అమరావతి: రాజకీయ కారణాలతో 2 లక్షల పింఛన్లు తొలగించడం అన్యాయమని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మండిపడ్డారు. రకరకాల నిబంధలు పెట్టి దివ్యాంగుల పెన్షన్లు తొలగించారన్నారు. పెన్షన్ల తొలగింపు పై మండలిలో వైయస్ఆర్సీపీ సభ్యులు ప్రభుత్వాన్ని నిలదీశారు. పేదలకు ఇచ్చే పెన్షన్లను భూతద్దం పెట్టి వెతికి తొలగించడమ దారుణమని త్రిమూర్తులు తప్పుపట్టారు. వివిధ రూపాల్లో లక్షలు..కోట్లు దోచేస్తున్న వాళ్లను వదిలేసి పేదలపై పడటం బాధాకరమన్నారు. ఓటు వేయలేదని పింఛన్ల తొలగింపు: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ ఎన్నికల్లో కూటమికి ఓటు వేయలేదని కక్షగట్టి సామాజిక పింఛన్లు తొలగించారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ తెలిపారు. తొమ్మిది నెలల్లో రెండు లక్షల పెన్షన్లు తొలగించి, రికార్డుల్లో 14,965 మాత్రమే తొలగించామని చెప్పడం సరికాదన్నారు. ఏ ప్రాతిపదికన పెన్షన్ల తొలగిస్తున్నారో చెప్పాలని ఎమ్మెల్సీ మొండితోక అరుణ్ కుమార్ సభలో పట్టుబట్టారు. గతంలో 6 అంశాల పై పింఛన్లు వెరిఫై చేసేవారని, ప్రస్తుత ప్రభుత్వం 13 అంశాలను పరిగణలోకి తీసుకుని వెరిఫై చేస్తున్నారని తప్పుపట్టారు. పెన్షన్ల తొలగింపులో దివ్యాంగులకు 15 రోజుల్లో సదరన్ సర్టిఫికెట్ ఇవ్వాలంటున్నారని, సదరన్ వెరిఫికేషన్ స్లాట్ దొరకడానికే నెలరోజుల సమయం పడుతుందన్నారు. ఏ ప్రాతిపదికన డప్పు కళాకారుల పెన్షన్లు తొలగించారో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. చిరునామా మారితే పెన్షన్ తొలగించేస్తున్నారని ఆక్షేపించారు. పెన్షన్లు తొలగింపులో మానవీయకోణంలో ఆలోచన చేయాలని అరుణ్కుమార్ కోరారు.