లోకేష్ పాద‌యాత్ర‌.. టీడీపీకి పాడెయాత్ర 

పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టుగా లోకేష్ తీరు

వార్ వన్ సైడ్ కాదు.. టీడీపీకి సూసైడ్

2024లో టీడీపీ కనుమరుగు కావడం ఖాయం

ఎంతమంది కలిసొచ్చినా.. మా జెండా గద్దెను కూడా కదపలేరు

అబద్ధాలతో పాదయాత్ర చేస్తే.. జనం చెప్పులతో కొడతారు

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి

విశాఖ‌ప‌ట్నం: నారా లోకేశ్‌ పాదయాత్రను టీడీపీకి పాడెయాత్రగా జనం భావిస్తున్నారని, యువగళం కాదు.. అది ప్రజల పాలిట ఒక గరళంగా జనం తిడుతున్నారని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి అన్నారు. లోకేశ్‌ పాదయాత్రకు వైయ‌స్సార్‌సీపీ భయపడుతోందని టీడీపీ నాయకులు అనిత, బోండా, అయ్యన్న తదితరులంతా ప్రగల్భాలు పలుకుతున్నారని, లోకేష్ ఏమైనా పార్టీ అధ్యక్షుడా?. ప్రజల్లో ఏదైనా పదవిలో గెలిచాడా? లేదా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడా?  ఏ పదవీ లేని వ్యక్తి పాదయాత్రకు ఎవరైనా స్పందిస్తారా..? అని ప్ర‌శ్నించారు. విశాఖ‌ప‌ట్నంలోని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాల‌యంలో ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి విలేక‌రుల స‌మావేశం నిర్వ‌హించారు. 

ఎమ్మెల్సీ శ్రీమతి వరుదు కల్యాణి ఇంకా ఏమన్నారంటే..

వంచనకు ప్రతిరూపమైన బాబు తనయుడు లోకేశ్‌.. యువతను మోసం చేసిన బాబు తనయుడు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి అంటూ వాగ్దానాలు చేసి,  యువతను దారుణంగా  వంచించిన బాబు కొడుకు. బాబు పాలనలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. కరోనా కష్టకాలంలో కూడా సీఎం వైయ‌స్‌ జగన్‌ యువతకు ఎన్నో ఉద్యోగాలు కల్పించారు. ఈ మూడున్నరేళ్లలో   గ్రామ, వార్డు సచివాలయాల్లో 1.55 లక్షల శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. వారికి జీతాలు తక్కువంటూ విమర్శిస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్లి వారి జీతాలెంతో తెలుసుకోవాలని సూచిస్తున్నాను. అసలు మీ టీడీపీ హయాంలో మీరెన్ని ఉద్యోగాలు ఇచ్చారో చెప్పండి. వైయ‌స్ జగన్‌ పోలీసు ఉద్యోగాలకు ప్రకటన ఇచ్చి, 6500 ఉద్యోగాలు ఇస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి,  55 వేల మందిని  ప్రభుత్వ ఉద్యోగులను చేశారు.  కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్, ఇతర ఉద్యోగాలను   లెక్కిస్తే  3,71,000 ఉద్యోగాలు ఇచ్చారు. మొత్తంగా ఈ మూడున్నరేళ్లలో...6,30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చింది సీఎం వైయ‌స్‌ జగనే. బాబు పాలన చివరిలో డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇచ్చి బాబు దిగిపోయారు. ఆ ఉద్యోగాల భర్తీ కూడా వైయ‌స్  జగన్‌ ముఖ్యమంత్రి అయ్యాకే జరిగింది. ఇన్ని ఉద్యోగాలు ఎప్పుడైనా టీడీపీ పాలనలో బాబు ఇచ్చారా? 

