు 500 మెగావాట్ల సామర్థ్యానికిగాను 400 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో నడుస్తున్నట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. రామగిరిలో 200 మెగావాట్ల సామర్థ్యంతో ఆమోదం పొందిన సోలార్ విండ్ హైబ్రిడ్ పార్కును  ప్రారంభించాల్సి ఉందని అన్నారు.

సోలార్ పార్కులో ఒక మెగావాట్ విద్యుత్‌ సామర్థ్యం నెలకొల్పేందుకు సరాసరి 4 కోట్లు ఖర్చు అవుతుంది. ఈ మేరకు మొత్తం 4100 మెగావాట్ల సామర్థ్యంగల 5 పార్కులకు సుమారు 16,400 కోట్లు వ్యయం అవుతుందని కేంద్ర‌మంత్రి అన్నారు. డీపీఆర్ తయారు చేసేందుకు ఒక్కో సోలార్ పార్కుకు 25 లక్షలు, అదనంగా ఒక్కో మెగావాట్ స్థాపనకు 20 లక్షలు లేదా 30 శాతం నిధులు కేంద్రం చెల్లిస్తున్నట్లు కేంద్ర‌మంత్రి తెలిపారు. సోలార్ పార్కులు పూర్తి చేసేందుకు ఈ పథకాన్ని 2024 మార్చి వరకు పొడిగించినట్లు కేంద్ర‌మంత్రిపేర్కొన్నారు.

Back to Top