కర్నూలు : వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ఆదిమూలపు సతీష్ తెలిపారు. కర్నూలు 40వ వార్డు పరిధిలోని 103 వ సచివాలయం వద్ద గురువారం ఏర్పాటు చేసిన ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ శిబిరాన్ని డాక్టర్ ఆదిమూలపు సతీష్ సందర్శించారు. ఈ హెల్త్ క్యాంపును పరిశీలించి వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డాక్టర్ ఆదిమూలపు సతీష్ మాట్లాడుతూ.. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పారు. అందులో భాగంగానే ఆరోగ్యశ్రీ పథకం కింద 3256 వ్యాధులకు చికిత్స అందిస్తున్నామని తెలిపారు. ప్రతి ఒక్కరి ఆరోగ్య రక్షణే లక్ష్యంగా ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ కార్యక్రమాన్ని తీసుకొచ్చామని, అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నవంబర్ 15వ తేదీ వరకు శిబిరాలు కొనసాగుతాయన్నారు. హెల్త్ క్యాంపుల్లో చికిత్సలు చేశాక మెరుగైన వైద్యం అవసరమైతే ఆరోగ్య శ్రీ రెఫరల్ ఆస్పత్రులకు పంపుతామన్నారు. దేశంలోని ఏ రాష్ట్రంలో, ఏ ముఖ్యమంత్రి కూడా ఇలాంటి ఆలోచన చేయలేదని అన్నారు. వాలంటీర్లు, ఏఎన్ఎంలు, ఆశ వర్కర్లు డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నట్లు చెప్పారు. పేదవాళ్లు ఎక్కువగా విద్య, వైద్యానికి ఖర్చు చేస్తున్నారని.. అందుకే ఈ రెండు రంగాలకు సీఎం వైఎస్ జగన్ అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. కర్నూలు నగరంలో ఆరోగ్యశ్రీ ఆస్పత్రులు ఉన్నాయని, కానీ చాలా మందికి ఈ విషయం తెలియక ఆ ఆస్పత్రుల్లో కూడా డబ్బులు ఖర్చు చేసుకుంటున్నారని తెలిపారు. ఆరోగ్యశ్రీ వర్తించే ప్రతి ఆస్పత్రిలోనూ ప్రభుత్వం ఆరోగ్య మిత్రలను ఏర్పాటు చేసిందని, ఆయా ఆస్పత్రులకు వెళ్లిన సమయంలో ఆరోగ్య మిత్రలను సంప్రదించాలని సూచించారు. ఈ విషయంపై వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అవగాహన కల్పించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రులను నాడు నేడు కింద బలోపేతం చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా 17 మెడికల్ కళాశాలలను అందుబాటులోకి తెస్తున్న ఘనత సీఎం జగన్మోహన్రెడ్డిదన్నారు. తమది పేదల ప్రభుత్వమని, వారికి తోడుగా ఉంటామని స్పష్టం చేశారు. కార్యక్రమంలో 40వ వార్డు కార్పొరేటర్ విక్రమ సింహ రెడ్డి , వైఎస్ఆర్సీపీ వైద్య విభాగ జోనల్ ఇన్చార్జ్ డాక్టర్ హరికృష్ణా రెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైద్యులు పాల్గొన్నారు.