విశ్వసనీయత కలిగిన సీఎం వైయ‌స్‌ జగన్ 
మూడున్నరేళ్ల సీఎం వైయస్‌ జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో రాష్ట్రంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి.  ఎన్నడూ చూడని సంక్షేమ పథకాలు గడప గడపకూ అందుతున్నాయి. ప్రతి పథకంలోనూ మహిళలకే వైయ‌స్‌ జగన్‌ పెద్దపీట వేశారు. మహిళలకు రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా అండగా ఉంటున్నది వైయ‌స్‌ జగన్‌ మాత్రమే. ఒక్క వైయ‌స్‌ జగన్ మోహన్ రెడ్డిని తప్ప.. దేశంలో మరే ముఖ్యమంత్రినీ మహిళలు, యువకులు, ప్రజలు అన్నలా భావించరు. ఒక్క ఆంధ్ర రాష్ట్రంలోనే మహిళలంతా కూడా వైయ‌స్‌ జగన్ ని అన్నలా భావిస్తారు. ఈ రోజు వైయ‌స్ జగన్‌ ప్రభుత్వంలో రైతులు, వృద్ధులు , కార్మికులు, కర్షకులు, విద్యార్థులు అందరూ సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే అన్ని వర్గాలకు వైయ‌స్‌ జగన్‌ అందించే సంక్షేమ పథకాలే కారణం. ఆయన ఇచ్చిన హామీల్లో 98.4 శాతం నెరవేర్చి, అత్యంత విశ్వసనీయత కలిగిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్నారు. రాష్ట్రంలో వైయ‌స్ జగన్‌కి, వైయ‌స్సార్‌సీపీకి ఎంతో ఆదరణ ఉంది. దాన్ని తట్టుకోలేని టీడీపీ నాయకులు లేనిపోని విమర్శలు చేస్తున్నారు.   మైకుంది కదా అని టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనిత సీఎం వైయ‌స్‌ జగన్‌  గురించి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇష్టమొచ్చినట్లు అబద్ధాలు మాట్లాడుతున్నారు.

యూత్ ఐకాన్ వైయ‌స్‌ జగన్..
టీడీపీ దుష్ట పాలనకు భిన్నంగా.. 2019 నుంచి రాష్ట్రంలోని అన్ని వర్గాలకూ మేలు చేస్తూ..  యూత్‌ ఐకాన్‌గా వైయ‌స్‌ జగన్‌ నిలిచారు. బీసీ ఎస్సీ ఎస్టీలకు మైనార్టీలకు వైయ‌స్‌ జగన్‌ అండగా ఉన్నారు. – ఆరు అంకెల జీతంతో అమెరికాలో బాబు ఉద్యోగాలు ఇప్పించామని చెబుతున్నటీడీపీ నేతలు- మరి ఆంధ్రలో ఎందుకు ఉద్యోగాలు ఇప్పించలేకపోయారో చెప్పగలరా ? రేపు అమెరికా ప్రెసిడెంట్‌ను కూడా మేమే తయారు చేశామని పిట్టల దొర మాటలు చెప్పగలరు బాబు. మీ హామీలే పెద్ద బూటకాలు. మీ పార్టీ మేనిఫెస్టోలో 600కు పైగా హామీలు ఇచ్చి, ఎన్నికల తర్వాత వెబ్‌సైట్‌ నుంచి ఆ మానిఫెస్టోనే  తీసేసిన దౌర్భాగ్యం మీది. రైతుల రుణాలు మాఫీ చేస్తానని, డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని, బ్యాంకుల్లో కుదవ పెట్టిన బంగారం తెచ్చి ఇస్తానని రైతులను, మహిళల్ని వంచించింది చంద్ర బాబు కాదా అని  అడుతున్నాను. ఇంటింటికీ మినరల్‌ వాటర్‌ ఇస్తామన్నారు. ఏటా 5 లక్షల ఇళ్లు కట్టిస్తామన్నారు. ఇవేవీ అమలు చేయని మిమ్మల్ని లోకేశ్‌ పాదయాత్రలో జనం నిలదీయరా? 

