తాడేపల్లి: జనసేనపార్టీ పెట్టిన తరువాత పవన్ కల్యాణ్ ఎవరైనా ప్రశ్నించారా అంటూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిద్దలూరు ఎమ్మెల్యే అన్నా రాంబాబు నిలదీశారు. ఐదేళ్లు చంద్రబాబు, బీజేపీని ప్రశ్నించలేని పవన్..ఇవాళ గిద్దలూరు వచ్చి పోరాటం..యుద్ధం అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జనసేన కార్యకర్త వెంగయ్య మృతికి తనకు ఎలాంటి సంబంధం లేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. వెంగయ్య మృతి చెందిన రోజు ఆయన కుటుంబ సభ్యులు చెప్పిన స్టేట్మెంట్కు..మరుసటి రోజు జరిగిన ఘటనకు పొంతన లేదన్నారు. శవ రాజకీయాలు చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరని హెచ్చరించారు. ఆదివారం తాడేపల్లిలోని వైయస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో అన్నా రాంబాబు మీడియాతో మాట్లాడారు. వైయస్ జగన్ ఆశీస్సులు, గిద్దలూరు ప్రజల ఆశీస్సులతో 2019వ సంవత్సరం నిర్వహించిన ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ తరఫున 81 వేల మెజార్టీతో రాష్ట్రంలోనే రెండో అత్యధిక మెజారిటీ సాధించాను. ఈనెల 15వ తేదీన రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసేందుకు వెళ్ళాను. ఆ క్రమంలో సింగనపల్లి గ్రామం వద్ద జనసేన నేత చంద్ తన కారును బలవంతంగా అడ్డుకుని రోడ్లు ఎలా ఉన్నావ్ అంటూ నిలదీశాడు. ఈ చంద్ అనే వ్యక్తి 2019 ఎన్నికల్లోనా దగ్గర ఉన్నాడు. తాను ఎమ్మెల్యేగా గెలిచి తిరుమలకు పాదయాత్ర చేసే సమయంలో కూడా తనపక్కనే ఉన్నాడు. సింగనపల్లి గ్రామం లో 80 శాతం సిమెంట్ రోడ్డు నిర్మించాం. ఈ గ్రామం కొండ గుట్ట పక్కనే ఉంటుంది. దీంతో వర్షం నీరు గ్రామంలోకి వచ్చి చేరుతుంటాయి. ఇటీవల కాల్వలు పూడ్చడంతో వర్షం నీరు రోడ్డుపై నిలిచిపోతుంది. గ్రామంలో డ్రైనేజీలు నిర్మాణం కోసం ప్రతిపాదనలు పంపించాలని అధికారులకు సూచించారు. అంతలోనే నన్ను అడ్డుకోవడం.. ఇబ్బంది పెట్టడం జరిగింది. త్వరలోనే డ్రైనేజీ నిర్మిస్తామని గ్రామస్తులకు హామీ ఇచ్చాను. అయినా సరే రోడ్డుకు అడ్డంగా జనసేన జెండాలు పాతి తనను అటకాయించారు. చంద్ అనే వ్యక్తి కారును ఆపేసి..తలుపు తట్టి తనను కారు నుంచి దిగాలని బెదిరిస్తూ ఏకవచనంతో సంభోదించడంతో తాను కూడా గ్రామాల్లో వాడే భాషతో నువ్వు ఎవరూ తనను అడ్డుకోవడానికి అంటూ గట్టిగానే మాట్లాడాను. చంద్ తనతో వాగ్వాదానికి దిగాడు. ఈ వెంకయ్య ఎందుకు చనిపోయాడో..అతనికి, తనకు ఎలాంటి సంబంధం లేదు. ఎక్కడో ఆత్మహత్య చేసుకుంటే..దాన్ని పట్టుకొని జనసేన నాయకులు శవ రాజకీయాలు చేస్తున్నారు. వెంకయ్య తాగుడుకు బానిసై ఆత్మహత్య చేసుకున్నాడని అతని అన్న స్టేట్మెంట్ ఇచ్చాడు. పోలీసులు కూడా ఆ రకంగానే కేసు నమోదు చేశారు. మరుసటి రోజు మాట మార్చి..తానే వెంకయ్య చావుకు కారణం అంటూ శవాలపై చిల్లర ఏరుకునేలా శవ రాజకీయాలు చేశారు. పవన్ కళ్యాణ్ కి నమస్కారం తెలియజేస్తున్నాను. ఆయన పెద్ద నాయకుడు ఆయన గౌరవించే సంస్కృతి నాకు ఉంది. నిన్న పవన్ కళ్యాణ్ మా నియోజకవర్గానికి వచ్చి నాకు హెచ్చరికలు జారీ చేశాడు. నీ అన్న చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ తరఫున పోటీ చేసింది..గెలిచింది వాస్తవమే. చిరంజీవి ఆశీస్సులతో నేను గెలిచాను అని గర్వంగా ఈ రోజు కూడా చెబుతున్నాను. అది నా విశ్వాసం.. నిబద్ధత. శవ రాజకీయాల కోసం వెంకయ్య మృతికి తానే కారణం అంటే..నిజాలు తెలుసుకోకుండా ఇక్కడికి వచ్చి నాతో యుద్ధం చేస్తాం ..ప్రశ్నిస్తా అని పవన్ కళ్యాణ్ అంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇన్నాళ్ళ ఎవరిని ప్రశ్నించాడు.. ఎవరితో యుద్ధం చేశాడో ఆలోచన చేయాలి. చంద్రబాబు గతంలో 23 మంది ఎమ్మెల్యేలను, ముగ్గురు వైయస్ఆర్సీపీ ఎంపీలను కొనుగోలు చేస్తే..ఆయన్ను ప్రశ్నించావా? బీజేపీతో యుద్ధం చేశావా?. యుద్ధం చేయడం ఒక వైయస్ జగన్ మాత్రమే సాధ్యం అని గుర్తుంచుకోవాలి. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించిన వైయస్ జగన్..బయటకు వచ్చాడు. కుట్రలు చేసి జైలుకు పంపినా చెక్కు చెదరని విశ్వాసంతో సొంతంగా పార్టీ పెట్టి 151 సీట్లతో ఇవాళ ముఖ్యమంత్రి అయ్యారు. నాయకుడంటే ఇలా ఉండాలి. యుద్ధం చేయడం వైయస్ జగన్ను చూసి పవన్ కళ్యాణ్ నేర్చుకోవాలని ఎమ్మెల్యే అన్నా రాంబాబు సూచించారు.