స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తే ఊరుకోం

కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటనను వ్యతిరేకిస్తున్నాం

వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు 

 
 విశాఖపట్నం : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను ప్రైవేట్‌ కంపెనీలకు ధారాదత్తం చేస్తే చూస్తూ ఊరుకోమని వైయస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దాడి వీరభద్రరావు పేర్కొన్నారు. స్టీల్‌ ప్టాంట్‌కు చెందిన 3400 ఎకరాల భూమిని పోస్కో సంస్థకు కేటాయించాలన్న కేంద్రమత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ ప్రకటనను వ్యతిరేకిస్తున్నామని ఆయన తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కొరకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు రూ.4,890 కోట్లు కేటాయిస్తే  కేంద్రానికి  పన్నుల రూపంలో స్టీల్ ప్లాంట్ రూ.40,500 కోట్లు చెల్లిందని పేర్కొన్నారు. 

రెండు లక్షల కోట్ల విలువైన భూమిని విదేశీ ప్రైవేటు సంస్థలకు రూ.4849 కోట్లకు సెబీ కట్టబెట్టే యత్నం చేస్తోందని ఆరోపించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు ఇనుప గనులు కేటాయించాలని  ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోని కేంద్రం టాటా, జిందాల్ లాంటి ప్రైవేటు కంపెనీలకు గనులు కేటాయించిందని మండిపడ్డారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను నిర్వీర్యం చేయడానికి కుట్ర జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోకపోతే 1970 తరహాలో మరో మారు భారీ ఉద్యమం తప్పదని వీరభద్రరావు హెచ్చరించారు.
 

Back to Top