మిమ్మల్ని నిగ్గదీయడానికి జనం సిద్ధం
మీరు యాత్ర చేయండి .. మిమ్మల్ని నిగ్గదీయడానికి   జనం సిద్ధంగా ఉన్నారు.  లోకేశ్‌ పాదయాత్రకు జనం ప్రభంజనంలా వస్తారని గొప్పలు చెప్పుకుంటున్నారు. ప్రభంజనం అని మాట వాడడానికి మీకు అర్హత ఉందా?. కరెక్టే..  జనం ప్రభంజనంలా వచ్చి, టీడీపీ హయాంలో  మీరు నెరవేర్చని హామీల గురించి ప్రశ్నించడానికి, నిలదీయడానికి వస్తారు. ప్రజలందరూ టీడీపీపై విసిగిపోయి ఉన్నారు. వార్‌ వన్‌సైడ్‌ కాదు.. ఇది టీడీపీకి సూసైడ్‌. మీకు బలముంటే పవన్‌ కల్యాణ్ మద్దతు కోసం ఎందుకు అర్రులు చాస్తున్నారు?  మీరంతా కలిసినా.. మా పార్టీ జెండా కట్టిన గద్దెనుకూడా మీరు కదిలించలేరు. ముందు మీ పార్టీని ప్రక్షాళన చేసుకోండి. మీకు బలం లేక పవన్, సీపీఐ అండ కోరుతున్నారన్నది నిజం కాదా చెప్పండి?

మీ ప్రోగ్రాములన్నీ విఫలమే...
చంద్రబాబు చేసిన.. బాదుడే బాదుడు,  ఇదేం ఖర్మ కార్యక్రమాలన్నీ విఫలమయ్యాయి. అమరావతి నుంచి అరసవెల్లి యాత్ర కూడా బెడిసికొట్టింది. లోకేశ్‌ యాత్ర కూడా ఇలాగే విఫలమవుతుంది. మీ పాదయాత్ర ను మేము అడ్డుకోవాల్సిన పనేలేదు.. లోకేశ్‌, తన ఉనికిని చాటుకోవడానికే ఈ పాదయాత్ర చేస్తున్నాడు. కనీసం మీరు పాదయాత్రలో గ్రామాల్లోకి వెళ్లేటప్పుడు నిజాలు చెప్పడానికి వెళ్లండి.   అబద్ధాలు చెబితే మాత్రం ప్రజలే మిమ్మల్ని చెప్పులతో కొడతారు . లోకేశ్‌ కి సీఎం వైయ‌స్ జగన్‌కి పోలికా? సోనియా గాంధీని ఎదిరించి, సొంతంగా పార్టీ పెట్టి 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన వైయ‌స్‌ జగన్  ఎక్కడ.. పోటీ చేసిన ఎమ్మెల్యే సీటులో ఓడిన లోకేష్ ఎక్కడ. తండ్రి అండతో దొడ్డిదారిన మంత్రి అయి, ఆతర్వాత ఎమ్మెల్సీ అయిన లోకేశ్‌ఎక్కడ.. 

2024లో టీడీపీ గల్లంతే
ఆరోజు రెండెకరాల రైతు బాబు. మరి ఈ రోజు వేల కోట్లు ఎలా సంపాదించారో జనానికి తెలుసు. ఉమ్మడి రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ ను కేసీఆర్‌ కు రాసిచ్చి పారిపోయి వచ్చిన వ్యక్తి బాబు. ఇదీ బాబు విశ్వసనీయత. శవ రాజకీయాలు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు. 2024 ఎన్నికల్లో టీడీపీ గల్లంతే. కులపిచ్చి, మతపిచ్చి ఉన్న పార్టీ టీడీపీయేనని లోకేశే చెప్పారు.  2024 ఎన్నికల్లో వైయ‌స్ జగన్‌ మరోసారి అఖండ విజయం సాధించి తీరతారు.. అని ఎమ్మెల్సీ వ‌రుదు క‌ల్యాణి వివరించారు.

Back to Top