గుంటూరు: చంద్రబాబు నాయుడు పనిగట్టుకొని ప్రభుత్వంపై, వైయస్ఆర్ సీపీ శాసనసభ్యులపై దుష్ప్రచారం చేస్తున్నారని ఎమ్మెల్యే అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. చంద్రబాబు విష ప్రచారాన్ని అడ్డుకోవడానికి వైయస్ఆర్ సీపీ కూడా ‘చలో ఆత్మకూరు’ పిలుపునిచ్చిందన్నారు. వైయస్ఆర్ సీపీ పిలుపు మేరకు చంద్రబాబు బాధితులు పెద్ద ఎత్తున గుంటూరు కార్యాలయానికి చేరుకున్నారని ఎమ్మెల్యే అంబటి చెప్పారు. గుంటూరు వైయస్ఆర్ సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఆత్మకూరుకు వెళ్లేందుకు పర్మిషన్ ఇవ్వాలని పోలీసులను కోరాం. దాన్ని పోలీసులు తిరస్కరించారు. పిలుపునివ్వడానికి ప్రధాన కారణం. గత కొద్ది రోజులుగా ప్రతిపక్షనేతగా ఉన్న చంద్రబాబు పనిగట్టుకొని ఒక దుష్ప్రచారాన్ని చేస్తున్నారు. పల్నాడులో చాలా ఘోరాలు జరుగుతున్నాయని, దానికి వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి కారణమని దుష్ప్రచారం చేస్తున్నారు. అనేక మంది బాధితులు ఉన్నారని ఒక శిబిరం పెట్టి వారికి రూ. 10 వేలు, దుస్తులు, భోజనం పెట్టడం లాంటి కార్యక్రమాలను చంద్రబాబు చేస్తున్నాడు. ఆత్మకూరు, పల్నాడులో ఏం జరగకపోయినా ఏదో జరుగుతుందని భ్రమ కలిగించి ప్రజలను నమ్మించేలా చంద్రబాబు ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారన్నారు. ఈ దుష్ప్రచారాన్ని ఎదుర్కోవాలని భావించి తెలుగుదేశం ఐదేళ్ల పాలనలోని బాధితులందరినీ సమీకరించి ఆత్మకూరు వెళ్లి యరపతినేని, కోడెల, పుల్లారావు, ఆంజనేయులు, శ్రీధర్ బాధితులకు ఏం సమాధానం చెబుతావు అనే ఉద్దేశంతో పిలుపునివ్వడం జరిగిందన్నారు.
గత ఐదేళ్లు చంద్రబాబు పోలీసులను ఏ విధంగా ఉపయోగించుకున్నారో ప్రజలందరికీ తెలుసని ఎమ్మెల్యే అంబటి అన్నారు. తప్పుడు కార్యక్రమాలకు పోలీసులను వినియోగించుకోకూడదనే ఉద్దేశంతో వైయస్ఆర్ సీపీ ఉందన్నారు. పల్నాడులో ఎలాంటి ఘోరాలు జరగడం లేదు. వైయస్ఆర్ సీపీ ఎవర్నీ వేధించడం లేదన్నారు. చంద్రబాబు నాయుడు టైమ్లో మాచర్లలో ఒకేరోజు ఏడు మర్డర్లు జరిగాయన్నారు. ఫ్యాక్షన్ అణచివేయడానికి వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందన్నారు. కానీ చంద్రబాబు మాత్రం తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు విషప్రచారాన్ని ఎదుర్కోవడానికి సర్వసన్నద్ధంగా ఉన్నామన్నారు. చంద్రబాబు వెళ్లినా.. వెళ్లకపోయినా పోలీసుల అనుమతి తీసుకొని ఆత్మకూరు వెళ్తామన్నారు. మీడియా సమక్షంలో సమావేశం జరిపి వాస్తవాలను ప్రజలకు తెలియజేస్తామన్నారు.
కోడెల, యరపతినేని అవినీతి బయటపడుతుందని చంద్రబాబు కొత్త డ్రామాకు తెరలేపారని అంబటి మండిపడ్డారు. ప్రజల దృష్టి మరల్చాలని చూడడం దుర్మార్గమైన విషయమన్నారు. టీడీపీ అవినీతి, అక్రమాలను బయటపెట్టి తీరుతామన్నారు. పల్నాడును రక్షించుకోవాల్సిన బాధ్యత వైయస్ఆర్ సీపీ ప్రభుత్వం ఉందని, స్వచ్ఛమైన పరిపాలన అందిస్తామన్నారు. కోడెల, యరపతినేని అవినీతి అక్రమాలను బయటకు తీసుకువచ్చేంత వరకు ఉద్యమాలు చేస్తూనే ఉంటామన్నారు. ఆత్మకూరు వెళ్లి అక్కడి పరిస్థితులను ప్రజలకు వివరిస్తామన్నారు.